Friday, November 12, 2010

కష్టములు – సుఖములు – యోగము

లోకములో కష్టములకు కుంగరాదు. సుఖములకు పొంగరాదు. సుఖములు పైకి లేచిన తరంగాలు కష్టములు క్రిందకు వచ్చిన తరంగములు. తరంగముల యొక్క బరువును తీసుకున్నపుడు ప్రతి తరంగమునకు శృంగము, ద్రోణి రెండు వుండును. శృంగమే సుఖము. ద్రోణియే కష్టము. ఒకదాని వెనుక రెండవది ఉండును. కాలచక్రము తిరుగుచుండగా చక్రములోని క్రింది అరలు పైకి, పై అరలు క్రిందికి వచ్చుచుండును. కావున కష్టము గానీ, సుఖము గానీ నిత్యము ఉండదు. అవి ఎండ నీడల వంటివి. నిరంతరము ఎండలో ఉండలేము. ఎండలో కష్టపడి పనిచేసి నేడకు వచ్చిన వాడు ఎంతో సుఖమును పొందును. అలానే కష్టములను అనుభవించిన తరువాత సుఖమును అనుభవించినచో, ఆ సుఖము ఎంతో రుచిగా యుండును. ఈ కష్టసుఝములు మనస్సులోకి ప్రవేశించరాదు. నీటి అలలో పడవ ఊగుచున్ననూ, ఆ పడవలో ఊయలలో ఊగు వినోదము పొందుచూ ప్రయాణించ వచ్చును. కానీ పడవకు చిల్లిపడి ఆనీరు పడవ లోనికి వచ్చినచో పడవ మునిగిపోవును. అట్లే కష్ట సుఖములు మనస్సులోనికి ప్రవేశించరాదు. కష్టములు వచ్చినపుడు కఠినముగను, సుఖములు వచ్చినపుడు సున్నితముగను ఉండవలెను. "వజ్రాదపి కఠోరణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహిని జ్ఞాతు మర్హతి" అని భవభూతి వర్ణించినాడు. "నప్రహృ ష్వేత్‌ ప్రియం ప్రాస్యా నోద్విజేత్‌ పాప్య్రాచా అప్రియం" కష్ట సుఖములకు కుంగక, పొంగక ఉన్నవాడే స్ధిత ప్రజ్ఞుడు అని గీత చెప్పుచున్నది. పొంగుట, కుంగుట వలన మన నుండి శక్తి విపరీతముగా ఖర్చు అగుచున్నది. శక్తి ప్రవర్ధమైన వాడు ఇహము నందును ఏమియూ సాధించలేడు. మరియు శక్తిహీనుడు సాధన చేయలేక పరమును కూడ కోల్పోవును. అట్టివాడు ఇహపరములందు చెడి ఉభయ భ్రష్టుత్వము చెందును. సీతాపహరణము జరిగిన తరువాత రాముడు దారుణముగా విలపించు చున్నాడు. ఆదిశేషుని అవతారము కావున లక్ష్మణుడు రామునితో "అన్నయ్యా! ముందు ఏడ్చుట మానుకొనుము. ఏడ్చినందు వలన సీత కనపడదు. మరియు ఏడుపు వలనన శక్తి నశించి, సీతను వెదుకుటకు కావలసిన శక్తి లేకపోవుట వలన సీత ఎన్నటికినీ లభించదు. యోగము అను శబ్ధము "యుజ్‌" అను ధాతువు నుండి వచ్చినది. "యుజ్‌" ఏకీకరణ అని అర్ధము. అనగా అన్నింటిని కలుపుట అని యోగ శబ్ధమునకు అర్ధము. ఒక నీటి గొట్టము ఉన్నది. దానికి చిల్లులు పడి నీరు ధారలుగా బయిటకు కారుపోవుచున్నవి. అట్లే మన శక్తి అనేక లౌకిక చింతల ఉద్రేకములలో వ్యర్ధముగా బయిటకు చిందిపోవు నీటిధారలను అన్నింటినీ కలిపి గొట్టములో ఒకధారగా ప్రవహింపచేయుట ఉపయోగము. కావున లౌకికములకు చిన్నాభిన్నము చెంది పోవుచున్న ఈ శక్తిధారలను కలిపి ఒకేధారగా చేయుట యోగము.

యుద్ధములో భేరులు మ్రోగుచూ, శంఖములు మ్రోగుచుండ, అందరనను ఎంతో ఉద్రేకముతో నుండగా శ్రీ కృష్ణుడు శాంతసముద్రునిగా మందహాముతో రధమును నడుపుచున్నాడు. ఆయన జీవితములో ఎప్పుడునూ ఉద్రేకము చెందలేదు. కావుననే ఆయనలో శక్తి అంతయు ఆశీభూతమై లీనమై యున్నది. ఆయన విశ్వరూపమును ప్రదర్శించినపుడు బయిటకు వచ్చిన వేల సూర్యుల కాంతి ఆశక్తియే. అయితే ఈ సృష్టిలో ఈ ఉద్రేకము అను దానిని ఏల సృష్టించినాడు? ఆయన సృష్టిలో ప్రతి వస్తువు మంగళకరమే! కావున ఉద్రేకము కూడా ఒక మంచి పనికే సృష్టించబడి యున్నది. ఆ మంచి పనని ఏమనగా భగవంతుని విషయములో ఉద్రేకము చెందవలయును అని భావము. భగవంతుని కొరకు తపించి ఉద్రేకము పొందుటయే తపస్సు. ఇట్లు భగవంతుని విషయములో సద్వినియోగము చేసినచో ఈ సృష్టిలో చెడు అనేది లేదు. చెడు గుణములు కూడ భగవంతుని వైపునకు త్రిప్పినచో అగ్గిలో పడిన పిచ్చిముళ్ళ కట్టెలు కూడ, నుదుట ధరించు పవిత్రభస్మముగా మారునట్లు, ఆ గుణములు పవిత్రమే అగుచున్నవి. గోపికలు తమలో ఉన్న కామము అను గుణము పరమాత్మ వైపుకు త్రిప్పినారు. ఆ కామమే మోక్షమార్గమై వారిని గోలోకమునకు చేర్చినది. భగవంతుని పరముచేయక భగవంతుని వ్యతిరేకముగా జీవుల పరము చేసినపుడు సర్గుణములు కూడా బురదలో పడిన పంచదార వలె వ్యర్ధము అగుచున్నవి. ఎవరి ఉప్పు తిన్నామో వారికి కృతజ్ఞతగా వుండుట సద్గుణము. భీష్ముడు ఈ సద్గుణమును కౌరవుల పరము చేసినాడు. కౌరవుల ఉప్పు తిన్నందున వారివైపు యుద్ధము చేయుట ధర్మమని, ఆ సద్గుణమును జీవుల పరము చేసి పరమాత్మపై బాణములను విసరినాడు. దాని ఫలమే అంపశయ్య పైబడి జీవన మరణమగు మరణ వేదన పడినాడు. ఈ లోకముననే ప్రత్యక్ష నరకమును అనుభవించినాడు. కావున భగవంతుని వియోగము దుఃఖములో ఉద్రేకము చెందినపుడు అచ్చట శక్తి ఖర్చు అగుట సార్ధకమే కాని వ్యర్ధము కాదు. రుక్మిణి కృష్ణుని కొరకు ఎంతో తపనపడి, పెండ్లి రోజు క్షణక్షణము ఉద్రేకమును చెందినది. అదియే మహా తపస్సుగా మారి, కృష్ణుడు ధర్మమును సైతము అతిక్రమించి రుక్మిణిని వివాహమాడెను. రుక్మిణిని శిశుపాలునికి ఇచ్చుటకు నిశ్చయ తాంబూలములు ఇచ్చుకొనుటయు జరిగినది. మను శ్రుతి యొక్క వాచాదత్త అను శ్లోకము ఆధారముగా నిశ్చయ తాంబూలము జరిగిన కన్యకు పెండ్లి అయినట్లే. బ్రాహ్మణుడు రుక్మిణి వ్రాసిన ప్రణయ పత్రము తెచ్చిన తరువాత, కృష్ణుడు కొంతసేపు తర్జన భర్జన పడినాడు. కానీ ఆమె క్షణ క్షణము పడిన ఉద్రేకము చూచి ధర్మమును సైతము అతిక్రమించి కుండిన నగరమునకు వెడలినాడు. కావున లోక చింతలలో ఉద్రేకము విడనాడవలెనే తప్ప, భగవంతుని విషయములో కాదు. పిల్లపెండ్లికి ధనము దాచమని చెప్పినామే తప్ప, పెండ్లినాడు కూడ ధనమును తీయని ఎడల ఆ ధనము దొంగల పాలో, రాజు పాలో అగును. కావున భగవంతుని విషయములో కూడ ఉద్రేకము పొందక శాంతిగా ఉన్నచో వాడు దాచిన శక్తి మృత్యువు పాలగును. మరణానంతరము శరీరము పంచభూతముల పాలగుచున్నది. వాని శరీరములో దాచబడిన శక్తి అంతయు అగ్నిపాలగును. కావున యోగము అనగా లోకమునకు సంబంధించిన ఉద్రేకములలో శక్తిని ఖర్చుకానీయక దాచి, భగవద్భక్తిలో ఖర్చు చేయుట అనగా శక్తి దుర్వినియోగము అరికట్టి సద్వినియోగము చేయుటయే యోగము.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

