Wednesday, September 15, 2010

అపిచేశ్చ దురాచార - గీత

"అపిచేశ్చ దురాచారః భజతేమాం అనన్యభాత్‌
సాధురేవ సయంతవ్యః సమ్యత్‌ వ్యవసితోసిన"
అని గీతలో స్వామి చెప్పినారు. అనగా ఎంత దురాచారుడైనను మరియొక వస్తువును గాని, మరియొక వ్యక్తిని గాని కోరక నన్నే ఏ జీవుడు భజించునో, అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు. అతడు చేసినది పుణ్యమే కదా! అనగా ఎంతటి పాపియైనను, స్వామి యొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు, అయితే అట్టి వాని యొక్క భక్తి అనన్య భక్తిగా ఉండవలయుననియు అట్టివాడు పాప ఫలమును పొందడనియు చెప్పబడి యున్నది. అనగా ఎన్ని పాపములు చేసినను, అనన్య భక్తితో స్వామిని సేవించిన వాడు పుణ్యాత్ముడని స్వామియే చెప్పుట సరిగా లేదని కొందరు భావించుచున్నారు. కాని సత్యమును విచారించినచో స్వామి చెప్పినది అక్షర సత్యమని తేలుచున్నది. ఏలననగా ఈ సర్వజగత్తును సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు ఆయురారోగ్యము లిచ్చిన వాడు, నీకు సకల భోగములను ఇచ్చి ఆనందిప చేయుచున్న వాడు స్వామియే. నీ శరీరము లోపల వున్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ కోశము, మూత్రపిండములు మొదలగు అనేక అవయవములను పని చేయించుచున్నవాడు స్వామి. నీవు స్వామికి సంపూర్ణముగా ఋణపడి యున్నావు. ఉదయకాలము నిన్ను నిద్ర నుండి లేయుచున్నట్లు చేయుచున్నవాడు స్వామి. నీవు స్వామికి ఏది సమర్పించినను, ఏ సేవ చేసినను ఆ ఋణము తీరదు. ఈ మానవ జన్మను ఎత్తుటకు ముందు, నీవు పరలోకమున విచారణకు నిలబడి యున్న సమయమున, నీ విచారణను ప్రక్కకు నెట్టించి నీకు మరల ఈ మానవ జన్మమును ప్రసాదించిన వాడు స్వామి. ఇన్ని ఉపకారములు చేసిన స్వామికి నీవు కృతజ్ఞతలు చెప్పకున్నచో కృతఘ్నత అను మహా పాపమును పొందుదువు. నీవు కృతజ్ఞతను చెప్పినచో అది మహా పుణ్యము. కృతజ్ఞతను మించిన పుణ్యము లేదు. కావున నీవు కృతజ్ఞతను చెప్పినచో, నీవు ఎన్ని పాపముల చేసిననూ అవి అన్నియు దాని కన్న తక్కువ కావున నీవు పుణ్యుడవే అగుదువు. ప్రతి దినము ఆయనకు కృతజ్ఞతలు చెప్పుచున్నచో నీ పుణ్యము +100 అగును. నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియు -99 మాత్రమే అగును. అప్పుడు +1 మిగులును. కావున స్వామి భక్తుడు పుణ్యాత్ముడే. నీవు కృతజ్ఞత వ్యక్తము చేయక దైవమును అంగీకరించక నాస్తికుడవైనచో నీ కృతఘ్నతా పాపము -100 అగును. నీవు ఎన్ని సార్లు పుణ్యకార్యములు చేసినను అవి అన్నియును +99 మించిపోలేవు. కావున అట్టి నాస్తికునకు -1 మిగులుచున్నది. అనగా భగవద్భక్తుడు ఎన్ని పాపములు చేసినను +1 మిగులుట చేత పుణ్యాత్ముడే అగును. ఆట్లే నాస్తికుడు ఎన్ని ధర్మ కార్యములు చేసినను -1 మిగులుట చేత పాపాత్ముడే అగును. ఏలననగా, కృతజ్ఞతకు మించిన పుణ్యము లేదు. కృతఘ్నతకు మించిన పాపము లేదు. అయితే ఈ శ్లోకము యొక్క అర్ధము ప్రకారము భగవద్భక్తుడైన చాలును ఎన్ని పాపములనైనను చేయవచ్చును అని కాదు. భగవద్భక్తుడై పాపములు చేసిన వానికి మిగిలిన పుణ్యము +1 మాత్రమే. కాని భక్తుడై పుణ్యము చేయువారి సంగతి ఏమి? భగవద్భక్తికి +100 పుణ్యకార్యములకు +99 మొత్తము +199 అగుచున్నది. కావున +1 గురించి చెప్పుట +1 తెచ్చుకొనమనుటయే. అట్లే నాస్తికుడై పాప కార్యములు చేయువాడు వాని నాస్తికత్వమునకు -100, వాని పాపకార్యములకు -99 మొత్తము -199 అగుచున్నది. ఇది -1 కన్నను -199 చాలా ఎక్కువ. కావున ఈ శ్లోకము యొక్క సారాంశము ఆస్తికుడై ధర్మమును ఆచరించువాడు పరమ పుణ్యాత్ముడు.

