Monday, May 17, 2010

జ్ఞానము, ప్రేమ, ఆనందము

జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, ఆనందము శివుడు. ఇదే త్రిమూర్తి తత్త్వమైన వైదిక కళ్యాణ గుణ సంపద. ఈ మూడు గుణముల చేత త్రిమూర్తి స్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును. కాని పామరులు, అష్టనిద్ధులగు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా, దైవముగా గుర్తించుచున్నారు. ఈ పామర జనులు శిశువుల వంటి వారు. ఎవడు కిరీటము ధరించి రాజు వేషములో వచ్చునో, వాడినే రాజుగా తలచు అజ్ఞానులు. ఈ సిద్ధులు కొన్ని యంత్ర, తంత్ర, మంత్రముల ద్వారా ఎవరైనను సాధించుకొన వచ్చును. అనగా ఎవడైనను రాజు వేషమును వేయవచ్చును. కావున ఇట్టి పామరులు అట్టి క్షుద్ర మాంత్రికులు, రాక్షసులు శిష్యులుగా మారి, గుడ్డి వానిని గుడ్డి వారు పట్టుకొని వానితో సహా నిత్య నరకమను కూపములో పడుచున్నారు. వాడు కొన్ని సిద్ధులను సంపాదించినవాడే కాని జ్ఞానాంధుడు. ఇట్టి గురువులే "బాధిత గురువులు" ఈ బాధిత గురువులు అంతరార్ధమును వివరించి జ్ఞాన మార్గములో నడిపించ లేనివారు. వీరు కేవలము బాహ్యదృష్టితో భౌతికార్ధముతో ద్రవ్య తత్త్వమైన అజ్ఞానాంధకార మార్గములో శిష్యులను నడిపింతురు. వీరు యజ్ఞములను చేయించుటకు, చందాలు వసూలు చేసి ఆ ధనములో 90 శాతము వారు సంగ్రహించి, మిగిలిన 10 శాతమును నేయిగా మార్చి అగ్నిలో దగ్ధము చేయుదురు. ఈ యజ్ఞము వలన నేటి విజ్ఞాన శాస్త్రము ప్రకారముగా వాతావరణ కాలుష్యము పెరిగి అతివృష్టికి, అనావృష్టికి దారి చేయుచున్నది. ఈ గురువులు యజ్ఞములోని అంతరార్ధమును వివరించలేరు. ఈ శిష్యులు కూడ వారి వారి లౌకిక కార్యములు నెరవేరుటకు చందాలనిచ్చుచున్నారే గాని విశ్వ కళ్యాణమునకు కాదు. ఆ చందాలను వాడు కాజేసి పారిపోవగా ఈ శిష్యులు వానిని పోలీసులకు పట్టించుచున్నారు. వాడు చేసినది అధర్మమే. కానీ వీరు చేసినది అధర్మము కాదా! నాకు కాంట్రాక్టు రావలయునని, పదివేల రూపాయలు చందాగా యిచ్చుచున్నాడు. ఆ వచ్చిన కాంట్రాక్టులో పది లక్షల ప్రజాధనమును అపహరించుచున్నాడు. వీడు కూడ ప్రజల నుండి చందాలు వసూలు చేసి ధనమును దొంగిలించిన వాడు కాదా! వీరి దొంగతనము నిర్విఘ్నముగా నెరవేరుటకు దైవమునకు పదివేల రూపాయలు లంచము నిచ్చినాడు. వానిని పోలీసుల కన్న కఠినులగు యమభటులు పట్టుకొందురు. నారాయణుని పాలనలో ఎవరును దేనిని తప్పించుకొనజాలరు. మనుష్యజన్మ కడు దుర్లభము. మనుష్య జన్మ వచ్చినను భగవంతుని చేరయలయునని శ్రద్ధ ఉండుట ఇంకనూ దుర్లభము. ఈ రెండు ఉన్ననూ, మూడవది మరీ మరీ దుర్లభము. అది ఏమనగా నారాయణుడే నర రూపములో వచ్చి గురువుగా లభించుట. ఆట్టి పురుషునే అవతార పురుషుడు, మహా పురుషుడు లేక పురుషోత్తముడు అందురు.

