Saturday, October 9, 2010

కల్యాణ గుణములు – స్వామి

సౌందర్యము అనునది ఒక కల్యాణ గుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్ధానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణ గుణములతో పరి పూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణ మగును. ఆది శంకరుల మనస్సు అంతయు బ్రహ్మజ్ఞానముతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము ఎంతో సుందరముగా బ్రహ్మవర్ఛస్సుతో నిండియున్నది. అట్లే కృష్ణుని మనస్సు ప్రేమతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము నందున షోడశ కళలు తాండవించుచుండును. రాముని మనస్సు శాంతితో నిండియున్నది. కావున ఆయన మనస్సు ప్రసన్నముగా ఎంతో కోమలముగా యుండును. బుద్ధుని మనస్సు కరుణతో నిండియున్నది. కావున ఆయన ముఖము నందు అమృతము చిందు చున్నది. ఈ విధముగా ఆత్మ సౌందర్యము బాహ్య సౌందర్యమునకు కారణమై యున్నది. దేహముతో పాటు బాహ్య సౌందర్యము నశించుచున్నది. కాని ఆత్మ సౌందర్యము జీవాత్మను ఆశ్రయించి నిత్యముగా యుండుచున్నది. ఈ గుణములను బట్టియే ముఖములో కళలు ఉండుచున్నవి. కావుననే ముఖమును బట్టియే గుణములు చెప్పుట వచ్చి యున్నది. కావున కల్యాణ గుణములలో ఒకే ఒక్క గుణము అగు సౌందర్యము దేహమును ఆశ్రయించి ఉన్నది. మిగిలిన కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు. ఈ కల్యాణ గుణములు వాక్కు నందు కూడ ప్రతిబింబించు చుండును. కావున పరమాత్మ యొక్క వాక్కు ఎంతో సుందరముగా యుండును. భగవద్గీతా శ్లోకముల యొక్క సౌందర్యము ఏ శ్లోకములకు లేదు. శ్రీ కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారము. కావున ఆయన మనస్సుతో సమానమైన ఆత్మ సౌందర్యము ఎచ్చటను కనుపించుట లేదు. అట్లే ఆయన వాక్కులగు భగవద్గీతా సౌందర్యము కూడా ఏ వాక్కులకును గోచరించదు. అదే విధముగా ఆయన రూపముతో సమానమైన బాహ్య సౌందర్యము ఎచ్చటను కనిపించదు. శరీరము యొక్క సౌందర్యము, ఆత్మ సౌందర్యము యొక్క గుణములు, ఆహారము మీద కూడా ఆధారపడి యుండును. సాత్వికాహారము తేజస్సును ప్రసాదించును. శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును సాత్వికాహారమగు పాలు, పెరుగు, వెన్న భుజించెడివాడు. ఆయన మాంసాహారమును ఎప్పుడును అంటలేదు. కావుననే భగవద్గీతలో సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగించు ఆహారమును గురించి స్వామి వివరించినాడు. సాత్వికాహారము సత్వగుణమును పెంచి తేజస్సును పెంచి బాహ్య సౌందర్యమును ఆత్మ సౌందర్యమగు కల్యాణ గుణములను వృద్ధి చేయును.