Saturday, October 9, 2010

కల్యాణ గుణములు – స్వామి

సౌందర్యము అనునది ఒక కల్యాణ గుణము. సౌందర్యము యొక్క ముఖ్యమైన స్ధానము ముఖము. ముఖము మనస్సునకు అనుగుణముగా యుండును. అందుకే "face is the index of the mind" అన్నారు. జ్ఞానము, ప్రేమ, శాంతి మొదలగు కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు కల్యాణ గుణములతో పరి పూర్ణమైనపుడు ముఖము నందు సౌందర్యము పరిపూర్ణ మగును. ఆది శంకరుల మనస్సు అంతయు బ్రహ్మజ్ఞానముతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము ఎంతో సుందరముగా బ్రహ్మవర్ఛస్సుతో నిండియున్నది. అట్లే కృష్ణుని మనస్సు ప్రేమతో నిండియున్నది. కావుననే ఆయన ముఖము నందున షోడశ కళలు తాండవించుచుండును. రాముని మనస్సు శాంతితో నిండియున్నది. కావున ఆయన మనస్సు ప్రసన్నముగా ఎంతో కోమలముగా యుండును. బుద్ధుని మనస్సు కరుణతో నిండియున్నది. కావున ఆయన ముఖము నందు అమృతము చిందు చున్నది. ఈ విధముగా ఆత్మ సౌందర్యము బాహ్య సౌందర్యమునకు కారణమై యున్నది. దేహముతో పాటు బాహ్య సౌందర్యము నశించుచున్నది. కాని ఆత్మ సౌందర్యము జీవాత్మను ఆశ్రయించి నిత్యముగా యుండుచున్నది. ఈ గుణములను బట్టియే ముఖములో కళలు ఉండుచున్నవి. కావుననే ముఖమును బట్టియే గుణములు చెప్పుట వచ్చి యున్నది. కావున కల్యాణ గుణములలో ఒకే ఒక్క గుణము అగు సౌందర్యము దేహమును ఆశ్రయించి ఉన్నది. మిగిలిన కల్యాణ గుణము లన్నియు మనస్సును ఆశ్రయించి యున్నవి. మనస్సు, వాక్కు, దేహము అనునవి త్రికరణములు. ఈ కల్యాణ గుణములు వాక్కు నందు కూడ ప్రతిబింబించు చుండును. కావున పరమాత్మ యొక్క వాక్కు ఎంతో సుందరముగా యుండును. భగవద్గీతా శ్లోకముల యొక్క సౌందర్యము ఏ శ్లోకములకు లేదు. శ్రీ కృష్ణ భగవానుడు పరిపూర్ణావతారము. కావున ఆయన మనస్సుతో సమానమైన ఆత్మ సౌందర్యము ఎచ్చటను కనుపించుట లేదు. అట్లే ఆయన వాక్కులగు భగవద్గీతా సౌందర్యము కూడా ఏ వాక్కులకును గోచరించదు. అదే విధముగా ఆయన రూపముతో సమానమైన బాహ్య సౌందర్యము ఎచ్చటను కనిపించదు. శరీరము యొక్క సౌందర్యము, ఆత్మ సౌందర్యము యొక్క గుణములు, ఆహారము మీద కూడా ఆధారపడి యుండును. సాత్వికాహారము తేజస్సును ప్రసాదించును. శ్రీ కృష్ణుడు ఎల్లప్పుడును సాత్వికాహారమగు పాలు, పెరుగు, వెన్న భుజించెడివాడు. ఆయన మాంసాహారమును ఎప్పుడును అంటలేదు. కావుననే భగవద్గీతలో సత్వము, రజస్సు, తమస్సు అను మూడు గుణములను కలిగించు ఆహారమును గురించి స్వామి వివరించినాడు. సాత్వికాహారము సత్వగుణమును పెంచి తేజస్సును పెంచి బాహ్య సౌందర్యమును ఆత్మ సౌందర్యమగు కల్యాణ గుణములను వృద్ధి చేయును.

శ్రీ దత్త భగవానుడును ఎల్లప్పుడును గోక్షీరమునే స్వీకరించెడివాడు. కావున ఆయన ముఖమునందు బ్రహ్మవర్ఛస్సు ఒక సముద్రము వలె ఉప్పొంగు చుండెడిది. సత్వము జ్ఞాన కారకము కనుక ఆయన కున్న జ్ఞానము ఎవరికి ఉండెడిది కాదు. దత్తుని యొక్క వాక్కు ఎంతో మాధుర్యముతో నిండి కోటి వీణలు మీటినట్లుండును. కావున ఆహారము దేహము యొక్క రూపమునకు వాక్కుల యొక్క పద్ధతికి గుణములకు ఎంతో ముఖ్యమైనది. సాత్వికాహారముతో పాటు యోగము కూడ యుండవలెను. ఇది ఆహారము కన్నను ముఖ్యము. యోగము అనగా ఎల్లప్పుడును భగవంతుని గురించిన భావములు, వాక్కులు, క్రియలు ఉండుట. దీనిచే ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువుల మీద అందరు వ్యక్తుల మీద బంధము తెగిపోవును. లోకములో వ్యక్తుల మీద వస్తువుల మీద బంధములే అన్ని చింతలకు కారణము. కాలిన ఇనుప కడ్డీని పట్టుకుని చేయి బోబ్బలెక్కుచున్నదని పామరుడు కేకలు పెట్టును. అతడు ఇనుప కడ్డీ వేడిని తీసివేయమనియు, లేక తన చేతికి బోబ్బలు రాకుండా చేయమనియు భగవంతుని ప్రార్ధించుచున్నాడే తప్ప, ఆ ఇనుప కడ్డీని వదల లేకుండా యున్నాడు. ఇనుప కడ్డీ నుండి వేడిని తీసివేయుట లేక చేతికి బోబ్బలు ఎక్కకుండా చేయుట ఎంత కష్టము. ఇనుప కడ్డీని వదలి వేయుట ఎంత సులభము. సులభమైన పనులు చేసి చేయి కాలకుండా చేసుకొనుట జీవుడే స్వయముగా చేయవలయును. ఒక పని సులభముగా చేయు అవకాశముండగా భగవంతుని కష్టపెట్ట నేల? భగవంతునికి కష్టము కాదు అందురా? ఆ కష్టము కాని పనిని జీవుడే చేయవచ్చును గదా? అయితే ఈ లౌకిక బంధములను తెంచుకొనుట చేతకాక యున్నది అని జీవుని వాదము. అసలు జీవుడు ఏ ప్రయత్నము చేయకయే ఈ లౌకిక బంధములు సులభముగా తెగిపోవు ఏకైక మార్గము గలదు. అదే యోగ శాస్త్రము. దానికి అధినాధుడే శ్రీ దత్తాత్రేయుడు. అది ఏమి అనగా నీవు నీ మనో వాక్కాయ కర్మలన్నింటిని భగవత్పరము చేయుము. నీవు భగవంతుని మాధుర్యము రుచి చూడగనే ఈ లౌకిక బంధము లందు ఎట్టి ప్రయత్నము లేక స్వయముగనే నశించును. అమృతము త్రాగిన వాడు కాఫీని స్వయముగనే వదలివేయును. అప్పుడు కాఫీని వదలి వదలివేయుటకు ఎట్టి ప్రయత్నము అక్కరలేదు. అమృతము రుచి చూడకుండా కాఫీని వదలుట అసంభవము. కావున భగవద్‌ యోగమునకు ప్రయత్నించుము. ఈ యోగము సిద్ధించిన వైరాగ్యము ప్రయత్నము లేకయే సిద్ధించుచున్నది. లౌకిక బంధములు తెగిపోయినచో నీకు ఎట్టి చింతలు ఉండవు. ఈ చింతయే ఒక మహాగ్ని. అగ్నిలో కాలిన వాడు బాహ్య సౌందర్యమును కోల్పోవును. చింతలో కాలిన వానికి ముందు ఆత్మ సౌందర్యము కాలిపోయి, దాని ప్రభావము చేత బాహ్య సౌందర్యము కూడ నశించును. కావున లౌకిక బంధములలో ఉండుచు యోగము ద్వారా చింతలు అను మంట అంటకుండ మెలుగు వాడే యోగి, అట్టి యోగియే పరమ సుందరుడు. ఈ లోకములో పరమ సుందరుడు ఎవరు అనగా హనుమంతుడు. అందుకే ఆయనను గురించిన కాండకు సుందరాకాండ అని పేరు వచ్చినది. ఆ కాండలో ప్రతిక్షణము క్లిష్టమైన సమస్యలలో హనుమంతుడు చిక్కుకుంటాడు. కాని ఆయనను ఏ చింత మంట అంటలేదు. ఇదే హనుమంతుని తోకకు అగ్ని అంటించిననూ ఆయన కాల లేదు అను ఘట్టములోని అంతరార్ధము. భగవద్గీతయను యోగ శాస్త్రమంతయును ఆత్మ సౌందర్యము, మరియు బాహ్య సౌందర్యములను కాపాడుకొను మార్గమే. సౌందర్య ఆది దేవుడైన శ్రీ కృష్ణ భగవానుడు బోధించి యున్నాడు. కావున ఆయనను సత్యం, శివం, సుందరం అన్నారు.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

Saturday, October 2, 2010

All scriptures say "Sacrifice of fruit of work (money) is the highest"

The scriptures say that your sacrifice of money is highest.

1) In the very beginning itself (second Adhyaya), Gita says that the fruit of the work must be sacrificed (Karmajam Buddhi Yuktahi Phalam Tyaktva Maneeshinah). This means that realized scholars sacrifice the fruit of the work. Gita keeps sacrifice of the fruit of the work on the top most level. Gita says ‘Jnanat dhyanam visishyate, Dhyanat Karma Phala Tyagah’i.e., Bhakti (devotion) is better than Jnana (knowledge) and sacrificing the fruit of your work (money) is better than Bakthi.