ఆస్తికుడై పాపములను ఆచరించని వాడు స్వల్పమైన పుణ్యాత్ముడు. అట్లే నాస్తికుడై ధర్మమును చేయువాడు స్వల్పమైన పాపాత్ముడు. నాస్తికుడై పాపములను చేయువాడు మహా పాపి యగును. అయితే ధర్మము అనగా నేమి? అధర్మము అనగా నేమి? ధర్మము, అధర్మము అను రెండు శబ్ధములు నీ తోటి జీవించు సాటి జీవుల వ్యవహారముకు సంబంధించినవి కాని స్వామికి సంబంధించినవి కావు. ధర్మము అనగా సజ్జనులను భగవద్భక్తులను బాధించకుండా వారికి ఉపకారము చేయుటయే. అట్టి వారిని బాధించుట, వారికి అపకారము చేయుట అధర్మము. ఈ ధర్మము మార్గ స్వరూపముగను, ఫలస్వరూపముగను ఉండును. ఈ రెండింటి లోపల స్వరూపమే ప్రధానము. ఫల స్వరూపము అనగా నీవు ఒక కర్మ చేసి చిట్ట చివరకు సాధించినది. దానినే గమ్యము లేక లక్ష్యము అందురు. గమ్యము ధర్మమైనచో మార్గము ధర్మమే. ఉదాహరణకు ఒక సజ్జనుడి జేబులో నుండి 10 రూపాయలను ఒక దుర్జనుడు దొంగిలించినాడు. ఆ దొంగిలించిన పది రూపాయిలు దుర్జనుడు తన స్వార్ధముకు వినియోగించుకున్నాడు. కావున ఇచ్చట లక్ష్యము అధర్మము. కావున దొంగతనము అధర్మము. కాని దుర్జనుని వద్ద నుండి ఆ పది రూపాయిలు దొంగిలించి ఆ సజ్జనునికి తిరిగి యిచ్చివేసినాము. ఈ రెండవ దొంగతనము అధర్మము కాదు. ఏలననగా లక్ష్యములో స్వార్ధము లేదు. లక్ష్యములో త్యాగమున్నది. లక్ష్యము ధర్మస్ధాపనయే. అయితే దుర్జనుడితో యుద్ధము చేయగలిగి యుద్ధము చేసి వానిని తన్ని ఆ పది రూపాయిలు లాగుకొని ఆ సజ్జనుడికి ఇచ్చినచో ఇచ్చట మార్గము, గమ్యము రెండు ధర్మములే అగుచున్నవి. కాని దుర్జనుని తన్నుటకు శక్తి లేనప్పుడు ధర్మ మార్గము అచ్చట కుదరదు. వాని వద్ద దొంగిలించియైనను దానిని సజ్జనునకు ఇచ్చివేయుటయే కర్తవ్యము. ఈ దొంగతనము పాపము కాదు. దొంగతనము చేయు నైపుణ్యము ఉండి కూడ ఈ సందర్భమున దొంగతనము పాపమని దొంగతనము చేయకున్నచో అట్లు చేయకపోవుటయే పాపమగుచున్నది. "రామో విగ్రహవాన్‌ ధర్మః" అన్నారు. అనగా రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపము అని అర్ధము. అట్టి రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపుట యుద్ధ ధర్మము కాదని వాలి రాముని ఆక్షేపించినాడు. కాని ఇచ్చట రాముడు చేసినది ధర్మమే. ఏలననగా వాలికి ఒక వరము కలదు. యుద్ధము చేయునప్పుడు ఎదుటి వాని శక్తి నుండి సగము వాలికి లభించును. దీని వలన వాలిని ఎవడు జయించలేడు. వాలి అధర్మమును