Wednesday, October 21, 2009

జీవుడు జీవుడే. దేవుడు దేవుడే.

"పరోక్ష ప్రియాఇవహి దేవాః ప్రత్యక్ష ద్విషః" అని శ్రుతి. అనగా దేవతలు సహితము ఎదురుగా నున్న దానిని ద్వేషింతురు. పరోక్షముగా ఉన్న దానిని ఆరాధింతురు. ఇక మానవుల విషయము చెప్పనేల? దేవతలు, ఋషులు సహితము అసూయ అహంకారము అను రెండు మహా సర్ప దంపతుల బారిన పడక తప్పదు. జీవునికి గల షడ్గుణములలో చిట్ట చివరిది మాత్సర్యము. దీనిని ఎవ్వరును అతిక్రమించలేరు. దేవతల అంశ గల పాండవుల సహితము స్వామి ఎన్ని విధముల బోధించినను గయుని వదలి పెట్టమన్నారు. స్వామి చెప్పినదే వేదము, స్వామి ఆచరించినదే ధర్మము అను పరాభక్తిని త్రోసిపుచ్చినారు. ప్రతి జీవుడిలోను సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములు ఉండును. సాత్వకుడు అనగా సత్వగుణము ఎక్కువ పాళ్ళలో కలవాడు. సత్వము నుండి జ్ఞానము జనించును. "సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" అని గీత. నూరు పాళ్ళు సత్వగుణము ఉన్నవాళ్ళు పరిపూర్ణ జ్ఞాని, సర్వఙ్ఞడు. సర్వఙ్ఞడు అనగా పరమాత్మయే అని అర్ధము. కావున ఎంత జ్ఞాని అయినను కొంత అజ్ఞానము ఉండక తప్పదు. ఈ అజ్ఞానము ఒక్కొక్క జీవునిలో ఒక్కొక్క సమయమున ప్రకోపించి ఉండునని గీత చెప్పుచున్నది. కృష్ణుడు పరమాత్మయేనని నమ్మి పరిపూర్ణ విశ్వాసము గల సాత్వికులగు పాండవులు సహితము గయుని విషయము నందు అజ్ఞాన ప్రభావములోపడిరి. హనుమంతుడు జ్ఞానులలో శ్రేష్ఠుడు. బుద్ధిమతాం వరిష్టం అనిపించుకున్నవాడు. కాని యయాతి రక్షణ విషయమున హనుమంతుడు సహితము అజ్ఞాన ప్రభావమునకు లొంగినాడు. యయాతిని తనకు అప్పగించమని స్వామి తనను ఆదేశించినాడు. స్వామి కోరినదే కర్తవ్యము అను పరాభక్తిని క్షణకాలము మాయ కప్పినది. తల్లియగు అంజనాదేవి యమాతిని రక్షించమని పుత్రుని ఆదేశించినది. స్వామి ఎక్కువా? తల్లి ఎక్కువ? అయనతో సమానుడు కాని అధికుడు గాని లేడు.

"న తత్సమః" అని శ్రుతి చెప్పిచున్నది. దీనికి కారణము స్వామి కృష్ణునిగా, రామునిగా నర స్వరూపమున కన్నుల ఎదుట ఉండుటయే. కావుననే భగవానుడు "మనుష్యాణాం సహస్రేషు కచ్చిత్‌ యతతి సిద్ధయే యతతామ్‌పి సిద్ధానాం కస్చిన్‌ వేతి తత్వత్‌" అని గీతలో వచించినాడు. అనగా స్వామి నరాకారమున ప్రత్యక్షముగ యుండగా గుర్తించుటకు ప్రయత్నించు వాడే వేలాది వేలలో ఒక్కడుండును. అట్లు ప్రయత్నించిన భక్తులలో ఏ ఒక్కరో స్వామిని గుర్తించి పూర్ణముగా విశ్వసింతురు. అట్లు పూర్ణముగా విశ్వసించిన వారు సైహితము ఎదో ఒక క్షణకాలమైనను అనుమానము రాక తప్పదు. దీనికి కారణము ఏ జీవునికైనను పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానము అసంభవము. "బ్రహ్మవిత్‌ బ్రహ్మైవ భవతి" అని శ్రుతి. అనగా పరిపూర్ణ బ్రహ్మజ్ఞానము గలవాడు పరమాత్మ ఒక్కడే. కావుననే ఆయన మీద క్షణకాలము కూడా అనుమానము రానివాడు ఆయన ఒక్కడే. దీని అర్ధము అసూయా అహంకారములు సాధనచే క్షీణించునే కాని ఏ జీవునకు పూర్తిగా నశించవు. కావున ఏ జీవుడు బ్రహ్మము కాడు. జీవుడు జీవుడే. దేవుడు దేవుడే.