2) Gita says ‘Sarva karma Phala tyagam prahus tyagam vichakshanah’ i.e., if you can give the fruit of the entire work to the Lord, then that is real sacrifice.

3) ‘Na karmana, Na prajaya, Dhanena tyagenaike Amritatvamaanasuh’ i.e., you cannot attain God by selfish work or the children. You can attain God only by sacrificing your money for God’s work. – The Veda

4) The first words of the first Upanishath (Easavaasyam) says, ‘Tena tyaktena Bhunjeedah’ ‘Ma gradha ha kasyasvit Dhanam’ i.e., this entire world is the money of the Lord. Take whatever you require from His wealth; don’t take extra which is not permitted by the God. If you have taken, you are a thief. Return it back to the Lord.

5) Veda says ‘Samvidha’ ‘Shraddhayaa’ ‘Hriya’ ‘Bhiya dheyam’, i.e., return the extra to the Lord in human form after recognizing Him through His Jnana. Wait patiently till you recognize the Lord in human form. When you are donating your money to Him (actually you are giving Him His own money) you should give it with fear and feel shy.

6) In Yoga Vasistha the Guru Vasista says to Rama (Dhanamarjaya) i.e., bring money and offer it to me as Guru Dakshina before I can teach you the Jnana.

7) Shirdi Sai used to ask Guru Dakshina from everybody to teach this important sacrifice. He criticized a merchant who came for Brahma Jnana but was not giving even Rs.5/- from his pocket. Mr. Patil, a farmer used to donate the entire yearly crop to Baba and took back whatever Baba gave back to him.

8) In bible:
Matthew–6 : 19 to 22
‘Do not Lay up for yourselves, treasures on earth. But lay up for yourselves treasures in heaven. For where your treasure is there your heart will be also’.
Matthew -7: 21
‘Not everyone who say to Me, ‘Lord, Lord’ shall enter the kingdom of heaven, but He who does the will of My Father in Heaven’.

9) In islam:
Holy Islam speaks about the sacrifice of fruit of work (money) through the word ‘Jakaat’. This word says that every rich man is expected to practice the sacrifice within the limit of his wealth. Islam says that people are loving too much the money (Q’ran: AalFajr – 20). Islam says that by sacrifice of money your wealth will not decrease and in fact your wealth increases by sacrifice. Islam also mentions that by sacrifice of money your wealth becomes most pure.

At the lotus feet of Shri Dattaswami
-durgaprasad

Wednesday, September 15, 2010

అపిచేశ్చ దురాచార - గీత

"అపిచేశ్చ దురాచారః భజతేమాం అనన్యభాత్‌
సాధురేవ సయంతవ్యః సమ్యత్‌ వ్యవసితోసిన"
అని గీతలో స్వామి చెప్పినారు. అనగా ఎంత దురాచారుడైనను మరియొక వస్తువును గాని, మరియొక వ్యక్తిని గాని కోరక నన్నే ఏ జీవుడు భజించునో, అట్టి జీవుడే నిజమైన పుణ్యాత్ముడు. అతడు చేసినది పుణ్యమే కదా! అనగా ఎంతటి పాపియైనను, స్వామి యొక్క భక్తుడైనచో పుణ్యాత్ముడనియు, అయితే అట్టి వాని యొక్క భక్తి అనన్య భక్తిగా ఉండవలయుననియు అట్టివాడు పాప ఫలమును పొందడనియు చెప్పబడి యున్నది. అనగా ఎన్ని పాపములు చేసినను, అనన్య భక్తితో స్వామిని సేవించిన వాడు పుణ్యాత్ముడని స్వామియే చెప్పుట సరిగా లేదని కొందరు భావించుచున్నారు. కాని సత్యమును విచారించినచో స్వామి చెప్పినది అక్షర సత్యమని తేలుచున్నది. ఏలననగా ఈ సర్వజగత్తును సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు, నీకు ఆయురారోగ్యము లిచ్చిన వాడు, నీకు సకల భోగములను ఇచ్చి ఆనందిప చేయుచున్న వాడు స్వామియే. నీ శరీరము లోపల వున్న గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ కోశము, మూత్రపిండములు మొదలగు అనేక అవయవములను పని చేయించుచున్నవాడు స్వామి. నీవు స్వామికి సంపూర్ణముగా ఋణపడి యున్నావు. ఉదయకాలము నిన్ను నిద్ర నుండి లేయుచున్నట్లు చేయుచున్నవాడు స్వామి. నీవు స్వామికి ఏది సమర్పించినను, ఏ సేవ చేసినను ఆ ఋణము తీరదు. ఈ మానవ జన్మను ఎత్తుటకు ముందు, నీవు పరలోకమున విచారణకు నిలబడి యున్న సమయమున, నీ విచారణను ప్రక్కకు నెట్టించి నీకు మరల ఈ మానవ జన్మమును ప్రసాదించిన వాడు స్వామి. ఇన్ని ఉపకారములు చేసిన స్వామికి నీవు కృతజ్ఞతలు చెప్పకున్నచో కృతఘ్నత అను మహా పాపమును పొందుదువు. నీవు కృతజ్ఞతను చెప్పినచో అది మహా పుణ్యము. కృతజ్ఞతను మించిన పుణ్యము లేదు. కావున నీవు కృతజ్ఞతను చెప్పినచో, నీవు ఎన్ని పాపముల చేసిననూ అవి అన్నియు దాని కన్న తక్కువ కావున నీవు పుణ్యుడవే అగుదువు. ప్రతి దినము ఆయనకు కృతజ్ఞతలు చెప్పుచున్నచో నీ పుణ్యము +100 అగును. నీవు ఎన్ని పాపములు చేసినను అవి అన్నియు -99 మాత్రమే అగును. అప్పుడు +1 మిగులును. కావున స్వామి భక్తుడు పుణ్యాత్ముడే. నీవు కృతజ్ఞత వ్యక్తము చేయక దైవమును అంగీకరించక నాస్తికుడవైనచో నీ కృతఘ్నతా పాపము -100 అగును. నీవు ఎన్ని సార్లు పుణ్యకార్యములు చేసినను అవి అన్నియును +99 మించిపోలేవు. కావున అట్టి నాస్తికునకు -1 మిగులుచున్నది. అనగా భగవద్భక్తుడు ఎన్ని పాపములు చేసినను +1 మిగులుట చేత పుణ్యాత్ముడే అగును. ఆట్లే నాస్తికుడు ఎన్ని ధర్మ కార్యములు చేసినను -1 మిగులుట చేత పాపాత్ముడే అగును. ఏలననగా, కృతజ్ఞతకు మించిన పుణ్యము లేదు. కృతఘ్నతకు మించిన పాపము లేదు. అయితే ఈ శ్లోకము యొక్క అర్ధము ప్రకారము భగవద్భక్తుడైన చాలును ఎన్ని పాపములనైనను చేయవచ్చును అని కాదు. భగవద్భక్తుడై పాపములు చేసిన వానికి మిగిలిన పుణ్యము +1 మాత్రమే. కాని భక్తుడై పుణ్యము చేయువారి సంగతి ఏమి? భగవద్భక్తికి +100 పుణ్యకార్యములకు +99 మొత్తము +199 అగుచున్నది. కావున +1 గురించి చెప్పుట +1 తెచ్చుకొనమనుటయే. అట్లే నాస్తికుడై పాప కార్యములు చేయువాడు వాని నాస్తికత్వమునకు -100, వాని పాపకార్యములకు -99 మొత్తము -199 అగుచున్నది. ఇది -1 కన్నను -199 చాలా ఎక్కువ. కావున ఈ శ్లోకము యొక్క సారాంశము ఆస్తికుడై ధర్మమును ఆచరించువాడు పరమ పుణ్యాత్ముడు.

ఆస్తికుడై పాపములను ఆచరించని వాడు స్వల్పమైన పుణ్యాత్ముడు. అట్లే నాస్తికుడై ధర్మమును చేయువాడు స్వల్పమైన పాపాత్ముడు. నాస్తికుడై పాపములను చేయువాడు మహా పాపి యగును. అయితే ధర్మము అనగా నేమి? అధర్మము అనగా నేమి? ధర్మము, అధర్మము అను రెండు శబ్ధములు నీ తోటి జీవించు సాటి జీవుల వ్యవహారముకు సంబంధించినవి కాని స్వామికి సంబంధించినవి కావు. ధర్మము అనగా సజ్జనులను భగవద్భక్తులను బాధించకుండా వారికి ఉపకారము చేయుటయే. అట్టి వారిని బాధించుట, వారికి అపకారము చేయుట అధర్మము. ఈ ధర్మము మార్గ స్వరూపముగను, ఫలస్వరూపముగను ఉండును. ఈ రెండింటి లోపల స్వరూపమే ప్రధానము. ఫల స్వరూపము అనగా నీవు ఒక కర్మ చేసి చిట్ట చివరకు సాధించినది. దానినే గమ్యము లేక లక్ష్యము అందురు. గమ్యము ధర్మమైనచో మార్గము ధర్మమే. ఉదాహరణకు ఒక సజ్జనుడి జేబులో నుండి 10 రూపాయలను ఒక దుర్జనుడు దొంగిలించినాడు. ఆ దొంగిలించిన పది రూపాయిలు దుర్జనుడు తన స్వార్ధముకు వినియోగించుకున్నాడు. కావున ఇచ్చట లక్ష్యము అధర్మము. కావున దొంగతనము అధర్మము. కాని దుర్జనుని వద్ద నుండి ఆ పది రూపాయిలు దొంగిలించి ఆ సజ్జనునికి తిరిగి యిచ్చివేసినాము. ఈ రెండవ దొంగతనము అధర్మము కాదు. ఏలననగా లక్ష్యములో స్వార్ధము లేదు. లక్ష్యములో త్యాగమున్నది. లక్ష్యము ధర్మస్ధాపనయే. అయితే దుర్జనుడితో యుద్ధము చేయగలిగి యుద్ధము చేసి వానిని తన్ని ఆ పది రూపాయిలు లాగుకొని ఆ సజ్జనుడికి ఇచ్చినచో ఇచ్చట మార్గము, గమ్యము రెండు ధర్మములే అగుచున్నవి. కాని దుర్జనుని తన్నుటకు శక్తి లేనప్పుడు ధర్మ మార్గము అచ్చట కుదరదు. వాని వద్ద దొంగిలించియైనను దానిని సజ్జనునకు ఇచ్చివేయుటయే కర్తవ్యము. ఈ దొంగతనము పాపము కాదు. దొంగతనము చేయు నైపుణ్యము ఉండి కూడ ఈ సందర్భమున దొంగతనము పాపమని దొంగతనము చేయకున్నచో అట్లు చేయకపోవుటయే పాపమగుచున్నది. "రామో విగ్రహవాన్‌ ధర్మః" అన్నారు. అనగా రాముడు మూర్తీభవించిన ధర్మ స్వరూపము అని అర్ధము. అట్టి రాముడు చెట్టు చాటు నుండి వాలిని చంపుట యుద్ధ ధర్మము కాదని వాలి రాముని ఆక్షేపించినాడు. కాని ఇచ్చట రాముడు చేసినది ధర్మమే. ఏలననగా వాలికి ఒక వరము కలదు. యుద్ధము చేయునప్పుడు ఎదుటి వాని శక్తి నుండి సగము వాలికి లభించును. దీని వలన వాలిని ఎవడు జయించలేడు. వాలి అధర్మమును చేసినాడు. సుగ్రీవుని భార్య యగు రమను బలవంతముగా భార్యగా చేసుకొని, సుగ్రీవుని వెడలకొట్టినాడు. అప్పటి కాలమున వానరులలో దేవర న్యాయమున్నది. అనగా సోదరులలో ఒకరు మరణించినపుడు మరణించిన వాని భార్య ఇష్టమైనచో బ్రతికియున్న సోదరునికి భార్య కావచ్చు. కాని సుగ్రీవుడు మరణించలేదు. మరియు రమకు ఇష్టము లేదు. కావున ఇది రెండు విధములుగను అధర్మమే. అయితే వాలి ఎందుకు ఇట్లు చేసినాడు? దుందుభి యను రాక్షసునితో యుద్ధము చేయుటకు ఒక కొండ గుహలోనికి వాలి పోవుచు సుగ్రీవుని కాపలా పెట్టి నెల రోజులలో నేను తిరిగిరానిచో, నన్ను మరణించి నట్లుగా భావించి తిరిగి పోమ్మన్నాడు. నెల రోజులు దాటినను వాలి రాలేదు. కావున అన్న ఆజ్ఞ ప్రకారము అన్న మరణించెనని భావించి దుందుభి బయిటకు రాకుండగా ఆ గుహ ముఖమునకు పెద్ద రాతిని అడ్డుపెట్టి సుగ్రీవుడు వచ్చి రాజ్యాభిషిక్తుడైనాడు.
వాలి భార్య తార ఇష్టపడి నందున దేవర న్యాయ ప్రకారముగా సుగ్రీవునకు భార్యయైనది. కాని అచ్చట వాలి దుందుభిని చంపి తాను రాకుండా సుగ్రీవుడు రాతిని అడ్డము పెట్టినాడని క్రోధావేశముతో అన్నమాట మరచి వచ్చి తార, రమ సహితుడైన సుగ్రీవుని చూచి రెట్టించిన కోపముతో సుగ్రీవుడు ఏమి చెప్పినను వినక, సుగ్రీవుని వెడలకొట్టి రమకు ఇష్టము లేకపోయినను, బలవంతముగా భార్యను చేసుకున్నాడు. భర్త మరణించినపుడు కూడ దేవర న్యాయములో స్త్రీ యొక్క అంగీకారము ప్రధానమైయున్నది. కావున చూచుటకు సుగ్రీవుడు చేసిన పని, వాలి చేసిన పని ఒకటిగా కనిపించును. కాని ఎంతో బేధమున్నది. కావున వాలి వధార్హుడు. ఆనాడు భారత దేశమంతయును ఇక్ష్యాకుల సామ్రాజ్యమై యున్నది. అనగా అయోధ్య రాజుదే కేంద్ర పభుత్వము. అయోధ్యరాజు భరతుడు. రాముడు తన రాజ్యమును 14 సంవత్సరములు మాత్రమే అప్పచెప్పినాడు. కనుక భారత దేశములో ఎచ్చట అధర్మము జరిగినను, శిక్షించుటకు రామునికి అధికారమున్నది. ఇది అంతయును రాముడు వాలికి వివరించి ఇట్లు చెప్పినాడు. వాలీ! నిద్రపోవుచున్న ఏ ప్రాణిని వధించరు. కాని ఒక పెద్దపులి గ్రామము పైబడి జనులను వధించున్నపుడు అది మేల్కోని యుండగా దానిని ఎవరును వధించలేరు. కాని అది నిద్రపోవుచున్నది. ఈ సందర్భమున ధర్మ శాస్త్రమును అతిక్రమించి దానిని వధించుట ధర్మసూక్ష్మము. ధర్మము కన్న ధర్మ సూక్ష్మము గొప్పది.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, August 20, 2010

భగవద్గీత

శ్రీ కృష్ణ భగవానుని ఒక్క స్వరూపమే భగవద్గీత. కృష్ణుడు అనగా ఆకర్షించు వాడు అని అర్ధము. ఆయన యొక్క అంత: స్వరూపమే నారాయణుడు. నారాయణుడు అనగా జ్ఞానమునకు ఆధారమైన వాడు అని అర్ధము. కావున ఆయన యొక్క నిజమైన ఆకర్షణ ఆయన ఎత్తిన భగవద్గీత మూలమునే యున్నది. ఆయన గోకులములో పుట్టి పామరులకు సైతము వ్రజ భాషలో ఎంతో విలువ గల జ్ఞానవాక్యములను చెప్పుచుండెడివాడు. ఆయన చెప్పిన వాక్యములే గీతలో శ్లోకములుగా వచ్చినవి. కృష్ణుడు ఎల్లప్పుడును తక్కువ వాక్యములనే పలుకు చుండెడివాడు. అయితే గోకులమున పుట్టిన గోపికలు పూర్వజన్మమున బ్రహ్మర్షులు కావున ఆయన చెప్పు తత్త్వ వాక్యములకు ఎంతో ఆకర్షించబడి స్వామి వద్దకు వచ్చెడివారు. గోపికలకు ఉన్న శ్రద్ధ మిగిలిన యాదవులకు అంతగా ఉండెడిదికాదు. ఏలననగా ఆ యాదవులు సామాన్య జీవులు. కృష్ణుడు ఎప్పుడును హృదయాంతరముల స్పందిపజేయు మధురాతి మధుర గీతములను పాడుచు వాటిని మురళితో వాయించెడివాడు. ఆ గీతము లన్నియును పరమాత్మనే లక్ష్యముగా చేసుకొని సత్యమైన భక్తిని బోధించెడి అమృతధారలుగా ఉండెడివి. ఆ గీతములన్నియును భగవత్‌ ప్రేమతో నిండియుండుట వలన వాటిని విని స్వామితో వంత పాడుచు గోపికలు మైమరచెడివారు. ఆ భక్తి గీతములతో గోపికల బ్రహ్మానంద సముద్రమున మునిగిపోయెడివారు. ఇదియే బృందావనములోని రాసకేళి. రాసకేళి అనగా ఒక దివ్యమైన మధురాతి మధురమైన భజన. కాని నేడు రాసకేళి గురించి అవి ఏవో సినిమా జ్యూయట్‌ సాంగ్‌లని అపార్ధము చేసుకొనుచున్నారు. అక్కడ ఉన్న కృష్ణుడు సాక్షాత్‌ పరమాత్మ. ఆ గోపికలు యుగ యుగములు తపస్సు గావించిన బ్రహ్మర్షులు. అదియే వారి చివరి జన్మ. కృష్ణుడు ఆనాడు తాను వచించిన జ్ఞాన వాక్యములనే పాటల రూపములలో రాసకేళిలో పాడెడివాడు. అదియే జ్ఞానము మరియు ప్రేమ అను భగవంతుని రెండు కల్యాణ గుణముల కలయిక. ఆ గోపికలు మహా పండితులైన ఋషులు. వారు జ్ఞానమును కఠినములైన వాక్య శాస్త్రముల ద్వారా అప్పటి వరకు చర్చించి వచ్చినవారు. వారు అప్పటి వరకు జ్ఞానమును వాక్యములలో మరియు శ్లోకములలో చర్చించెడివారు. ఆ వాక్యములే యజుర్వేదములు. శ్లోకములే ఋగ్వేదము. అదే జ్ఞానము మధురమైన గీతముల ద్వార ఉన్నపుడు సామవేదమగును. అందుకే కృష్ణుడు "వేదానాం సామవేదోస్మి" అన్నాడు. ఆయనకు జ్ఞానము మధురమైన ప్రేమయు చాల ఇష్టముగ నుండును. కురుక్షేత్రములో ఆయన అర్జునునకు వినిపించినవి కూడా పాటలే. కావుననే దానిని భగవద్గీత అన్నారు. భగవద్గీత అనగా భగవంతునిచే పాడబడిన గీతలు లేక పాటలు అని అర్ధము. ఈ పాటలను ప్రతి దినము బృందావనము నందు గోపికలకు వినిపించినాడు. ఈ పాటలనే యమునా తటమున తమాల (గానుగ) వృక్షశాఖపై ఆశీనుడై ఏకాంతముగా మురళితో పాడెడివాడు. కావున ఆయన యొక్క వేణుగీత గాని రాసకేళిలో పాడిన పాటలు గాని భగవద్గీతా శ్లోకములే. భగవద్గీత రజోగుణముతో కూడిన అహంకారముతో నున్న క్షత్రియుడైన అర్జునుడికి చెప్పబడినవి. అర్జనుడు కూడ పూర్వజన్మమున నరుడు అను ఋషియే. కాని క్షత్రియ కులమున పురుషునిగా పుట్టినాడు. పార్ధునికి కుల అహంకారము, లింగాహంకారము ఉన్నది. అంతే కాదు తాను మహా వీరుడన్న అహంకారము కూడ ఉన్నది. కావున పార్ధునికి చెప్పిన భగవద్గీతలో కొంచము కాఠిన్యము ఎక్కువగా కనిపించుచు మిరపకాయ బజ్జీ వలె ఉన్నది. కాని గోపికలు స్త్రీ జన్మనెత్తి గొల్లలను శూద్ర కులమున పుట్టి లింగాహంకారము కులాహంకారము లేక సంపూర్ణ శరణాగతి చేసినారు వారు. కావున గోపికలకు చెప్పిన జ్ఞానగీతలు పంచదార రసగుల్లాల వలెనున్నవి. ఆ గీతల యొక్క నామధేయమే రాసకేళి. రాసము అనగా మధుర ప్రేమ రసముతో నిండిన సముద్రము. కేళి అనగా దాని యందు ఈదులాడుచూ స్నానము చేయుట. ఆ సమయము స్వామి ఆపాదమస్తకము మధుర ప్రేమ స్వరూపమున ఉండెడివాడు.