చేసినాడు. సుగ్రీవుని భార్య యగు రమను బలవంతముగా భార్యగా చేసుకొని, సుగ్రీవుని వెడలకొట్టినాడు. అప్పటి కాలమున వానరులలో దేవర న్యాయమున్నది. అనగా సోదరులలో ఒకరు మరణించినపుడు మరణించిన వాని భార్య ఇష్టమైనచో బ్రతికియున్న సోదరునికి భార్య కావచ్చు. కాని సుగ్రీవుడు మరణించలేదు. మరియు రమకు ఇష్టము లేదు. కావున ఇది రెండు విధములుగను అధర్మమే. అయితే వాలి ఎందుకు ఇట్లు చేసినాడు? దుందుభి యను రాక్షసునితో యుద్ధము చేయుటకు ఒక కొండ గుహలోనికి వాలి పోవుచు సుగ్రీవుని కాపలా పెట్టి నెల రోజులలో నేను తిరిగిరానిచో, నన్ను మరణించి నట్లుగా భావించి తిరిగి పోమ్మన్నాడు. నెల రోజులు దాటినను వాలి రాలేదు. కావున అన్న ఆజ్ఞ ప్రకారము అన్న మరణించెనని భావించి దుందుభి బయిటకు రాకుండగా ఆ గుహ ముఖమునకు పెద్ద రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యాభిషిక్తుడైనాడు.
వాలి భార్య తార ఇష్టపడి నందున దేవర న్యాయ ప్రకారముగా సుగ్రీవునకు భార్యయైనది. కాని అచ్చట వాలి దుందుభిని చంపి తాను రాకుండా సుగ్రీవుడు రాతిని అడ్డము పెట్టినాడని క్రోధావేశముతో అన్నమాట మరచి వచ్చి తార, రమ సహితుడైన సుగ్రీవుని చూచి రెట్టించిన కోపముతో సుగ్రీవుడు ఏమి చెప్పినను వినక, సుగ్రీవుని వెడలకొట్టి రమకు ఇష్టము లేకపోయినను, బలవంతముగా భార్యను చేసుకున్నాడు. భర్త మరణించినపుడు కూడ దేవర న్యాయములో స్త్రీ యొక్క అంగీకారము ప్రధానమైయున్నది. కావున చూచుటకు సుగ్రీవుడు చేసిన పని, వాలి చేసిన పని ఒకటిగా కనిపించును. కాని ఎంతో బేధమున్నది. కావున వాలి వధార్హుడు. ఆనాడు భారత దేశమంతయును ఇక్ష్యాకుల సామ్రాజ్యమై యున్నది. అనగా అయోధ్య రాజుదే కేంద్ర పభుత్వము. అయోధ్యరాజు భరతుడు. రాముడు తన రాజ్యమును 14 సంవత్సరములు మాత్రమే అప్పచెప్పినాడు. కనుక భారత దేశములో ఎచ్చట అధర్మము జరిగినను, శిక్షించుటకు రామునికి అధికారమున్నది. ఇది అంతయును రాముడు వాలికి వివరించి ఇట్లు చెప్పినాడు. వాలీ! నిద్రపోవుచున్న ఏ ప్రాణిని వధించరు. కాని ఒక పెద్దపులి గ్రామము పైబడి జనులను వధించున్నపుడు అది మేల్కోని యుండగా దానిని ఎవరును వధించలేరు. కాని అది నిద్రపోవుచున్నది. ఈ సందర్భమున ధర్మ శాస్త్రమును అతిక్రమించి దానిని వధించుట ధర్మసూక్ష్మము. ధర్మము కన్న ధర్మ సూక్ష్మము గొప్పది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment