Monday, February 8, 2016

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు.

పురోహితులగు బ్రాహ్మణోత్తములారా!

శ్రీ దత్త స్వామి ఉపన్యాసము (తెలుగు అనువాదము) : 'ప్రవృత్తించ నివృత్తించ జనా న విదు రాసురా:' అని గీతలో భగవానుడు చెప్పియున్నాడు. దీని అర్ధము - 'రాక్షస స్వభావముగల ఈ మానవులకు మోక్ష మార్గమే కాదు, లౌకిక మార్గము కూడ తెలియదు'అనియే. రాక్షస స్వభావము అనగా - స్వయముగా తెలియదు, పరులు చెప్పినది వినరు అనియే. అజ్ఞానముతో కూడిన అహంకారమే దీనికి కారణము. లౌకిక కర్తవ్యములగు వివాహము మొదలగు శుభకార్యములు ఎట్లు చేయవలెనో తెలియక, అవసరమైనది చేయక, అనవసరమైనది చేయుచు, ప్రవృత్తిలో కూడా మూఢులగు చున్నారు. మధ్యతరగతి కుటుంబమునకు చెందిన ఒక భక్తుడు లక్షన్నర కూతురికి కట్న కానుకల క్రింద ఇచ్చి, ఐదు లక్షలు పెట్టి పెళ్ళి చేసినాడు. దీనికి తారుమారుగా చేయవలెను. ఐదు లక్షలు కూతురికి ఇచ్చి లక్షన్నరతో   పెళ్ళి చేయవలెను.  అసలు ఆరు  లక్షలు కూతురికి ఇచ్చి, అరలక్షతో పెళ్ళి చేయుట

ఉత్తమము. ఒకరు 'ఎంత ఎక్కువ ఖర్చు చేసిన అంత ప్రేమ కూతురిపై ఉన్నట్లు' అని అన్నారు. ఈ మాట ఎంత మాత్రము నిజము కాదు. ఎంత కూతురి పేరు మీద పెట్టినావో అంత ప్రేమ కూతురిపై ఉన్నది అనుట ముమ్మాటికి నిజము. నీవు ఖర్చు పెట్టినదంతయు నీ అహంకారమును వ్యక్తము చేయు ఆడంబరమే కాని ఇది నిజముగా ప్రేమ కాదు. ఇట్టి భావమే రాక్షసత్వమని గీతావచనము (ఈశ్వరోహమహం ...). 'ఇట్లు ఖర్చు పెట్టుట జీవితములోని మధురస్మృతి' అని కొందరు వాగుచుందురు. ఇట్లు వాగువారిలో రెండు వర్గములున్నవి. మొదటి వర్గము - పెళ్ళి ఖర్చులో దోచుకొనిపోవు మేళము, పూల పందిరి మొదలగు వ్యాపారులు. వీరు తమ వ్యాపారము సాగుటకై ఇట్టి మాటలు కల్పించినారు. వీరు వ్యాపార వృద్ధికై ఇట్లు చెప్పుటలో కొంత న్యాయమున్నది. ఇక రెండవ వర్గము వారు బంధు మిత్రులు. వీరు ఇట్లు చెప్పుటకు కారణము - పెళ్ళి ఖర్చు చేత నీవు నలిగి బీద వాడైనచో నీ కన్న వారు సంపన్నులుగా పై స్ధాయిలో

ఉండగోరుటయే. ఇట్టి కోరిక వారికి తెలియకయే అంతరాత్మలో దాగియుండును. దీనిని అవ్యక్త ప్రాక్తన సంస్కారమందురు (sub-conscious state). దీని వలన అకారణముగా కొన్ని మాటలు పలుకుట, కొన్ని పనులను చేయుట జరుగుచుండును. కన్యాదాత మనస్సులో కూడా అతడు గుర్తించని సంస్కారము దాగి యుండును. అట్టి సంస్కారము ఏమనగా - అతని మనస్సులో కీర్తి కాంక్ష దాగి యుండును. పది మంది తన చుట్టూ చేరి తాను చేయు ఘనకార్యమునకు ప్రశంసాభావముతో తన చుట్టూ జనులు చేరి యుండవలయుననియే. అట్టి అవకాశము తాను ఏదో ఒక లోకోద్ధరణ కార్యము చేసినపుడు జనులు అట్లు చుట్టూ చేరవలయును గానీ ఈ విధముగా కాదు. కానీ తన జీవితములో అట్టి అవకాశము లేనపుడు ఈ విధముగానైనను సంతృప్తిపడు అవకాశముగల కీర్తికాంక్షయే దీనికి అసలు కారణము. ఈ కారణమును కప్పిపుచ్చి 'కూతురిపైగల ప్రేమతో పెళ్ళి బాగుగా చేయుచున్నాను' అని పలుకుచుండును. ఈ సంస్కారము చాలా మందికి తెలియకపోవుట వలన, అది వారిలో ఉన్నట్లు  ఎవరైననూ చెప్పినను అంగీకరించజాలరు.

నీవు నీ స్ధాయిని అనుసరించి ఖర్చు చేయవలెను. ధనవంతులను అనుసరించి పులిని చూచి నక్క వాతపెట్టుకొన్నట్లు చేయరాదు. అట్లు అనుకరించి మధ్య తరగతి కుటుంబీకులు అప్పులపాలై అలమటించుచున్నారు. సంపన్నులు కూడా 100 కోట్లు కట్నకానుకల నిచ్చి 5 కోట్లు పెట్టి పెళ్ళి చేయుచున్నారు. అనగా కట్నములో 20వ వంతు పెళ్ళి ఖర్చు చేయుచున్నారు. కాని మన మధ్య తరగతి వారు కట్నకానుకల కన్న 20 రెట్లు పెళ్ళి ఖర్చు చేయుచున్నారు? కట్నకానుకల నిషేధముపై నినాదము చేయుచున్నవారు అనవసర పెళ్ళి ఖర్చుల నిషేధముపై ఏల నినాదము చేయరు? కట్నకానుకలను దాచుకొను అవకాశము కలదు. కాని జారిపోయిన పెళ్ళి ఖర్చులకు అట్టి అవకాశమే లేదు కదా! నీవు ఆరు లక్షలను కూతురి పేర పెట్టినచో అది ఎన్నో రెట్లు అగును. ఆమె కష్టములలో అక్కరకు వచ్చి ఆమె జీవితము మధురముగనుండును. కష్టములు వచ్చినపుడు ఆ మధుర స్మృతిని ఎంత తలచినా కష్టములు పోవునా? దోచుకొని పోయిన మేళము, పూల పందిరి వారు వచ్చి కష్టములను తీర్చెదరా?

నీవు  పెళ్ళి చేయునపుడు బంధు మిత్రులను పిలచి అన్న వస్త్రాది దాన మర్యాదలను చేయుచున్నావు. దానము అపాత్రులకు చేసినచో పాప ఫలము వచ్చి, వధూవరులు కష్టముల పాలు అగుదురు. పాత్రులకు ఇచ్చినచో పుణ్యము వచ్చి వధూవరులు సుఖపడుదురు. పాత్రులకు దానము చేయక పోవుట, అపాత్రులకు దానము చేయుట - ఈ రెండునూ పాపములని భారతములో వ్యాస వచనము. నీవు పెండ్లికి పిలచినపుడు పాత్రులు ఎవరు అను విచక్షణతో పిలువలేదు. కేవలము గుడ్డిగా బంధు మిత్రులను పిలచినావు. వారిలో చాలా మంది నిజముగా అపాత్రులే. నివృత్తిలోనే కాదు, కనీసము ప్రవృత్తిలో కూడా ధర్మము లేనివారే. ఇట్టి వారి ఆశీస్సులతో వధూవరులు అనేక కష్టముల పాలగుచున్నారు. కావున గీత ఆరంభములో గుడ్డి బంధు వ్యామోహముతో నున్న అర్జునుని వలె కాక, విచక్షణతో పరులైనను పాత్రులను పిలచి సన్మానించినచో వధూవరులు సుఖింతురు. అట్టి పాత్రులు దొరకనిచో బిచ్చగాండ్రకు అన్న దానము చేయుము. వారు కనీసము అన్నము పారవేయక తిందురు. వడ్డించిన ఆహారమును కణము కూడా పారవేయక తినుటయే భోక్త   యొక్క కనీస యోగ్యతా లక్షణమని వేద శాసనము (అన్నం న పరిచక్షీత ...). ఈనాడు పెళ్ళి విందులో ఎంత ఆహారమును పారవేయుచున్నారు! ఒక చోట విందు జరుగు చున్నది. గోడకు ఇటు వైపు ఆహారమును పారవేయుచు కొందరు విందును ఆరగించుచున్నారు. గోడకు అటు వైపు పారవేసిన ఆహారమును బిచ్చగాండ్రు వెతికి వెతికి తినుచున్నారు. అప్పుడు అచ్చట ఉన్న శ్రీ సత్యసాయి భగవానుని ఒక భక్తుడు ఇలా ప్రశ్నించినాడు. 'ఏమిటి ఈ సృష్టి వైపరీత్యము! ఒక వైపు అట్లు పారవేయుట! మరొక వైపు అట్లు ఏరుకొనుట!' బాబా ప్రశాంతముగా  పలికినారు. 'ఆ ఏరుకొను వారు పూర్వ జన్మమున ఇట్లు పారవేసినవారే. నాడు పారవేసిన దానిని నేడు వెతుకుకొను చున్నారు'. కావున ఆహారమును పారవేసినవారు మరు జన్మలో బిచ్చగాళ్ళ జన్మ నెత్తుదురు. అంతే కాదు. పెళ్ళి విందును ఏర్పాటు చేసిన కన్యాదాతయు, అట్టి వారిని తీసుకు వచ్చిన వరుని తండ్రియు, ఆ పాపము యొక్క భాగస్వాములై (కర్తా కారయితాచైవ ...), ఎన్ని విస్తర్లలో ఆహారము పారవేయబడినదో అన్ని జన్మలు బిచ్చగాళ్ళుగా పుట్టుదురు. ఆహారమును కణము కూడా పారవేయరాదని వేద వచనములో (పరిచక్షీత ...) 'పరి' అను ఉపసర్గ బోధించుచున్నది. అట్లే ధనమును పైసయు దుర్వినియోగము చేయరాదు. అట్లు చేసినచో దరిద్రులుగా జన్మింతురు. కూతురికి ఇచ్చుట, పాత్రులకు ఇచ్చుట, బిచ్చగాళ్ళకు దానము చేయుట ధన సద్వినియోగము. అపాత్ర్ర దానము, అనవసరముగా  స్ధాయికి మించిన ఖర్చు ధన దుర్వినియోగము.