"మనుష్యత్వం ముముక్షత్వం, మహాపురుష సంశయః" అనగా మనుష్య జన్మ దుర్లభము. మోక్షాసక్తి మరీ దుర్లభము. మహా పురుషుడు లభించుట మరీ మరీ దుర్లభము అని అర్ధము. ఇట్టి బాధక గురువులు జ్ఞాన తత్వము లేని వారైనందున జ్ఞాన యజ్ఞమును చేయలేక కేవలము ద్రవ్య యజ్ఞములతో గురువులుగా కీర్తి పొందుటకు ప్రయత్నించెదరు. వీరికి అంతర్ముఖ దృష్టి లేక కేవలము బాహ్యదృష్టితో ఆడంబరముగా యజ్ఞములు చేయుట, గుడులు ఆశ్రమములు కట్టించుట విచక్షణారహితముగా అన్నదానము చేయుట మొదలగునవి చేయుచుందురు. ఏ విధమైన పనియు చేసి సంపాదించుకొనుటకు చేతగాని, పసి బాలుడు, వృద్ధుడు, వికలాంగుడు మరియు రోగగ్రస్తుడు ఈ నలుగురు మాత్రమే అన్నదానమునకు అర్హులు. కాని ఈనాడు జరుగు అన్నదానములను చూచినచో, కోటీశ్వరులు కూడా వచ్చి, ప్రసాదము తినిన గాని వారి పనులు నెరవేరవని తలచి నాలుగు మెతుకులు నంజుకొని మిగిలినది పారవేయగా ఆ విస్తళ్ళను మురికి కుండిలలో పడవేయగా ఆ ఆహారము వలన రోగకారకములైన అనేక క్రిములు వర్ధిల్లుచున్నవి. చివరకు అన్నదానము రోగములను కలుగ చేసి ప్రాణులను హింసించు సూక్ష్మ క్రిములగు రాక్షసులకు చేరును. ఈ విధముగా ఈ అంధ గురువులు చేయు స్వకీర్తి కామముతో కూడిన ఆడంబరములతో కూడిన బాహ్య భౌతిక దైవ కార్యములతో గురువులకు గాని, శిష్యులకు కాని విశ్లేషణ విచక్షణ లేవు. దీనికి కారణము బ్రహ్మతత్త్వ గుణమగు జ్ఞానము లేకపోవుటయే. ఈ అజ్ఞానము చేత చేయు పనులన్నియు మహా పాపమునకు దారి తీయుచున్నవి. కాన వీరందరును, శాశ్వత నరకమున పడుదురు. "సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజ్నం సంతరిష్యసి" అని గీత. అనగా ఈ మహా పాపమను సాగరమును దాట దలచినచో, జ్ఞానము అను పడవను ఆశ్రయించుము.

గోటిచుట్టుపై రోకటి పోటు అన్నట్లు కొందరు పరమ మూర్ఖులు ఒకసారి గురువును ఎన్నుకున్నచో మరల మార్చరాదని వాదించుచున్నారు. దుష్టుడైనచో, భర్తనైనను విడాకులిమ్మని చట్టము ఘోషించుచున్నది. అట్లే దుష్టురాలైన భార్యను త్యజించమని మను స్మృతి చెప్పుచున్నది. "సజ్జస్వ ప్రియ వాదిని" అని మనుస్మృతి. అనగా ప్రేమతో నుండక ద్వేషముతో హింసించుచున్నచో అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తనైనను భార్య, బార్యనైనను భర్త త్యజించమని ధర్మ శాస్త్రములు చెప్పుచుండగా నిత్య నరక శాశ్వత హింసకు దారితీయు గురువును ఏల త్యజించరాదు? స్కూలులో ఒక విద్యార్ధి చేరినపుడు ఆ స్కూలు టీచరును గురువుగా భావించినాడు. ఆ తరువాత ఆ విద్యార్ధి కాలేజిలో చేరినపుడు కాలేజి లెక్చరరును గురువుగా భావించుచున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటిలో చేరినపుడు అచ్చటి ప్రొఫెసరును గురువుగా భావించుచున్నాడు. గురువును త్యజించరాదని నేను గురువుగా స్వీకరించిన స్కూలు టీచరును వదిలి పెట్టనని, కాలేజి లెక్చరరు అగు మరియొక గురువును స్వీకరించనని కాలేజీలో చేరని వాడు ఎంత మూర్ఖుడో తన సాధన యొక్క దశ వృద్ధి అగుచున్న కొలది గురువులకు గురువైన గురుదత్తుని గురువుగా స్వీకరించక మొదట ఓనమాలు దిద్ది పెట్టిన గురువునే పట్టుకొని వేళ్ళాడు మూర్ఖులను గురించి ఏమందుము? గురు శబ్ధము కేవలము పరబ్రహ్మము నందే వర్తించును. ఏలయనగా జ్ఞానము చేత అజ్ఞానాంధకారమును పోగొట్టు వాడే గురువు శబ్ధమునకు అర్ధము. జ్ఞానము స్వరూపముగా కలవాడు "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. కావున గురు శబ్ధము పరబ్రహ్మమునకే వర్తించును. సృష్టి, స్ధితి, లయ కారకుడగు దత్తాత్రేయుడే పరబ్రహ్మము కావున దత్తుడు ఒక్కడే గురుశబ్ధముతో పిలువబడవలసిన వాడు. గురువే బ్రహ్మము, బ్రహ్మమే గురువు. ఈ రెండు వాక్యములకు తేడా కలదు. కఠినముగ ఉన్నది వజ్రము. వజ్రము కఠినముగా ఉన్నది అని రెండు వాక్యములలో ఉన్న బేధము గ్రహించిన చాలును! మొదటి వాక్యము ప్రకారము కఠినముగా ఉన్న రాయి కూడా వజ్రము కావలసి వచ్చును. రెండవ వాక్యము ప్రకారము వజ్రము కూడ కఠినముగా ఉండును. అనగా ప్రతి గురువు దత్తుడు కాడు. కాని దత్తుడు మాత్రము గురువే. అనగా నర రూపములో ఉన్న కృష్ణుడు నారాయణుడే. కాని నర రూపములో ఉన్న ప్రతి గోపాలుడు మాధవుడు కాదు. కావున గురువును ఎన్నుకొనునప్పుడే ఎంతో వివేకముతో ఎన్నుకొనవలెను. అనగా నారాయణ లక్షణములను తెలిసి నరరూపములో నారాయణుని గురువుగా ఎన్నుకొనవలెను. అంతే కాని కంటికి కనిపించిన ప్రతి శుంఠను కూడా గురువు, స్వామీ అని పిలచుట పరిపాటి అయినది. ఈనాడు రిక్షావాడు కూడా గురువు గారు బండి ఎక్కుతారా? అని అడుగుచున్నాడు. అట్లే నల్ల వస్త్రములను ధరించి నలుబది రోజులు కూడా సిగిరెట్లు, సారాయి వదల లేని వానిని అయ్యప్పగా, స్వామిగా పిలుచుచున్నారు. కావున నరరూపమున ఉన్న గురుదత్తుని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలెను. నీవు ఆయనను వెతుక నక్కరలేదు. ఆయన పై విశ్వాసముతో ఆరాధించు చుండుము. ఆయన ఒకే సమయమున ఎన్నో రూపముల నెత్తగలడు. ఆయనయే స్వయముగా మీ ఇంటికి వచ్చును. ఆయనను గుర్తించి గురువుగా స్వీకరించిన తరువాత వదలిపెట్టకుము అనియే ఆ మాటకు అర్ధము. ఏలననగా ఆయన బహుమాయా ప్రదర్శకుడు. ఆయన మాయలో పడి విడిచివేయుదువేమో అని ఆ వాక్యము నిన్ను హెచ్చరించుచున్నది. గురువును వదలకుము అన్న వాక్యమును విచారించుము. గురుసాక్షాత్‌ పరబ్రహ్మ. గురువు అనగా శ్రీ దత్తుడే. కావున ఈ వాక్యమునకు, చివరకు ఏమి అర్ధము సిద్ధించినది? "శ్రీ దత్తుని వదలకుము" అని అర్ధము సిద్ధించినది. ఈ మాట చెప్పుటకు కారణమేమనగా, ఆయన మాయను చూపి జారిపోవును. కావున ఈ విధముగా శబ్ధములను, వాక్యములను, క్షుణ్ణముగా చర్చించి సత్యమును తెలుసుకొనుటయే "సదసత్వివేకము" అనబడును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment