Saturday, August 15, 2009

భగవంతుని ఎందుకు ఆరాధించాలి?

ప్రశ్న: మనకు ధనం ఉన్నది. పిల్లలంతా బాగున్నారు. ఏ కష్టాలు లేవు. అయితే భగవంతుని ఎందుకు ఆరాధించాలి?

స్వామి: నాయనా విను! మనం మరణించిన తర్వాత జీవుడు మర్త్య లోకంలో నుండి ప్రేత లోకం లోకి వెళ్ళుతాడు. ప్రేతలోకంలో పదిరోజులు విచారణ జరుగుతుంది. అక్కడ నిర్ణయిస్తారు.

1) పుణ్య కర్మలకు జీవుని స్వర్గలోకమునకు పంపుతారు.
2) పాప కర్మలకు జీవుని నరకలోకమునకు పంపుతారు.
3) మిశ్రమ కర్మలకు జీవుని పితృలోకానికి పంపుతారు.

పై లోకాలలో ఈ జీవుని ఉతికి, పాప ప్రక్షాళనము చేసి పంపుతారు. తర్వాత కర్మ శేషంతో మర్త్య లోకంలో మరల పుడతాడు. ఆ లోకాలలో ఎంత ఉతికినా ఇంకా కొంత కర్మశేషంతో మర్త్యలోకంలో ఆ జీవుడు ఒక పాపగా పుడతాడు. ఈ లోకంలో పెరుగుతూ మరల కొంచెం కొచెం కర్మలు పెంచుకుంటాడు. చేసిన కర్మలే ఫలాలను ఇస్తున్నాయి.

కనుక దేవుణ్ణి ఎందుకు భజించాలి- అంటే కర్మఫలం తప్పనప్పుడు ఇంకా దేవుణ్ణి ఎందుకు భజించాలి అని సందేహం. ఇది ప్రశ్న. నాయనా! నీ సందేహం తీరాలంటె అసలు ఏమి జరుగుతున్నదో నీకు పూర్తి అవగాహన కావాలి. అప్పుడు నీకే అంతా బోధ పడుతుంది. కనుక శ్రద్ధగా విను. తర్వాత నీకే బోధపడుతుంది. సంతృప్తి చెందుతావు.

ఎవరు చేసిన కర్మ ఫలాలను వారె అనుభవించాలి. ఇది సత్యం. మనం చేసే కర్మల యొక్క తీవ్రతను బట్టి మనం చేసే కర్మ ఫలాలకు వెంటనే ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని కర్మ ఫలాలు ఆ లోకంలో అనుభవించాలి. మిగిలిన కర్మఫలాలతో మళ్ళీ పుడతాడు. భగవంతుడు ఇట్లు సమ ఏర్పాట్లు చేస్తున్నాడు. నిరంతరం తీపి తినిన ఎట్లు వెగటు వేస్తుందో, అట్లే దుఃఖం తర్వాత దుఃఖం వచ్చినట్లైతే ఎలా భరించలేని బాధ అవుతుందో అని భగవంతుడు జీవుని సౌకర్యం కోసమే జీవులందరికి కర్మ చక్రం చక్కగా ఏర్పాటు చేశాడు. భగవంతుడు మన కర్మ ఫలాలను మార్చి మార్చి జన్మ చక్రం ఏర్పాటు చేశాడు.

భగవంతుడు మనకు ఏర్పాటు చేసిన చక్రాన్ని మనం చక్కగ అనుభవించుచూ, భగవంతునకు మనం కృతఙ్ఞులమై యుండవలసి యుండగా, మనం ఏం చేస్తున్నామో చూడండి. సుఖాలు వచ్చినప్పుడు భగవంతునే మరచి పోయి సుఖాలను అనుభవిస్తున్నాము. అయితే కష్టాలు వచ్చినప్పుడు జపాలు చేయించి కర్మ ఫలములను రద్దు చేయించుకోవటానికి ప్రయత్నిస్తున్నాము. అంటే మన ఉద్దేశ్యం ఏమిటి? కర్మ సిద్ధాంతాన్ని సృష్టించిన పరమాత్మ మనకు చేసిన కర్మ ఫలాలను రద్దు చేసి, మనం చేయని మంచి ఫలాలను మనకు ఇవ్వాలనేగా? ఇది ధర్మమా? ఇది ఎట్లా కుదురుతుంది?

స్వామి మన కర్మ ఫలాలను ఎలా రద్దు చేస్తాడు? మనం చేయని పుణ్య ఫలాలను ఎలా ఇస్తాడు? ఐతే స్వామి ఏమి చేస్తాడు? మన పాప కర్మ ఫలాలను వచ్చే జన్మకు తోసివేస్తున్నాడు. అంతే. మనం ఏమనుకుంటున్నాము. మనం అఙ్ఞానులమై మనం చేసిన పూజలు, జపాల వలననే భగవంతుడు మన కర్మ ఫలాలను రద్దు చేశాడని భావిస్తున్నాము. మనం సంతోషిస్తున్నాము. కానీ, నిజానికి భగవంతుడు మన కర్మ ఫలాలను రద్దు చేయలేదు. వచ్చే జన్మకు బదిలీ చేశాడు. అంతే. పైగా దీని ఫలితమేమిటి? ఈ కష్టాలు వచ్చే జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి. ఇక పుణ్యఫలం విషయమేమిటి? వచ్చే జన్మలోని పుణ్యఫలాన్ని తగ్గింపుతో ఈ జన్మకు బదిలీ చేశాడన్న మాట. రెండు వైపులా నష్టమే. కనుక - మనం చేసే పూజల వల్ల ఆయన వేసిన తీర్పును మార్చమంటున్నామని అర్ధము. ఇది మన అఙ్ఞానము కాదా. "అహం బీజ ప్రద పితా" అను పరమాత్మ తన బిడ్డల కోసమే కర్మ చక్రం నిర్ణయించారు. "అవస్యం అనుభోక్తవ్యం కృత కర్మ శుభాశుభమ్" కనుక మనం చేసిన కర్మ ఫలాలను మనం అనుభవించవలసినదే. అంతే. కనుక మనం ఏ కోరికలు కోరరాదు. మన కష్టాలు తీసివేయడు. మనం కోరిన సుఖాలు ఇవ్వడు. అయితే ఆయనను ఎందుకు పూజ చేయాలి?

అంటే భగవంతుని కల్యాణ గుణాల వల్ల ఆకర్షించబడి ఆయనను ప్రేమించి సేవించాలి. మనం ఏ ఫలాలు స్వామి నుండి కోరరాదు. భగవంతునిపై అట్టి భక్తి మనకు ఎప్పుడు ఏర్పడుతుందో అప్పుడు ఆయన మనుష్య శరీరం ఆవహించి అవతరిస్తాడు. ‘‘సంభవామి యుగే యుగే’’ అన్నాడు గీతలో. త్రేతాయుగంలో శ్రీరామునిగా, ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా, నరావతారము దాల్చి వచ్చాడు గదా. ప్రతి తరంలో స్వామి నరావతారములో వస్తున్నాడు.

భగవంతుని ఎందుకు ఆరాధించాలో తెలుసుకోవటం చాలా అవసరమే. భగవంతుని ఆరాధిస్తే ఆయనయే జీవుని ఆదుకుని నడిపిస్తాడు. ఏమి ప్రతి ఫలాపేక్ష లేని మహా భక్తుల పాప కర్మ ఫలాలను తాను ఆకర్షించి ఆయన అనుభవించి ముక్తులను చేస్తాడు. అది నరావతారంలోనే సాధ్యమవుతుంది. అట్టి భక్తులకు స్వామికి ఎన్ని సౌకర్యాలు ఉన్నవో వాళ్ళకు అవే సౌకర్యాలు ఉంటాయి. స్వామి కలుగ చేస్తాడు. వారికి పుట్టుట, మరణకష్టం ఉండదు. అట్టి భక్తులు మరణించినప్పుడు స్వామి వారితో వస్తాడు. యమధర్మరాజు ఎదురు వచ్చి విచారణ లేకుండా ఆ భక్తుని బ్రహ్మలోకానికి పంపుతాడు. ఇప్పుడర్ధమయినదా! భగవంతుని ఎందుకు పూజించాలో.