అన్నమును పారవేసినవారు అన్నపూర్ణను, ధన దుర్వినియోగము చేసినవారు లక్ష్మీదేవిని, అవమానము చేసిన వారు కావున శివకేశవుల క్రోధమునకు గురి అగుదురు. కన్యాదాత, వర పక్షము వారిని తన శక్తి  భక్తుల ననుసరించి అతిధి మర్యాదలను చేయుచున్నాడు. అతిధి దైవ స్వరూపమని వేద ధర్మము. ఈ మర్యాదలే పెళ్ళి ఖర్చు యొక్క స్వరూపము. మర్యాదలను ఎవరైనను సహజముగా మన:స్పూర్తిగా చేయవలయునేగాని, ఫలానా మర్యాదలు చేయవలయునని అడుగరాదు. అడిగి బలవంతముగా చేయించుకొన్నవి మర్యాదలు అనబడవు. అభిమానముతో మన:స్పూర్తిగా చూపించు భక్తి గౌరవములే నిజమైన మర్యాదలు. కన్యాదాతచేయు సహజమైన మర్యాదలను మంచి దృష్టితో స్వీకరించుటయే ఉత్తమ సంప్రదాయము.

వివాహముయొక్క ముఖ్య ఉద్దేశ్యము: అచ్చట చదువు మంత్రముల యొక్క అర్ధములను తెలుసు కొనుటయే.  వివాహ సంస్కారము యొక్క ప్రధాన లక్ష్యము: గృహస్థాశ్రమములో ధర్మార్ధ కామములకును తరువాత వానప్రస్థములో మోక్ష సాధనకు కావలసిన అన్యోన్య సహకారమునకు మూలమైన దైవానుగ్రహమును దైవ స్తుతులచే సాధించుకొనుటయే. ఆ దైవ స్తుతులే వివాహ మంత్రములు. కానీ, మంత్రముల యొక్క అర్ధములను పురోహితుడు తెలియక పోవుటచేత ఆ అర్ధముల యొక్క వివరణములు అందించబడుటలేదు. కావున ప్రధాన లక్ష్యముపై ఉండవలసిన దృష్టి ఎప్పుడో జారిపోయినది. అనవసరమైన ఇతర లక్ష్యములు అచ్చట చోటుచేసుకొన్నవి. అవియే వేడుకల ఆడంబరములు, బహుమతుల వ్యాపారము, పరస్పర ఆక్షేపణములు, కన్యాదాతను బెదరగొట్టు విమర్శలు మొదలగునవి. ఈ విధముగా ఈ వివాహ సంస్కారము భ్రష్టమైనది. దీనికి మూలకారణము పురోహితుడు కేవలము వేదమును బట్టీపట్టి వేదార్ధమును తెలియలేక వివరించలేక పోవుటయే. ఇతర మత గ్రంధములు వారి మాతృభాషలో ఉండుట చేత ఇతర మతస్ధులు సంస్కారములు చేసుకొనునపుడు వారికి ఈ దు:స్ధితి పట్టలేదు. హిందూమతములో ప్రాచీన ఋషులు తమ మాతృభాష సంస్కృతము కావున ఈ మంత్రములను ఎట్టి వివరణలేకయే అర్ధము చేసికొనెడివారు. కాని ఈనాడు సంస్కృత భాష పురోహితులకే రాదు. కావున మంత్రార్ధ వివరణకు ఎట్టి అవకాశములేక దురాచారములకు దారితీయుచున్నది. ఉదాహరణమునకు: ఆబ్దికమునకు వచ్చిన భోక్తలు అన్నసూక్తమును పఠించుచు దాని అర్ధము తెలియక ఆహారమును పారవేయుచున్నారు. భోజనముకు ముందే యజమాని 'నీకు ఇష్టమైనది ఉంచుకొని ఇష్టము కాని దానిని త్యజించుము' అని చెప్పుచున్నాడు (యత్‌ రోచతే ...). ఈ వాక్యము సంస్కృతములో ఉండుటచే ఎవరికిని అర్ధమగుటలేదు. ఈ వాక్యము ప్రకారముగా భోక్తలు ఇష్టము కాని పదార్ధములను ఎంగిలి చేయకముందే దొప్పలో ఉంచవలెను. వారి భోజనము తరువాత ఈ దొప్పలో ఉన్న పదార్ధములను గురించి యజమాని 'వీటిని ఏమి చేయవలయున'ని ప్రశ్నించును (అన్న శేష: కింక్రియతాం ...). అప్పుడు భోక్తలు వాటిని ఎంగిలి చేయలేదు కనుక 'ఇష్టులతో కలసి భుజించమ'ని పలుకుదురు (ఇష్టై: సహ భుజ్యతాం ...). ఎంగిలి చేసినది ఇతరులు తినరాదు (యదుచ్ఛిష్ట మభోజ్యం చ...) కనుకను, ఆహారమును పారవేయరాదు   కనుకను (అన్నం న పరిచక్షీత ...), ఈ ఏర్పాటు ఇట్లు చేయవలసి వచ్చినది. ఆపస్తంబ సూత్రములు సూచించిన దొప్ప యొక్క అంతరార్ధమును మనము నేడు పాటించ వలయును. అది ఎట్లు అనగా - నీవు వడ్డించునపుడు భోక్తకు ఇష్టమా కాదా? అని అడిగి వడ్డించుము. లేదా విస్తరి వద్ద ఒక పళ్ళెమును ఉంచి ఇష్టములేని పదార్ధములను ఎంగిలి చేయక ముందే దానిలో ఉంచమని వారికి విన్నవించుము. విందులో కూడా వడ్డన తరువాత కొందరు పళ్ళెములను తీసుకొని తిరుగుచు ఇష్టములేని పదార్ధములను ఎంగిలి చేయక ముందే వాటిలో ఉంచమని తినువారికి చెప్పవలెను. కొందరు పారవేసిన అన్నమును జీవరాశులు భుజించును కావున పుణ్యమేనని కుతర్కము చేయుచున్నారు. అట్లు జీవరాశులకు అన్నము పెట్టుట నీవు తినక ముందే చేయవలయునని వేద వచనము. మరియు పారవేసిన అన్నము భూతరాశులు తినకపోవు అవకాశము కూడా కలదు. అప్పుడు పారవేసిన అన్నము చెడి రోగకారక క్రిములను పుట్టించుచున్నది. ఆ క్రిములు దైవ భక్తులగు సజ్జనులను రోగములతో బాధించినప్పుడు నీకు పాపము కలిగి దానివలన బిచ్చగాని జన్మమునెత్తుచున్నావు.

వేదార్ధము తెలియక మరియు దానిని చర్చించక పోవుటవలన ఇచ్చట అనేక  అపార్ధములు వచ్చినవి. 'ఇష్టములేని దానిని త్యజించుము' అనగా 'తిన్నంత తిని పారవేయమ'ని అపార్ధమును తీసినారు. అట్లు  పారవేయుటకే ఆ దొప్పను ఉపయోగించినారు. అట్లు పారవేసిననే భోక్త సంతృప్తి చెందినట్లుయని విపరీతార్ధమును సృష్టించినారు. అన్న శేషము అనగా వంట ఇంటిలో మిగిలిన వంట అని అన్నారు. అది ఎటూ అందరూ తినుటకే వండినది కావున దానికి భోక్తల అనుమతి అవసరము లేదు. వీటినన్నింటిని అన్నము పారవేయరాదన్న వేద ప్రమాణము ఖండించుచున్నది. వేద ప్రమాణమునకు ముందు ఎట్టి వాదములు నిలువజాలవు గదా (శ్రుతి స్మృతి విరోధేతు ...)! మరియూ యోగశాస్త్రము ప్రకారము పొట్టకు సగభాగమే భుజించవలయును గదా! అర్ధము తెలియక పోవుట అను అజ్ఞానముతో పాటు జ్ఞానులు చెప్పునది తిరస్కరించుట అను అహంకారము ఏర్పడుట వలన రాక్షసత్వము వచ్చినది. దైవము రాక్షసులను ఎప్పుడునూ శిక్షించుచునే ఉన్నది. అజ్ఞానులగు ఇతరులు తప్పు చేసినచో క్షమించవచ్చును గాని, లోకమును నడిపించవలసిన గురువులే తప్పు చేసినచో క్షమార్హులు కారు. కావుననే పురోహితులకు దరిద్ర బాధ అంటుకొన్నది. అన్నపూర్ణయు ధాన్యలక్ష్మియు అగు అన్నమును పారవేయుట వలన ప్రతిరోజు ఆహారమును అన్వేషించవలసిన స్థితికి దిగజారినారు.

వేదార్ధము తెలియక పోవుటవలన యజ్ఞ స్వరూపము గూడా అపభ్రష్టమైనది. అర్ధము తెలియని వేద పాఠకుడు అధముడని స్మృతియే చెప్పుచున్నది (అనర్ధజ్ఞో... పాఠకాధమా:).  అగ్ని మూడు విధములు: లౌకికాగ్ని, వైద్యుతాగ్ని మరియు దేవతాగ్ని. లౌకికాగ్ని అనగా సమిథలతో చేయుమంట. వైద్యుతాగ్ని అనగా విద్యుత్‌కు సంబంధించినది అనగా విద్యుత్‌ శక్తి. ఇక దేవతాగ్ని అనగా దేవతా స్వరూపమై జఠరములో ఉండు వైశ్వానరాగ్ని అనబడు ఆకలి మంటయే (అహం వైశ్వానరో భూత్వా ... గీత). మొదటి రెండు అగ్నులు యజ్ఞ సాధనములు. అనగా వీటి సహాయము చేత ఆహారమును వండ వలయును. ఇట్లు వండిన ఆహారమును ఆకలి మంట గల వానికి పెట్టుటయే యజ్ఞ పరమార్ధమైన హోమము.  ఈ ఆకలి మంటయే దేవతా స్వరూపమైన వైశ్వానరాగ్నియై ఉపాసించ బడవలసిన యజ్ఞము యొక్క ఉపాస్యాగ్ని అనబడును. ఇట్లు శ్రేష్ఠమైన ఆహారమగు ఘృతము మరియు అన్నమును ఆకలితో ఉన్నవానికి పెట్టుటయే యజ్ఞము. ఘృతము అనగా నేతితో కూడిన అన్నము లేక నేతితో కలిపి వండబడిన పిండివంట యగు ఆహారమని లక్షణావృత్తి శాస్త్రము ద్వారా గ్రహించ వలెను. ఇట్లు గ్రహించక ఘృత శబ్దమును కేవలము నేతిగాను, అగ్ని శబ్దమును లౌకికాగ్నిగాను,  అర్ధము తీసుకొని నేతిని నిప్పులలో పోసి తగులపెట్టువాడు మూఢుడని విష్ణు అవతారమగు కపిల ముని భాగవతములో బోధించినాడు.  మరియు భాగవతములో కృష్ణ భగవానుడు యజ్ఞములో వండిన అన్నమును అగ్నిలో సమర్పించకముందే ఆకలితో నున్న గోపాలురకు పెట్టమని మునిపత్నులకు బోధించినాడు. అగ్నిలో ఆహారమును దగ్ధము చేయుటయే వేదార్ధమైనచో భగవానుడు వేదధర్మమును విరోధించెడివాడా? ఇట్లు ఆహారమును తగులపెట్టు దురాచారము కూడా వేదార్ధము తెలియక పోవుటవలననే వచ్చినది. వీరి అన్న దారిద్య్రమునకు ఇది ఒక కారణము. ఇట్టి యజ్ఞ ధూమము వలన వర్షములు కురియవనియు, దాని వలన కరువులు, వరదలు, వాతావరణ కాలుష్యము మొదలగు ప్రమాదములు వచ్చునని నేటి విజ్ఞాన శాస్త్రము నిరూపించుచున్నది. ఈ ధూమము వర్ష కారణమని పలుకుట ఎంత వెర్రి తనము!

యజ్ఞము విజ్ఞాన శాస్త్రముతో సమన్వయింపబడవలెనని వేదవచనము (విజ్ఞానం యజ్ఞం తనుతే...). నాడు జనసమ్మర్దము తక్కువగానుండి వృక్షములు ఎక్కువగా నున్నందున యజ్ఞ ధూమము వాతావరణ కాలుష్యమును కలుగజేయ లేదు. నాడు ఆ ధూమము చేత ఆశ్రమములలో దోమలను పారద్రోలుట, అగ్ని నిరంతరము వెలుగుటచేత క్రూర జంతువులు దూరముగా పోవుట మొదలగు ప్రయోజనములు ఉండి ఉన్నవి. కానీ నేడు అట్టి అవసరములేదు. మరియు వైద్యుతాగ్ని కూడా భౌతికాగ్నియే కావున విద్యుత్‌ శక్తితో పనిచేయు పోయిని కూడా వంటకు ఉపయోగించుటలో  తప్పు లేదని స్పష్టము. బ్రహ్మజ్ఞుడగు సద్గురువునందు సర్వదేవతలు వసింతురు (యావతీర్వై ...). అట్టి సద్గురు పురోహితుని ఆకలి మంట నీ ఆహారముచే సంతృప్తి చెంద, సర్వ దేవతా తృప్తి వలన వర్షములు కురియును. ప్రాచీన కాలములో లౌకికాగ్నిని జ్వలింపచేయుటకు కొంచెము నేతిని చక్షుషీ హోమములను పేరున వాడినారు. దీనికి కారణము అగ్నిని జ్వలింపచేయుటకు కిరోసిన్‌ వంటివి నాడు లేకపోవుటచే, నేతిని వాడినారు. మిగిలిన ఘృతము (ఘృతాహారము) నంతయు ఆకలిగొన్న వారికి ఆహారముగా ఇచ్చుటయే యజ్ఞము. పానీయములను ఇచ్చుట సోమ యజ్ఞము. అల్పాహారమును ఇచ్చుట హవిర్యజ్ఞము. భోజనము పెట్టుటయే పాక యజ్ఞము. ఆకలితో ఉన్న పురోహితుడే అగ్నియని ప్రధమ వేద ప్రధమ మంత్రము (అగ్ని మీళే ...). అట్టివానిని మొట్టమొదట ఆహార దానముచే అర్చించమని అగ్ని శబ్దము యొక్క అర్ధము కావున అగ్రి శబ్దము నుండి అగ్ని శబ్దము పుట్టినది. గురువగు ఆ పురోహితుడు ఆహారమును స్వీకరించి జ్ఞానమును బోధించు జ్ఞానాగ్ని స్వరూపునిగా  చెప్పబడుచున్నాడు (ఆగ్నేయోవై బ్రాహ్మణ:). కేవల శబ్దమాత్రముగా చెప్పబడు మంత్రముతో చేయు కర్మ, ఫల రహితమని యాస్క మహర్షి వచనము (అనగ్నావివ). .కావున కేవల వేద ధ్వని ఏమియూ చేయజాలదు. కావున వేదమును బట్టీపట్టుట మానుకొని వేదార్ధబోధను చేయు జ్ఞాన యజ్ఞమును నిర్వహించు గురువులుగా పురోహితులు మారవలెను. వ్రాత సాధనములు లేని పూర్వ కాలమున వేదములను కంఠస్ధము చేసి పరంపరగా అందించ వలసిన అవసరము ఉండి ఉన్నందున, బట్టీపట్టి వేదములను రక్షించుట చేసిన ప్రాచీనులు అభినందనీయులే. నాడు బట్టీపట్టుటతో పాటు వేదార్ధ విచారమును కూడా చేసి వేద పాఠకులేకాక వేద పండితులుగాను ప్రసిద్ధినొందిరి (అధ్యేతవ్యో జ్ఞేయశ్చ ...). అసలు వేద శబ్దమునకు అర్ధమే జ్ఞానమైనపుడు (విదుల్‌ జ్ఞానే ...) వేదార్ధము ఎంత ముఖ్యమో ఆలోచింపుడు.

ఉపనయనములో గాయత్రీ మంత్రోపదేశము కూడా అర్ధము తెలియక వెర్రి దోవలకు దారి తీసినది. ఉప-నయనము అనగా జీవుని దైవము వైపునకు త్రిప్పుటయే. జీవులను దైవము వైపునకు నడిపించు వాడే బ్రాహ్మణుడని శబ్దార్ధము (బ్రహ్మ నయతి ఇతి బ్రాహ్మణ:). గాయత్రి అనగా గానముచే దైవమును ప్రార్ధించుటయే (గాయంతం త్రాయతే ...). ఆనగా ప్రతి జీవునకు బాల్యములో  భగవంతుని గురించిన గానమును నేర్పించుటయే ఉపనయనము మరియు గాయత్రీ మంత్రోపదేశము. దీనికి కులము మరియు లింగముల విచక్షణ లేదు. ఒకానొక వైదిక ఛందస్సు పేరు గాయత్రి (గాయత్రీ ఛంధ:). గాయత్రి, దేవతా నామము కాదు. సృష్టిని చేయు సవితయనబడు భగవంతుడే దేవత (సవితా దేవతా...). ఇట్లు వేదార్ధ విచారమును చేయక గాయత్రి అనగా దేవతయనియు, గాయత్రీ ఛందస్సులో గల ఒకానొక పద్యమును గాయత్రీ మంత్రమనియు, అది కేవలము ఒకానొక కులములో గల పురుషులకు మాత్రమే వర్తించుననియు అపార్ధము చేసి హిందూమతములో కుల ద్వేషమునకు, లింగ వివక్షతకు దారిజూపి, హిందూమతములో ఐకమత్యమును పాడుచేసియున్నారు. గానమయమై, అర్ధము తెలియు మాతృభాషలో పదే పదే ఉచ్చరింపజేయు భగవంతుని గుణగానమే గాయత్రీ మంత్రము. వీరు చెప్పు గాయత్రీ మంత్రములో గానమేలేదు. అర్ధము తెలియదు. మనస్సునకు ఆకర్షణ లేదు. బలవంతముగా పదే పదే ఉచ్చరించుట చేత అది గాయత్రీ మంత్రమే కాదు. మనస్సును ఆకర్షించి పదే పదే మననము చేయించు దైవగానమే గాయత్రీ మంత్రము. అప్రయత్నముగా మనస్సును ఆకర్షించునదియే మంత్రము (మననాత్‌ ఇతి). అట్టి ఆకర్షణమును కలుగజేయు శక్తి వచనముకన్నను, పద్యముకన్నను గానమునకే ఎక్కువ కలదు. కావున గానాత్మకమైన భగవంతుని గీతము సర్వ శ్రేష్ఠమని చెప్పుటయే గాయత్రి యొక్క శ్రేష్ఠ తత్త్వము. అందుకే వచనమైన యజుర్వేదముకన్నను, పద్యమైన ఋగ్వేదము కన్నను, గానమైన సామవేదమే సర్వ శ్రేష్ఠమైనది (వేదానాం సామవేదోస్మి - గీత). విశ్వములోగల అన్ని భాషలకు ఇది వర్తించును కావున విశ్వ జనులకు అందరికిని హితముచేయు బోధకుడే విశ్వామిత్రుడు అనబడుచు దీనికి ఋషి అయి ఉన్నాడు (విశ్వామిత్ర ఋషి:).