ఆ స్వరూపము గురించియే "మధురాతి పతియే అఖిలం మధురం". సాత్వికులైన బ్రహ్మర్షుల యొక్క జ్ఞానముతో కూడిన గోపికల మధుర ప్రేమ వాతావరణమే బృందావనము. జీవుని యొక్క గుణముల బట్టియే వాతావరణము మరియు స్వామి స్వరూపము కూడ ఉండును. పార్ధుని యొక్క గుణముల బట్టియే కురుక్షేత్ర వాతావరణమున గీతను చెప్పవలసి వచ్చినది. రజోగుణము అహంకారమయమైన యుద్ధ వాతావరణమున స్వామి కూడ పాంచ జన్య శంఖమును పూరించుచు రణోత్సాహముతో వరావృశముతో పరుష స్వభావముగానున్నారు. గుణమును బట్టియే మనస్సు మరియు వాతావరణము మరియు దానికి అనుగుణముగా వాక్కు ఉండును. మరి ఆనాటి రాసకేళి గ్రంధమును వ్యాసుడు ఏల గ్రంధస్ధముగావించలేదు. అది ద్వాపరయుగాంతము. అతి స్వల్పకాలములోనే కలియుగము రాబోవుచున్నది. ఆ రాసకేళి గీతముల శ్రవణము చేయు అర్హత గల జీవులు లేరు. అందరును రజోగుణముతో అర్జునుని తాత ముత్తాతల వంటి జీవులు ఉన్నారు. కావున ఈ జీవులకు యోగ్యమైనది పార్ధునికి చెప్పిన ఈ భగవద్గీతయే. ముందు భగవద్గీత యను ఉట్టికి ఎక్కినచో తరువాత మాట రాసకేళి యను స్వర్గమునకు ఎక్కుట. మరియు అయోగ్యులగు ఈ జీవులు ఆ రాసకేళి గీతలను అపార్ధము చేసుకొనెదరు. విమర్శంతురు. అర్జునుడే విమర్శంచినాడు కృష్ణపరమాత్మను. గయోపాఖ్యాన సందర్భమున "సతులయే మార్చి గొల్లభామల మరుగుట కాదు" అన్నాడు. ఆ రాసకేళి గీతములను అర్జునుడు వినలేదు. పరమ భక్తుడగు నారాయణుని వెంట నీడ వలెనున్న నరుడు అనబడు ఋషియగు అర్జునుడే తన ఉపాధి అగు క్షత్రియ వీర పురుషజన్మ ప్రభావము చేత ఇట్లు పలికినపుడు ఇక మిగిలిన శిశుపాల దుర్యోధన జరాసంధాది రాజుల సంగతి చెప్పనేల? ఆనాడు రాసకేళి గీతములలో చెప్పిన అనేకానేక అద్భుత జ్ఞాన రహస్యములను కరుణామయుడగు స్వామి ఈనాడు జ్ఞాన సరస్వతి ద్వారా జీవులకు అందించుచున్నాడు. ఇవి అన్నియును వేదములలో కలవు. కావున ఆ వేదములు ఖిలమై పోయినవి. "అనంతావై వేదా హః" అనగా వేదములకు అంతము లేదు. భరద్వాజుడను ముని 300 సంవత్సరములు వేదములను చదివినాడు. ఆయనకు స్వామి సాక్షాత్కరించి మూడు మహా పర్వతములను చూపినాడు. ఒక్కొక్క పర్వతము నుండి ఒక్కొక్క పిడికిలి మట్టి తీయమన్నాడు. స్వామి ఇట్లు చెప్పినాడు. ఓ భరద్వాజ! నీవు చదివిన వేదము ఈ మూడు పిడికిళ్ళ మట్టి మాత్రమే ఇంకనూ చదవవలసిన వేదము ఆ మహా పర్వతములు అన్నాడు. ఈ కధ వేదము నందే కలదు. "భరద్వాజో హవైః" అను మంత్ర పాఠమున కలదు. భరద్వాజుడు 300 సంవత్సరములలో చదివిన వేదములలో ఒక సంవత్సరము మాత్రమే చదివిన వేదము మనకు ఈనాడు మిగిలియున్నది. మిగిలిన 299 సంవత్సరముల వేదము ధారణ చేయలేక మరచిపోయినారు. దీనిని "ఖిల వేదము" అందురు. ఖిలము అనగా అంతరించినది అని అర్ధము. కావున స్వామి యొక్క జ్ఞానము అనంతమైనది. గోపికల రూపములో ఋషులు ఎందుకు అంతగా ఆకర్షించబడినారు. స్వామి గీతలలో చెప్పెడి జ్ఞానము వారు అధ్యయనము చేసెడి వేదములలోఉండెడిది కాదు. అది అంతవరకు శ్రవణము చేయని విజ్ఞానము. కావున వారికి ఎంతో శ్రద్ధ ఉండెడిది. ఆ శ్రద్ధయే కృష్ణునిపై ఏర్పడిన ఆకర్షణ. ఆ శ్రద్ధ ముందు అన్నపానీయములు కాని, నిద్ర కాని, అత్తమామలు కాని, పతిపుత్రులు కాని, గృహ, పశు, క్షేత్ర బంధములు కాని నిలువలేక పోయినవి. కావున రాసకేళి అనగా మహా పవిత్రమైన వేదాధ్యయనము. అది ఈశ్వర జీవుల గురు శిష్యులు కావుననే భాగవతము ఏడు దినములలో మోక్షమునీయ గల మహా పవిత్ర గ్రంధమైనది.

At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad

Thursday, July 1, 2010

బహునాం జన్మ నామంతే

బహునాం జన్మ నామంతే అనగా ఎన్నో జన్మల తపస్సాధన ఉన్నగానే నన్ను గుర్తించలేరు, అనియు "యతతామ్‌పి సిద్ధానాం కస్చిన్‌ మామ్ వేతి తత్త్వత" " అనగా అష్ట సిద్ధులు సంపాదిచినను, ఎట్టి అహంకారమును పొందక నా కొరకు సాధన సాధించు ఏ ఒక్కడో నన్ను గుర్తించును అని గీత చెప్పుచున్నది. అసలు బ్రహ్మమును గుర్తించు బ్రహ్మ విద్యలో అంత కష్టము ఏమున్నదని ఎవరికైనను సంశయము రావచ్చును. కొందరు బ్రహ్మము నిరాకారమైన, సర్వవ్యాపకమైన చైతన్యమను చున్నారు. చైతన్యము కాంతి వలె ఒక శక్తి స్వరూపము. పట్ట పగలు కాంతి ఎట్లు సమస్త లోకములను వ్యాపించి యున్నదో, అట్లే చైతన్యము అను శక్తి ఈ సమస్త విశ్వమును వ్యాపించి యున్నది. ఇది అర్ధము చేసుకొనుటలో పెద్ద కష్టమేమున్నది. ఎంత పామరుడైనను అయిదు నిమిషములు ఆలోచించినచో, ఇది అర్ధమగుచునే ఉన్నది. పదవ తరగతి ఫిజిక్సు చదివిన విద్యార్ధి ఈ విషయమును ఒకే నిమిషములో అర్ధము చేసుకొనగలడు. దీని కొరకు ఏన్నో జన్మలు ఎందుకు? మరి కొందరు పరబ్రహ్మము అనగా ఈ విశ్వమును కూడ అత్రికమించిన విరాట్పురుషుని ఆకారము అనియు, ఈ జగత్తు ఆయన ధరించిన ఒక వస్త్రము వంటిది అనియు, ఆయన ఈ విశ్వములో అంతర్యామిగా ఉన్నాడనియు చెప్పుచున్నారు. ఇది ఇంకను సులభము. పామరుడు మూడు నిమిషములలో అర్ధము చేసుకొనగలడు. మరికొందరు పైలోకములో వైకుంఠములో నారాయణునిగాను, కైలాసమున పరమశివునిగాను, సత్యలోకమున హిరణ్యగర్భుని గాను పరబ్రహ్మ ఉన్నాడని చెప్పుచున్నారు. ఇది మరింత సులభము. పామరుడు ఒక్క నిమిషములో అర్ధము చేసుకొనగలడు. కావున ఈ సిద్ధాంతముల ప్రకారము బ్రహ్మవిద్య కష్టము కాదని తేలుచున్నది. శ్రుతులు కూడ పరబ్రహ్మము తర్కమునకు, ఊహకు సైతము అందదు అనియు, దేవతలు కూడ అర్ధము చేసుకొనలేరనియు చెప్పుచున్నవి. కావున వీరు చెప్పు సిద్ధాంతములేవియు బ్రహ్మ విద్యకు అర్ధము కావని తేలుచున్నవి. కావున బ్రహ్మ విద్య అనగానేమి? అది అంత కష్టముగా ఎందుకు ఉన్నది? దీనికి సమాధనము భగవద్గీతయే చెప్పుచున్నది. "బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్‌ మం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి పరమాత్మ సుదుర్లభాః" అను శ్లోకమే బ్రహ్మ విద్యను గురించి చెప్పుచున్నది. అనగా వసుదేవుని పుత్రుడగు ఈ వాసుదేవుడు పరబ్రహ్మము అని గుర్తించి పరిపూర్ణముగా విశ్వసించిన మహాత్ముడు ఎక్కడునూ దొరకడు. అనగా దేవకి గర్భమున పుట్టి యశోద చేత పెంచబడి అందరి నరులలో ఒక నరుడుగా ప్రవర్తించుచున్న ఈ వాసుదేవుడే పరబ్రహ్మమని గుర్తించుట చాలా కష్టము అని అర్ధము. ఇచ్చట వాసుదేవ శబ్ధము ప్రతి నరాకారమును గురించి చెప్పుచున్నది. కేవలము కృష్ణావతారమును గురించే కాదు. ఏలననగా అధర్మము తల ఎత్తినపుడల్లా మనుష్య రూపములో నేను అవతరిస్తానని "తదాత్మానం సృజామ్యహమ్‌", "మానుషీం తను మాశ్రితమ్‌" అని తరువాత గీతా శ్లోకములు చెప్పుచున్నవి. నరులలో ఒక నరునిగా అవతరించి ఇతర నరుల వలె ప్రవర్తించుచున్న నరవేషి యగు నారాయణుడని గుర్తించుట చాలా కష్టము. ఇట్లు నరులలో అవతరించిన వానిని గుర్తించుట దేవతలకు కష్టమే అగుచున్నది. ఏలననగా దేవతల కన్న నరులు చాలా తక్కువవారు. కావున వారు నరులను చులకనగా చూతురు.

యాదవ వంశములో పుట్టి నరవేషి యగు నారాయణుని గుర్తించక ఇంద్రుడు ఏడు రోజులు వర్షమును కురిపించినాడు. ఋషులు సైతము భ్రమలో పడుదురు. ఉదంక మహర్షి కృష్ణుని శాపము పెట్టుటకు పూనుకొనినాడు. "అవ జానంతి మాంమూఢాః మానుషీమ్‌ తను మాశ్ర్తితమ్‌" "మమభూత మహేశ్వరమ్‌" అనగా నర వేషమున నున్న నారాయణుని గుర్తించుటలో దేవతలు ఋషులు సైతము మూఢులై ఆయనను అవమానించుటకు పూనుకొందురు అని అర్ధము. ఇప్పుడు చూచితిరా! బ్రహ్మవిద్య ఎంత కష్టమో అందుకే శ్రుతి "బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతి" అనగా బ్రహ్మమును గురించిన గుర్తింపు బ్రహ్మమునకే ఉండును అని అర్ధము. అక్రూరుడు, విదురుడు, భీష్ముడు, పార్ధుడు, గోపికలు వంటి మహా భక్తులు కూడ ఒక్కొక్క క్షణములో జారిపోయినారు. ఒక్క క్షణము కూడా జారి పోకుండా నిలబడినది రాధ మాత్రమే. అందుకే ఒకానొక జీవుడు మాత్రమే "కశ్చిన్‌ మాం వేత్తి తత్త్వతః" అని స్వామి గీతలో చెప్పియున్నాడు. ఆమె తన్ను తానే మరచిపోయినది. అనగా "నేను" సాత్విక అహంకారము కూడ లయమైనది. అహంకారము మూడు విధములుగా యుండును. "నేను" అని జ్ఞానము మాత్రమే స్వరూపముగా చైతన్యాత్మకమయమైన భావమే సాత్వికాహంకారము. ఇందులో "నేను" అను శబ్ధమునకు ఆత్మ అని అర్ధమే మిగిలి యుండును. ఈ చైతన్యాత్మ యగు జీవుడు శరీరమును వదలిపోయినను, తనను తాను నేను నేను అనుకొనుచుండును. కావున మరణించిననూ పోనిదే ఈ సాత్వికాహంకారము. ఇంక ఈ శరీరమును నేను అనుకొనుట రాజసాహంకారము. నేను ఎర్రగా ఉన్నాను అనుచున్నాడు. ఎర్రగా ఉన్నది శరీరము. ఈ శరీరముతో నేను ఏకీభవించుటయే రజోగుణము. ఈ శరీరము అగ్నిలో దగ్ధమగుననియు, అప్పుడు దగ్ధము కాకుండా బయిటకు వచ్చు ఆత్మయే "నేను" అను శబ్ధమునకు అర్ధము అని తెలియదు. కావున రజో గుణము అజ్ఞానమే. సాత్విక గుణము జ్ఞానము. ఏలననగా నశించిన చైతన్యాత్మ "నేను" అనుకొనుట జ్ఞానమే కదా! అది సత్యమే గదా! ఇక తనకు తోడుగా ఉన్న ధనము బంధువులు మొదలగు వానిని "నేను" అనుకొనుట తమో గుణము. సాత్వికాహంకారములో "నేను" అనునది నిలచినంత వరకు చైతన్యము పరిమితమై ఒక ఖండముగా ఉండును. ఎప్పుడు ఈ "నేను" అన్న సాత్వికాహంకారము కూడ నశించునో, అప్పుడు ఈ చైతన్య ఖండమైన ఆత్మ పరమాత్మ యొక్క చైతన్యము నందు లయించిపోవును. అప్పుడు "నేను" అను శబ్ధము కేవలము పరమాత్మ చైతన్యమునకు మాత్రమే మిగిలిపోవును. ఇదే శంకరాచార్యుల వారు తరువాత రమణ మహర్షి చేసిన నేను అను శబ్ధము యొక్క జిజ్ఞాస. ఈ విధముగా ఎవరు స్వామి సేవలో పాల్గొని తనను తాను మరచిపోవునో అప్పుడు ఆ జీవుడు పరమాత్మతో కైవల్యమును పొందును. కొందరు గంజాయి మొదలగు మత్తు పదార్ధములను వాడి ఈ "నేను" ను మరచిపోవుచున్నారు కాని ఇది కైవల్యము కాదు. గంజాయి మత్తు దిగగానే ఈ "నేను" మరల ఉద్భవించుచున్నది. గాఢనిద్రలో కూడ "నేను" లయించుచున్నది. కాన గాఢనిద్ర కైవల్యము కాదు. కావున కేవలము రాధ మాత్రమే నిజమైన కైవల్యము పొందినది. కావున నరాకారములో నిజమైన పరబ్రహ్మమును గుర్తించుటయే నిజమైన బ్రహ్మ విద్య. ఆ గుర్తింపుకే అనేక బాలారిష్టములున్నవి. ఆయన ఆశ్రయించిన నరశరీరము అన్ని నరశరీరముల వలే ప్రకృతి ధర్మములకు లోబడి యుండును. మనవలే ఆయనకు కూడ క్షుత్విపాసలు, దగ్గు, రొంప వచ్చుచుండును. ఈ బాహ్య లక్షణములను చూచి చాలా మంది మోసపోవుదురు. ఒకవేళ గుర్తించినను ధర్మమును తప్పిన నడకతో గోచరించుచుండును. ఆ దెబ్బతో గుర్తించిన వారు కూడ అరటి తొక్కపై కాలు పడినట్లు జారిపోవుచుందురు. ఆయనను గుర్తించు లక్షణములు కూడ ఎంతో తికమక ఉన్నది. సిద్ధులు గుర్తుగా పెట్టుకున్నచో రాక్షసులు, క్షుద్రమాంత్రికుల వలలో పడుదురు. జ్ఞానమును గుర్తుగా పెట్టుకున్నచో పండితుల వలలో చిక్కుకొందురు.

పండితులు చెప్పు జ్ఞానము బ్రహ్మానుభూతిని కలిగించలేదు. ఆయన యొక్క కల్యాణ గుణములలో కొన్ని కొన్ని గుణములు భక్తుల వద్ద కూడ కనిపించుచుండును. భగవంతుని నుండి భక్తులను వేరుచేయుట చాలా కష్టముగా యుండును. ఏలననగా సత్య భక్తులను భగవంతుడు ఆవేశించి యుండును. అయితే ఒక కార్యార్ధమై భగవంతుడు భక్తులను ఆవేశించును. ఆ కార్యము ముగియగనే, భగవంతుడు భక్తుల నుండు తొలగిపోవును. భక్తుడు, ముని కుమారుడైన పరశురాముని విష్ణుభగవానుడు ఆవేశించి సర్వ క్షత్రియ సంహారమును చేసెను. ఆ కార్యము ముగియగనే పరశురాముని నుండి తొలగిపోయెను. కావున ఇట్టి మహాభక్తులను నరావతారముల నుండి వేరుచేయుట కష్టము. ఒక్కొక్క సారి నరావతారుడగు స్వామి తన శక్తిని భక్తుని ద్వారా ప్రయోగించి వారి సాయమును తాను పొందుచు వారికి భగవంతునిగా కీర్తి నిచ్చి తాను భక్తుని స్ధానమున ఉండి నటించుచుండును. సంజీవి పర్వతమును హనుమంతుడు తెచ్చి లక్ష్మణుని బ్రతికించి, రాముని శోకమును పోగొట్టెను. రామశక్తి వలననే హనుమంతుడు సంజీవిని తెచ్చెను. చూచు వారికి హనుమంతుడే భగవంతుడు, రాముడే భక్తుడిగ తోచును. ఇట్టి మాయలను తప్పించుకొని ఆయనను గుర్తించుట చాలా కష్టము. గోటి చుట్టుపై రోకలి పోటు అన్నట్లు, వెన్నముద్దలు దొంగిలించుచూ, గోపికల వెంటబడుచు, అందరి విమర్శలకు గురియగుచు భక్తుల కండ్లకు మాయ పొరలను కప్పుచుండును. దీనికి తోడు సాక్షాత్తు నారాయణుని నుండి అసలు శంఖ, చక్రములనే సంపాదించిన ఈ నకిలీ నారాయణుల నుండి జారచోరత్వాది మాయలచే గప్పబడిన సత్యనారాయణుని గుర్తించుట చాలా కష్టము. సత్యనారాయణ వ్రతములో అంతరార్ధమిదే. సత్యనారయణ వ్రతములో గోవిందాది కృష్ణ నామములే ఉన్నవి. అనగా ఈ నరులలో సత్యమైన నారాయణుని గుర్తించి జారిపోకుండా గట్టిపట్టుతో దీక్షను పూనిన వాడే నిజముగా సత్యనారాయణ వ్రతము చేసినవాడు. ఈ విధముగా గొర్రెలలో కలసిపోయి గొర్రతోలు కప్పుకొని గొర్రె స్వరముతో అరచుచు గొర్రెలలో కలసిపోయిన పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. గొర్రెల కన్న వేరుగా నున్న పులిని గుర్తించుటలో కష్టమేమున్నది? కావున జీవుని కన్న భిన్నముగా వున్న భగవంతుని గుర్తించుటలో కష్టము లేదు. అన్ని గొర్రెలను పులియే అన్ననూ కష్టము లేదు. ప్రతి గొర్రెయును పులియే గదా. కావున సర్వజీవులను బ్రహమే అన్నప్పుడు కష్టములేదు. కావున ఇటువంటి అతితెలివి సిద్ధాంతముల భ్రమల నుండి బయిటపడి గొర్రె వేషముతో గొర్రెలలో కలిసిపోయి గొర్రెగా ఉన్న పులిని గుర్తించుటయే బ్రహ్మవిద్య. కావున నరవేషముతో నురులతో కలసిపోయిన నారాయణుని గుర్తించుటయే మహా మహా కష్టము. కావున అనేక జన్మలు పట్టును. నరావతారమున ఉన్న రాముని గుర్తించి పూర్తిగా విశ్వసించిన హనుమంతుడును, అట్లే నరావతారమున ఉన్న కృష్ణుని గుర్తించి పరిపూర్ణ విశ్వసించిన రాధయును, వీరువురే బ్రహ్మవిద్యను పూర్తిగా తెలిసిన బ్రహ్మ జ్ఞానులు.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Friday, June 18, 2010

అంతరార్ధమును బోధించాలి

"మచ్ఛిత్తా మద్గత ప్రాణాః బోధయంతః పరం పరం కద్గయన్తశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతిచ" అని అన్నారు స్వామి భగవద్గీతలో. దీని అర్ధము నా యందే మనస్సును ప్రాణములను నిలిపి నా గురించి ఒకరికి ఒకరు చెప్పుకొనుచు ఆ కధలలోని నా తత్వమును లేక అంతరార్ధమును బోధించుకొనుచు ఆనందముతో నా భక్తులు నిత్యము రమించు చుందురు అని ఈ శ్లోకార్ధము. మనస్సు పరమాత్మ యందు ఎప్పుడు లగ్నమగునో అప్పుడే స్వామికి నీ వాక్కు, దేహము, ప్రాణములు కూడ అర్పించ బడుచున్నవి. ప్రాణము వాయు స్వరూపమై యున్నది. మరణించిన తర్వాత శ్వాస ఆగిపోవుచున్నది. ఈ శ్వాసయే వాయువు కావున ప్రాణము అనగా వాయువు పంచభూతములలో ఒకటి. పంచభూతమైన ఈ శరీరములో వాయువు కూడ ఒక భాగమే. కావున ప్రాణము కూడ దేహము అను శబ్ధములోనికే వచ్చుచున్నది. "దహ్యతే ఇతి దేహః" ఎదో ఒక సమయమున దహించబడవలసినదే అని దేహ శబ్ధమునకు అర్ధము. కావున ఈ దేహమును స్వామి కొరకు దహనము కావించిన గోపికలు ధన్యులు. స్వామి నిర్యాణము చెందినారని వినగనే గోపికలు అగ్నిలో దూకి తమ దేహములను దగ్ధము చేసినారు. కాని అందరు గోపికలు అట్లు చేయలేకపోయినారు. మిగిలిన గోపికలను అర్జునుడు తీసుకొని వచ్చుచుండగా దారిలో కిరాతకులు కొల్లగొట్టి ఆ గోపికలను అపహరించుకొనిపోయి హింసించి చంపి తిన్నారు. అగ్నిలో దూకిన గోపికలు నేరుగా గోలోకమునకు పోయినారు. దేహము మీద మమకారమున్న గోపికలు కూడ నాలుగు దినములలో మరణించినారు. కాని వారు గోలోకమునకు పోలేదు. వారికి స్వామిపై నున్న మమకారము కన్న వారి దేహములపై మమకారము ఎక్కువగా యున్నది. కొందరికి ఈ దేహ సంబంధమున్న ఇతర జీవులపై మమకారముండును. కొందరు స్త్రీలు భర్తలతో పాటు సహగమనము చేసెడివారు. ఈనాడు రాజకీనాయకుడు యొక్క వీరాభిమాని తనను తాను దహనము చేసుకొనుచున్నాడు. కావున దేహబంధము దేహమునకు సంభంధించిన వ్యక్తుల బంధము, దేహ బంధము లేకపోయినను, తాను అభిమానించిన వ్యక్తిపై బంధము. ఇట్లు అనేక విధములైన వ్యామోహములు జీవుని చుట్టిముట్టి యున్నవి. స్వామి మానవ శరీరమును తాల్చి కృష్ణ పరమాత్మగా వచ్చినపుడు స్వామిపై కూడ భక్తులకు బంధము ఏర్పడును. ఈ బంధము జీవుని యొక్క అన్ని బంధములతో పోటిపడును. ఈ పోటీలో స్వామి బంధముతో సమానమైన బంధము ఏ ఇతర జీవుల మీద కాని, ఏ వస్తువుల మీద కాని చివరకు తన దేహము మీద కాని కూడ లేదని నిరూపించిన జీవుడే దత్త పరీక్షలో పూర్ణముగా ఉత్తీర్ణుడగుచున్నాడు. దీనినే శ్రుతి "నతన్‌ సమశ్వా ద్యది కశ్చ సూర్యతే" అనగా ఆయనతో సమానమైన వస్తువు కాని వ్యక్తి కానిలేదు. ఇక ఆయనకు మించిన వస్తువు గాని, వ్యక్తిగాని ఎట్లుండును అని అర్ధము.