శ్రీ దత్త భగవానుడును ఎల్లప్పుడును గోక్షీరమునే స్వీకరించెడివాడు. కావున ఆయన ముఖమునందు బ్రహ్మవర్ఛస్సు ఒక సముద్రము వలె ఉప్పొంగు చుండెడిది. సత్వము జ్ఞాన కారకము కనుక ఆయన కున్న జ్ఞానము ఎవరికి ఉండెడిది కాదు. దత్తుని యొక్క వాక్కు ఎంతో మాధుర్యముతో నిండి కోటి వీణలు మీటినట్లుండును. కావున ఆహారము దేహము యొక్క రూపమునకు వాక్కుల యొక్క పద్ధతికి గుణములకు ఎంతో ముఖ్యమైనది. సాత్వికాహారముతో పాటు యోగము కూడ యుండవలెను. ఇది ఆహారము కన్నను ముఖ్యము. యోగము అనగా ఎల్లప్పుడును భగవంతుని గురించిన భావములు, వాక్కులు, క్రియలు ఉండుట. దీనిచే ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల మీద అందరు వ్యక్తుల మీద బంధము తెగిపోవును. లోకములో వ్యక్తుల మీద వస్తువుల మీద బంధములే అన్ని చింతలకు కారణము. కాలిన ఇనుప కడ్డీని పట్టుకుని చేయి బోబ్బలెక్కుచున్నదని పామరుడు కేకలు పెట్టును. అతడు ఇనుప కడ్డీ వేడిని తీసివేయమనియు, లేక తన చేతికి బోబ్బలు రాకుండా చేయమనియు భగవంతుని ప్రార్ధించుచున్నాడే తప్ప, ఆ ఇనుప కడ్డీని వదల లేకుండా యున్నాడు. ఇనుప కడ్డీ నుండి వేడిని తీసివేయుట లేక చేతికి బోబ్బలు ఎక్కకుండా చేయుట ఎంత కష్టము. ఇనుప కడ్డీని వదలి వేయుట ఎంత సులభము. సులభమైన పనులు చేసి చేయి కాలకుండా చేసుకొనుట జీవుడే స్వయముగా చేయవలయును. ఒక పని సులభముగా చేయు అవకాశముండగా భగవంతుని కష్టపెట్ట నేల? భగవంతునికి కష్టము కాదు అందురా? ఆ కష్టము కాని పనిని జీవుడే చేయవచ్చును గదా? అయితే ఈ లౌకిక బంధములను తెంచుకొనుట చేతకాక యున్నది అని జీవుని వాదము. అసలు జీవుడు ఏ ప్రయత్నము చేయకయే ఈ లౌకిక బంధములు సులభముగా తెగిపోవు ఏకైక మార్గము గలదు. అదే యోగ శాస్త్రము. దానికి అధినాధుడే శ్రీ దత్తాత్రేయుడు. అది ఏమి అనగా నీవు నీ మనో వాక్కాయ కర్మలన్నింటిని భగవత్పరము చేయుము. నీవు భగవంతుని మాధుర్యము రుచి చూడగనే ఈ లౌకిక బంధము లందు ఎట్టి ప్రయత్నము లేక స్వయముగనే నశించును. అమృతము త్రాగిన వాడు కాఫీని స్వయముగనే వదలివేయును. అప్పుడు కాఫీని వదలి వదలివేయుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. అమృతము రుచి చూడకుండా కాఫీని వదలుట అసంభవము. కావున భగవద్‌ యోగమునకు ప్రయత్నించుము. ఈ యోగము సిద్ధించిన వైరాగ్యము ప్రయత్నము లేకయే సిద్ధించుచున్నది. లౌకిక బంధములు తెగిపోయినచో నీకు ఎట్టి చింతలు ఉండవు. ఈ చింతయే ఒక మహాగ్ని. అగ్నిలో కాలిన వాడు బాహ్య సౌందర్యమును కోల్పోవును. చింతలో కాలిన వానికి ముందు ఆత్మ సౌందర్యము కాలిపోయి, దాని ప్రభావము చేత బాహ్య సౌందర్యము కూడ నశించును. కావున లౌకిక బంధములలో ఉండుచు యోగము ద్వారా చింతలు అను మంట అంటకుండ మెలుగు వాడే యోగి, అట్టి యోగియే పరమ సుందరుడు. ఈ లోకములో పరమ సుందరుడు ఎవరు అనగా హనుమంతుడు. అందుకే ఆయనను గురించిన కాండకు సుందరాకాండ అని పేరు వచ్చినది. ఆ కాండలో ప్రతిక్షణము క్లిష్టమైన సమస్యలలో హనుమంతుడు చిక్కుకుంటాడు. కాని ఆయనను ఏ చింత మంట అంటలేదు. ఇదే హనుమంతుని తోకకు అగ్ని అంటించిననూ ఆయన కాల లేదు అను ఘట్టములోని అంతరార్ధము. భగవద్గీతయను యోగ శాస్త్రమంతయును ఆత్మ సౌందర్యము, మరియు బాహ్య సౌందర్యములను కాపాడుకొను మార్గమే. సౌందర్య ఆది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు బోధించి యున్నాడు. కావున ఆయనను సత్యం, శివం, సుందరం అన్నారు.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

No comments:

Post a Comment