వేదార్ధమును బోధించిననాడు పురోహితుడు ఆచార్యుడై వెలుగునని వేదధర్మము (ఆచార్యవాన్‌ పురుషో వేద...). ఉదాహరణకు: ఉపనయనములో మూడు పోగులుగల యజ్ఞోపవీతమును ధరించుటలో త్రిగుణ స్వరూపమైన ప్రకృతి రూపమగు మనుష్య తనువును ఆశ్రయించిన పరబ్రహ్మమగు సద్గురువును ఆశ్రయించి గానముతో కీర్తించవలయునని చెప్పుటకై జందెమును పట్టుకొని గాయత్రిని జపించుటలోని అంతరార్ధము. ఊహలకు సైతము అందని పరబ్రహ్మము, త్రిగుణ ప్రకృతి రూపమును ఆశ్రయించి అవతరించునని బోధించుటయే బ్రహ్మూెపదేశము.   సాక్షాత్తు పరబ్ర్రహ్మమును పట్టలేము కావున అది ఆశ్రయించిన ప్రకృతి-ఉపాథిని ఆశ్రయించుటచేత పరబ్రహ్మముయొక్క సమీపమునకు (ఉప) పోగలమే (నయనము) తప్ప అన్య మార్గము లేదు. సూర్యోపస్థాన ప్రకరణములో అచేతన  ప్రకృతి రూపమగు సూర్యుని, పరబ్రహ్మకు ప్రతీకగా (ఆదిత్యం బ్రహ్మేతి...) ఉపాసించుట విషయము. ఆదిలోనే త్రిగుణ ప్రకృతి రూప మానవ రూపమగు సద్గురువును అన్వేషించుట కష్టముగాన, అచేతన ప్రకృతి రూపమును ప్రతీకగా    ఉపాసించునప్పుడు సృష్టి అంతయు త్రిగుణ స్వరూపమే కావున మూడు పోగుల జందెము ఇచ్చట కూడా సమన్వయించును. బ్రహ్మచర్యమునుండి తిరిగి వచ్చిన తరువాత (సమావర్తనము), సద్గురువును ముక్తి మార్గమునకు అన్వేషించుట వేదోక్తము (సగురు మేవాభి గచ్ఛేత్‌). ఇట్లు మంత్రములను ఆయా ప్రకరణ విషయములకు అనుసంధానము చేసి అన్వయించి వివరించవలయును. ప్రకరణార్ధమే తెలియనివారు ఇక మంత్రార్ధ సమన్వయమును ఎట్లు చేయగలరు? ఇట్లు అసలు అర్ధము తెలియకపోవుట వలన వేడుకలు దూరి ఈ సంస్కారములను పెడద్రోవను పట్టించుట వలన బ్రహ్మజ్ఞాని అగు వటువును సైతము 'వడక పెళ్ళికొడుక'ని పిలచుచున్నారు!

వివాహమును జరిపించునపుడు స్నాతకము, వరపూజ, స్థాలీపాకము, నాకబలి, హోమము అనునవి ముఖ్య ప్రకరణములు. స్నాతకము అనగా బ్రహ్మచర్యాశ్రమమును ముగించి జ్ఞానియై బయటకు వచ్చుటయే. వేదవచనము ప్రకారముగా పరబ్రహ్మస్వరూపుడగు సద్గురువును అన్వేషించుచు సంన్యాసాశ్రమమునకు బయలుదేరుటయే (తదహరేవ ప్రవ్రజేత్‌...). అట్లు అన్వేషించుచు శంకరులు గోవింద భగవత్పాద సద్గురువులను ఆశ్రయించినారు. కానీ ఈ మార్గము భగవదవతార పురుషులగు శంకరాదులకే సాధ్యము. ఈ మార్గములో ధర్మార్ధ కామములు త్యజించబడుచున్నవి.  కేవలము మోక్ష మార్గమగు సంన్యాసమే సూచించబడుచున్నది. ఇది సామాన్య జీవులకు అసాధ్యము. ఈ తత్త్వమును తెలియక స్నాతకుడైన యువకుడు ఆవేశముతో సంన్యాసమునకు బయలుదేరుటయే కాశీ యాత్ర. కాశీ యనగా జ్ఞానముతో ప్రకాశించు సద్గురు స్వరూపమే (కాశతే ఇతి...). అట్టి సద్గురువును చేరుటకు చేయు ప్రయాణమే కాశీ యాత్ర.  సామాన్య జీవుడగు యువకుడు దానిని సాధించలేక పతితుడగునను ఆశయముతో ఆచార్య ప్రేరితుడై కన్యాదాత, అట్టి యువకుని 'గృహస్థాశ్రమమును ప్రవేశించి,  ధర్మార్ధ కామములను నిర్వర్తించి, భార్యా సహాయుడై మోక్ష మార్గమును సాధించు వానప్రస్థమును ప్రవేశించమ'ని బోధించుచున్నాడు. అట్టి స్నాతకునకు కన్యాదానము చేస,ి వాని క్రమముక్తి మార్గమునకు సహాయపడు కన్యాదాత, వరుని, సత్పాత్రుడగుట వలన లక్ష్మీనారాయణ స్వరూపునిగా భావించి, సత్పాత్రదానము యొక్క పుణ్యమును ఆర్జించుటకై వరపూజను చేయుచున్నాడు. ఈ క్రమముక్తి మార్గములో కూడా తుదకు దైవాన్వేషణయే లక్ష్యము. వానప్రస్థములో భార్య ఆహారమును వండి పెట్టుటచేత, భిక్షాటన క్లేశము లేక కాలమును సత్సంగముతో సద్వినియోగము చేసుకొనవచ్చును. సంన్యాసాశ్రమములో భిక్షాటనలో కొంతకాలము వ్యర్ధమగును.  అందుకే తన శిష్యుడగు మండనమిశ్రుని భార్యయగు ఉభయభారతిని శంకరులు తమ వెంట ఉంచుకొని  భిక్షాటన కాల క్లేశమును పరిహరించి, సర్వకాలమును జ్ఞాన చర్చలతో గడిపినారు. ఇట్టి సహకారమును కన్య చేయగలదు అని నిరూపించుటయే స్థాలీపాక ప్రకరణము.  గిన్నెతో వంట చేయుటయే స్థాలీపాకము.  దీనిని జ్ఞానులకు నివేదించటయే నాకబలి అర్దము. నాకము అనగా స్వర్గము. నాకము చేత స్వర్గవాసులగు దేవతలు చెప్పబడుచున్నారు. వారికి ఆహారమును నివేదించుటయే నాకబలి. ఉభయభారతి వంటచేసి శంకరులకు, వారి శిష్యులకు వడ్డించెడిది. వంటచేయునపుడు భార్య సత్సంగములో పాల్గొనలేదు. కావున ఆ సత్సంగ సారమును భర్త తన భార్యకు వివరించ వలసిన ఆధ్యాత్మిక బాధ్యతను స్వీకరించుటయే మరియొక జందెమును ధరించుట. సంన్యాసము, ఒంటరిగా నడచు కాలి నడక వంటిది. గృహస్థాశ్రమములో ఇట్టి సౌకర్యము ఉండుటవలన త్వరగా గమ్యమును చేరు అర్ధమే వివాహ శబ్దమునకు కలదు (విశేషో వాహ:). ఒక విశేష వాహనము ద్వారా గమ్యమును చేరుటయే వివాహము. ఇక హోమము అనగా ఆకలిమంటయగు జఠరాగ్ని స్వరూపమైన వైశ్వానరాగ్నిలో ఆహారమును సమర్పించుటయే కాని నిప్పులో నేతిని పోయుటకాదు. ఈ విధముగా వివాహము యొక్క అంగములన్నియు దైవమే లక్ష్యముగా కలిగి దైవ స్తుతి స్వరూపమగు జ్ఞాన యజ్ఞముగా ఆచార్యుడు జనులకు వివరించుటయే వివాహముయొక్క ముఖ్య లక్ష్యము. ఈనాడు ఈ లక్ష్యముయొక్క అణుమాత్ర జ్ఞానము కూడా తెలియక, కేవలము లౌకికములైన వేడుకలగా వివాహము ముగియుట హిందూమతముయొక్క అత్యంత శోచనీయమైన దురవస్థ.