ఇంకా విను. నీకుమారులలో ఎవరైతే నీ ఆస్తిలో ఒక పైసాకూడా ఆశించక నీకు సేవ చేస్తాడో అప్పుడు నీవు సంతోషించి వాడికి నీ ఆస్తి రాసి ఇస్తావు. అట్లే భగవంతుని ఏమి ఆశించక, నీయొక్క సర్వస్వము ప్రాణములతో కూడా సమర్పిస్తావో అప్పుడు స్వామి సంతోషించి నీకు తనను తానే సమర్పించుకుంటాడు. బైబిలులో ఏసుక్రీస్తు ఏమన్నాడు అంటే-‘‘నేను శాంతి కొరకు రాలేదు. కత్తి తీసుకు వచ్చాను. కుటుంబములో కలహం పెడతాను. కుటుంబంలో ఇద్దరికి ముగ్గురు కలహిస్తారు. తండ్రి కొడుకు, తల్లి కూతురు, అత్త కోడలు ప్రతిఘటిస్తారు. ఎందుకు? ఆ బంధాలు తెంపితే గాని, నీకు భగవంతుడు చిక్కడు గనుక. అదే వేదములో ఏమని చెప్పబడి ఉన్నది? భగవంతుడు అందరి కంటే ఎక్కువ అని తెలుసుకొని సర్వాన్ని, తన ప్రాణాన్ని కూడా యివ్వటానికి సిద్ధమై యుండాలి అని గదా!

హనుమంతులవారు, కన్నప్ప, వీరిని చూడండి. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు స్వామి నుండి ఏ ప్రతిఫలం కోరలేదు. స్వామీ! నీవే కావాలి. నిన్నే నమ్ముకున్నాను. అని సర్వస్వ శరణాగతి చేశారు. స్వామి కార్యంలో పాల్గొన్న హనుమంతుని చూడండి. ఐతే మనం ఏం చేస్తున్నాము? ఏమంటున్నాము. ‘‘స్వామీ! ఈ తుచ్ఛమైన ధనాన్ని, ఈ తుచ్ఛమైన పిల్లలకు, బంధు వర్గానికి ఇస్తున్నాము. కానీ పవిత్రమైన మా మనస్పును, హృదయాన్ని నీకు సమర్పిస్తున్నాము.’’ అని అసత్యాలను పలుకుచున్నాము. స్వామిని మోసం చేస్తున్నాము. ఆలోచించండి. ఇది ఈ జగత్తులో జరిగే నగ్న సత్యమౌనా కాదా? విమర్శించుకోండి. కనుక- స్వామి మనం ఏం చేస్తున్నామో సర్వం ఎరిగిన పరమాత్మ-‘‘యేయధామాం ప్రపద్యంతే తాం స్తదైవ భజామ్యహం, అని గీతలో చెప్పినట్లే చేస్తున్నాడు. అనగా ఎవరు నన్నే విధముగా సేవింతురో వారిని ఆ విధముగనే నేను అనుగ్రహింతును’’ అని కనుక మనం ఏమి చేశామో స్వామి కూడా అదే చేస్తారు. నీవు మాటలు అర్పిస్తున్నావు. స్వామి కూడా నీకు మాటలతోనే సమాధానము చెప్పుచున్నారు.

నీవు రామాయణం చదువు. ఎక్కడైనా హనుమంతుడు ఒక దీపారాధన గాని, రామకోటి వ్రాయటం గాని చూడలేదు. ఐతే ఏం చేశాడు? నరాకారంగా వచ్చిన శ్రీరాముని గుర్తించి, శ్రీరాముని కార్యంలో పాల్గొని క్రియాత్మకంగా ఆచరించాడు. స్వామి హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ పదవినిచ్చారు. సృష్టి, స్థితి, లయాలను పూర్తిగా సర్వాధికారాలను హనుమంతునికి ఇచ్చారు. వాల్మీకి రామాయణం ప్రమాణం. రాముని కార్యం తప్ప స్వకార్యం ఏమీ లేదు. తన గుండె చీల్చి రాముని తన హృదయంలో చూపించాడు. రాముని కల్యాణ గుణములకు ఆకర్షించబడి స్వామి సేవ చేశాడు. కావున అలా చేసి తరించాలి. ఏ స్వార్ధం ఉండకూడదు. కన్నప్ప తన కన్నులను పెకలించి స్వామికి సమర్పించి ధన్యుడయ్యాడు. ఇక్కడ కూడ నిష్కామ సేవ, ఏ స్వార్ధం లేదు.
At the lotus feet of Shri Datta Swami
-దుర్గాప్రసాదు

4 comments:

  1. స్వామి మీ మెయిల్ కావాలి పంపగలరు .

    durgeswara@gmail.com

    ReplyDelete
  2. Please post your replies to dattapr2000@yahoo.com

    With best regards,

    Durgaprasad

    ReplyDelete