ఒక కార్యము కొరకు దేవుడు జీవుని ఆవహించవచ్చును. ఆ సమయమున జీవునకును దేవునకును అద్వైతమే అయినప్పటికిని, ఆ కార్యము ముగిసిన తర్వాత దేవుడు తొలగిపోగా జీవుడు జీవుడే అగును. స్విచ్‌ని ఆపివేయగా విద్యుత్‌ తీగెలో ప్రసరించదు. అప్పుడు అది మామూలు తీగెయే అగును. క్షత్రియ సంహారము ముగియగా విష్ణువు అను విద్యుత్తు తొలగిపోవగా పరశురాముడు అను తీగె మామూలు తీగెగా మిగిలెను. అనగా ఆయన ఒక ఋషి మాత్రమే. దానినే అవేశావతారము అందురు. కాని రాముడు అట్టి తీగె కాదు. జననము మొదలు తుది నిమిషము వరకు రాముడు విద్యుత్‌ తీగెయే. కావున రాముని పూర్ణావతారమందురు. కృష్ణుడును అంతే. తుది శ్వాస విడచిన తర్వాత కృష్ణుని శరీరము కూడ విద్యుత్‌ పోయిన తీగెయే. కావుననే అర్జునుడు ఆ శరీరమునకు దహన సంస్కారములు చేసెను. దావాగ్నిని మింగి గోపికలను రక్షించిన ఆ కృష్ణ శరీరము ఆనాడు పరిమితమైన అగ్ని చేత దగ్దముగావింపబడెను. అయితే రామ, కృష్ణ శరీరములు ప్రాణము ఉన్నంత వరకు విద్యుత్‌ తీగెలు గనే ఉండెను. రాముడు తాను దేవుడని ఎవ్వరకునూ చెప్పలేదు. కావున పూర్ణావతారము. కాని కృష్ణుడు మాత్రము అనేక సమయములందు తాను దేవుడని ప్రకటించినాడు. కావున అది పరిపూర్ణవతారము. రాముడు ఉన్నప్పుడు ఆయనకు భక్తుల సంఖ్య ఎక్కువ శత్రువుల సంఖ్య తక్కువ. కృష్ణుడు ఉన్నప్పుడు భక్తుల సంఖ్య తక్కువ శత్రువుల సంఖ్య ఎక్కువ. దీనికి కారణమేమి?

రాముడు తాను దేవుడనని చెప్పలేదు కావున రాముడు దేవుడని విశ్వసించిన వారు ఎక్కువ. కృష్ణుడు తాను దేవుడనని చెప్పినందున విశ్వసించిన వారు చాలా తక్కువ. దీని తాత్పర్యమేనగా ఒక మానవుడు దేవుడని విశ్వసించు వారి సంఖ్యయే తక్కువ. దేవుడు జీవుడెట్లు అగును? అని వారి ప్రశ్న. నిజమే. జీవుడు జీవుడే దేవుడు దేవుడే. కాని జీవుని దేవుడు ఆశ్రయించినప్పుడు జీవత్వము మూగపోవును. దైవత్వము ప్రకటించబడును. తీగెను చేతితో పట్టుకొని ఆడుకొనవచ్చును. కాని తీగెలో విద్యుత్‌ ప్రవేశించినపుడు ఆ తీగెను స్పర్శ కూడా చేయలేము. ఏలననగా తీగె తన ధర్మములను మన కంటికి కోల్పోయినట్లు కనిపించకున్నను నిజముగా కోల్పోయి విద్యుత్‌ యొక్క ధర్మమునే పొందియున్నది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

No comments:

Post a Comment