Sunday, July 12, 2009

గురుపూర్ణిమ దివ్య ప్రచచనము: కర్మఫలత్యాగము-4

గురుదక్షిణలను ఇచ్చిన తరువాత దానిని సద్గురువు ఏమి చేయునని పరీక్షించరాదు. పూర్ణ విశ్వాసముతో ఇయ్యవలెను. ఆయనను సద్గురువుగా నిశ్చయించిన తరువాత మరల పరీక్ష ఏల? అగ్ని అని నిశ్చయించిన తరువాత దానలో మరల వేలు పెట్టి పరీక్షించరాదు. నీ విశ్వాసము పూర్ణము కానిచో కోతి పిల్ల తన తల్లి పొట్టను పట్టుకొన్టట్లు ఉండును. ఒక స్థలము నుండి మరియొక్క స్థలమునకు తీసుకొనిపోవు బాధ్యత మాత్రమే తల్లిది. పట్టు బాధ్యత పిల్లది. కావున పడిపోవచ్చును. ఇదే మర్కట కిశోర న్యాయము. విశ్వాసము సంపూర్ణమైనచో మార్జాల కిశోర న్యాయముగా పిల్లి తన పిల్లను నోట కరుచుకొని తీసుకొని పోవును. సాయిబాబా గురుదక్షిణ ఖర్చు గురించి ఏ ఒక్కరు సాయిబాబాను ప్రశ్నించలేదు. ఒక ఇన్ కంటాక్స్ అధికారి ప్రయత్నించి విఫలుడయ్యెను. కటిక పేదవాడగు మహల్సాపతికి సాయి ఏమియును ఇచ్చుట లేదని భక్తులు బాధపడినారు. సాయి మహల్సాపతియొక్క స్థిర భక్తిని పరీక్షించుచున్నాడని భక్తులకు తెలియదు. సాయము చేసినచో ఆ పరీక్ష పాడగును. పరీక్ష లేకున్నను నీ స్థితి స్వామికి తెలియును. కాని మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నట్లు ఊహాలోకమున విహరించుచున్నారు. స్వామి బోధించిననూ నమ్ముటలేదు. పరీక్షలలో నిరూపింపబడినకాని నమ్మరు. కావున దత్తపరీక్షలు నీశ్రేయస్సుకే కాని సర్వజ్ఞుడగు స్వామికొరకు కాదు. ఈ పూర్ణిమ చంద్రుడును మీరు కూడబెట్టిన ధనమునే కాదు, దానిని గురుదక్షిణగా ఇచ్చినప్పుడు మీకు ఉండవలసిన పూర్ణ విశ్వాసరూపమగు మనస్సును సూచించున్నాడు. చంద్రుడు ధనమును, మనస్సును కూడా సూచించున్నాడు. ‘‘చంద్రాంహిరణ్మయీం’’, ‘‘చంద్ర మామనసో’’ అని చెప్పుచున్నది. సాయి తనకు దక్షిణలను ఇచ్చువానిని నేరుగా తాను ఈయదలచుకున్నవారికి ఇప్పించి ఉండవచ్చును కదా! వీటిని తీసుకుని ఆయన రహస్యముగా పంచెడివాడు. అట్లు చేయుట ద్వారా తనకు గురుదక్షిణలను ఇచ్చిన వారి యొక్క పూర్ణ వాశ్వాసమును పరీక్షించెడివాడు.

No comments:

Post a Comment