కావున పురోహితులగు బ్రాహ్మణోత్తములారా! లెండు. మేల్కొనుడు. వేదములను బట్టీపట్టుట మానుడు. నేడు వేదములు ముద్రితములై సురక్షితముగనే ఉన్నవి. కావున మీరు వేదార్ధమును విచారము చేయుటకు సంస్కృతమును నేర్చుకొని, శాస్త్రములను మధించి, వేద పండితులుగా మారి హిందూమతములోని అన్ని సంస్కార క్రియలను జ్ఞాన యజ్ఞములుగా తెలుసుకొని, సర్వ జనులకు బ్రహ్మ జ్ఞానమును బోధించి, భగవత్‌ భక్తిని పెంచి, హిందూమతమును ప్రాచీన సనాతన స్ధాయికి చేర్చి మీరు బ్రహ్మర్షులుగా ప్రకాశించండి. కేవలము బట్టీపట్టి వేదములను చదివి, ద్రవ్యములతో కర్మలను చేయించి కూలీని సంపాదించు కూలీలుగా జీవించవలదని బోధించిన యాస్క మహర్షి హితోపదేశమును  గుర్తు తెచ్చుకొనుడు (స్వర్ణ భార హర:). ఇట్లు బట్టీపట్టిన వారు దేవ పశువులనియు, బ్రహ్మర్షులగు బ్రాహ్మణులకు బంధువులు మాత్రమే తప్ప బ్రాహ్మణులు కాదనియు వేదమే ఆక్షేపించుచున్నది  (దేవానాం  పశు రహహ...,  బ్రహ్మబంధురివ...).  పురోహితుడు జ్వలించు అగ్నియని ఋగ్వేదముచే ఆదిమంత్రములో కీర్తించబడుచున్నాడు. అట్టి పురోహితుడు జ్ఞానమును వదలి, వేదమును కేవలము బట్టీ పట్టి చదువుటచేత ఎంత నవ్వులపాలు అయినాడో ఆలోచించండి. పురీషము, రోషము, హింస, తస్కరుడు అను నాలుగు శబ్దములయొక్క ఆద్యాక్షరములే పురోహితుడని ఆక్షేపించుట ఎంత బాధాకర విషయము (ఆద్యాక్షరాణి సంగృహ్య చక్రేధాతా పురోహితం...). మండుచున్న నిప్పులవలె ప్రకాశించు బ్రహ్మర్షులు, నాడు జనులచే ఎంత గౌరవించబడినారు! నేడు అవే నిప్పులు చల్లారి బొగ్గులై, బూడిదయై జనుల పాదములచే తొక్కబడుచున్నారుగదా (జ్వలితం న హిరణ్య రేతసం, చయమాస్కందతి భస్మనాం జన: - భారవి)!.

శ్రీ దత్త స్వామి వారు (శ్రీ జన్నాభట్ల వేణు గోపాల కృష్ణమూర్తి) హిందూమతోద్ధరణమును గురించి ఇచ్చిన దివ్యోపన్యాసములలో నుండి గ్రహింపబడిన ప్రధమోపన్యాసము.

At the lotus feet of Shri Datta Swami
-Prasad