పట్టాభిషేక సమయమున జానకీదేవి యిచ్చిన ముత్యాల హారమును హనుమంతుడు చూచి కొరికి పారవేయుచున్నాడు. జానకీ మాతను అట్లు అవమానించి నందులకు సభ్యులకు కోపమువచ్చినది. వారందరు ఇది ఏమి పనియని కోపముతో కేకలు పెట్టినారు. ఈ ముత్యములలో రాముడు లేడని పారవేయుచున్నాను అని హనుమంతుడు పలికెను. అట్లైనచో నీ హృదయములో రాముడు ఉన్నాడా అని వారు అడిగినారు. హనుమంతుడు తన గోళ్ళతో తన హృదయమును చీల్చి రాముని చూపినాడు. ఈ కధను చెప్పుకొనుటయే శ్లోకములో "కధయంతశ్చ" అని చెప్పబడినది. కాని కధను మాత్రమే శ్రవణము చేయుట పురాణ శ్రవణమగును. దీని వలన పెద్ద ప్రయోగము లేదు. అందుకే "బోధయంతః" అన్నారు. అనగా ఆ కధలోని అంతరార్ధమును బోధించవలెను. కధ లేక కేవలము వేదాంత తత్త్వబోధ భాష్య ప్రవచనమందురు. ఇది పండితులకు మాత్రమే ఆనందమును కలలిగించును. పామరులకు కేవలము కధ మాత్రమే ఆనందము కలిగించును. ఒకటి అతివృష్టి మరియొకటి అనావృష్టి. ఈ రెండింటి యొక్క మిశ్రమమే సత్సంగము అందురు. ఇందులో కధాశ్రవణము, జ్ఞానబోధ రెండూ ఉండును. ఈ రెండింటిని సమన్వయము చేసినపుడే అటు పామరులకు అటు పండితులకు ఈ రెండింటి మధ్య వారికి పరిపూర్ణ ఆనందము లభించును. ఇట్టి సత్సంగము నందు దేవలోకములోని అమృతము కూడ దిగదుడుపే అగును. ఋషులు పురాణములు శాస్త్రములు వ్రాసినారు. ఈ రెండింటి సమన్వయములే ఉపనిషత్తులు. వీటిని వేదాంతము లందురు. అనగా జ్ఞానము యొక్క శిఖరాగ్రస్ధాయిలో ఉన్నవి అర్ధము. ఇంతకునూ ఇప్పుడు చెప్పిన కధలో జ్ఞానబోధ ఏమి? హనుమంతునకు ముత్యములలో రాముడు ఎందుకు కనిపింలేదు? సర్వ జగత్తులో పరమాత్మ ఉన్నప్పుడు ముత్యములలో ఏల లేడు? "నేతి నేతి ద్వివిధః" అని శ్రుతి చెప్పుచున్నది. అనగా ఇది కాదు, ఇది కాదు అని సృష్టిలోని ప్రతి వస్తువును త్యజించినారు అని శ్రుతికి అర్ధము. గీతలో కూడ "నా హంతే స్వదక్షితః" అన్నారు స్వామి. అనగా ఈ జగత్తులో దేని యందునులేను అని అర్ధము. మరియొక చోట గీతలో "నత్వహంతేషు తేమయీ" అన్నారు. అనగా ఈ జగత్తులో నేనెక్కడను లేను. ఈ జగత్తు నాలో ఉన్నది అని అర్ధము. మరియొక చోట గీతలో "యయేదం ధారయతే జగత్‌" అన్నారు. ఈ జగత్తును నేను ధరించి ఉన్నాను అని అర్ధము. కావున పరమాత్మ జగత్తుకు ఆధారంగా ఉన్నాడు. అంతే కాని జగత్తులో ఏ వస్తువునందును ఏ వ్యక్తి యందును పరమాత్మ లేడు.

ఈ జగత్తుకు పరమాత్మకు ఆధేయ ఆధార సంబంధము ఉన్నదని శ్రీ రామానుజా చార్యులు తన భాష్యములో స్ధాపించినారు. అనగా బల్ల ఆధారము. బల్ల మీద ఉన్న వస్తువులు ఆధేయములు. వస్తువులలో బల్ల లేదు. బల్లలో కూడ వస్తువులు లేవు. కావున వస్తువులలోని వికారము బల్లకు అంటవు. ఈ తత్త్వమును నిరూపించుట కొరకే హనుమంతుడు ముత్యములను కొరికి పారవేసినాడు. కాని నీలో పరమాత్మ ఉన్నదా? అని సభ్యులు ప్రశ్నించినపుడు నాలో పరమాత్మలేనిచో ఈ దేహము కూడ వ్యర్ధమే. నాకు అక్కర లేదు అని తన గోళ్ళతో హృదయమును చీల్చినాడు. ఆ గోళ్ళు గుండెలోనికి దిగబడి గుండెకాయ ముక్కలు ముక్కలుగా చీలినది. అనగా స్వామి కొరకు ప్రాణార్పణము చేసినాడు. ఇదే "మద్గత ప్రాణాః" అని శ్లోకములో చెప్పబడినది. ఆ విధముగా గుండె చీల్చి ప్రాణత్యాగము చేయుటకు సభ్యులు ఎవ్వరును సాహసించలేదు. ఏలననగా, వారిలో పరమాత్మ లేడు. అప్పుడు హృదయమున రాముడు గోచరించినాడు. అనగా మహా భక్తుడగు హనుమంతుని యందు పరమాత్మ ఉన్నాడని అర్ధము. "తన్మయాహితే" అను నారద భక్తి సూత్రము గలదు. దాని అర్ధము భగవంతుడు తన మహా భక్తులను ఆవేశించి యుండును. అట్టి మహా భక్తుడు ఎవరు? భగవంతుని కొరకు ప్రాణములను తృణముగా గణించు వాడే మహా భక్తుడు. భక్తులను భగవంతుడు ఆవేశించి యుండుట ఆవేశావతారమని చెప్పబడును.

పరమాత్మ భక్తుల యొక్క సాధనలో సాయపడుటకు ఒక మనుష్య శరీరము ధరించి వచ్చును. అదియే రామావతారము. అట్టి మనుష్య శరీరములో ప్రత్యేకమైన జీవుడు ఉండడు. అట్టి శరీరము ఒక వ్యక్తి ధరించిన చొక్క వంటిది. ఆవేశావతారము అట్లు కాదు. ఒక శరీరము చొక్కలోకి ఆ ధరించిన వ్యక్తితో పాటు మరియొక వ్యక్తి దానిలోకి దూరుట. వర్షములో ఒక పెద్ద రైన్‌కోటులో దూరి ఇరువురు కలసి వచ్చుట మనము చూతుము. ఇదే ఆవేశావతారము. అనగా హనుమంతుని శరీరము అను చొక్కలో హనుమంతుడు అను జీవుడు ఉన్నాడు. దాని లోనికి రామ శరీరమను చొక్కను ధరించిన పరమాత్మ దూరినాడు. దీనినే ఋగ్వేదము ఇట్లు చెప్పుచున్నది. "ద్వా సుపర్ణా సఖాయ" అనగా ఒకే వృక్షమును మంచి మైత్రి కలిగిన రెండు పక్షులు కలసి ఆశ్రయించి ఉన్నవి అని అర్ధము. వృక్షము అనగా భక్తుని శరీరము. ఈ రెండు పక్షులే జీవాత్మ పరమాత్మలు. రాముని శరీరము కూడ వృక్షమే. దాని యందు పరమాత్మ పక్షి మాత్రమే ఉన్నది. హృదయమును చీల్చక ముందు హనుమంతుడు అను జీవుడు అనగా హనుమంతుని శరీరము అను వృక్షము నందు హనమమంతుడు అను జీవుడు ఒక పక్షే ఉన్నది. ఇప్పుడు హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు రామ శరీరముతో పాటు పరమాత్మ దర్శన మిచ్చినాడు. శరీరమును ఆశ్రయించనిచో దర్శనము అసంభవము. శరీరము పంచభూతములతో నిర్మించబడవచ్చును. మనుష్య శరీరము పంచభూతములై యున్నది. దేవతా శరీరములో కేవలము అగ్ని (తేజస్సు) అను ఒకే భూతము చేత నిర్మించబడినది. పిశాచ శరీరము కొన్ని కేవలము వాయువు చేతను, మరికొన్ని వాయువు చేరిన అగ్ని తేజస్సుచేతను మరికొన్ని వాయువు, తేజస్సు, జల కణముల చేతను నిర్మించబడియుండును. వాయు, తేజో జలములు కలసి నప్పుడు ఆ శరీరము ధూమ, శరీరములనబడును.

కావున పంచభూతములకు అతీతమైన అనగా సృష్టికి అతీతమైన పరమాత్మను దేవతాదులు సహితము దర్శింపజాలరు. దర్శనమే కాదు దేవతలకు సైతము ఊహించజాలక ఉన్నారు. అందుకే ఋగ్వేదము "కస్త్మేదేవాయ హవిహవిధేమ" అని చెప్పుచున్నది. అనగా ఆ దేవునకు ఎవరని నిర్ణయించి ఈ హవిస్సును ఇవ్వగలము అని అర్ధము. అది అందరాని బ్రహ్మము. శ్రీ రాముడు అందివచ్చిన బ్రహ్మము. హనుమంతుని హృదయములో కూడ నరాకారమును ధరించి వచ్చిన శ్రీ రాముడే కనిపించినాడు. హనుమంతుని హృదయములో కనిపించిన శ్రీ రాముడు తేజోమయమైన దేవతా శరీరముతో కనిపించినాడు. పంచ భూతమయమైన హనుమంతుని హృదయములో, పంచ భూతమయమైన రాముని శరీరము గోచరించుట ప్రకృతి నియమ విరుద్ధము. తేజోమయ శరీరము కనిపించుట కూడ ప్రకృతి నియమమునకు అతీతమై యున్నది. కావున వీలగునంత వరకు ప్రకృతి నియమములకు ఎక్కువ భంగము కాకుండగనే పరమాత్మ మహిమలు చేయును. కావున పరమాత్మ తేజోమయమైన దేవతా శరీరము కలిగి, అవతరించునపుడు మాతృ గర్భమున ఏర్పడిన పంచభూతమయ శరీరము తేజోమయ శరీరుడై ఆవేశించుచున్నాడు. ఆ తేజోమయ శరీరము యొక్క అవయవములు పంచభూత శరీర అవయవములలో ఇమిడిపోవును. ఇదే నేత్రమునకు నేత్రము అని కేనోపనిషత్తు చెప్పుచున్నది. హనుమంతుడు హృదయమును చీల్చినప్పుడు ఈ తేజోమయ శరీరము అణిమ యను సిద్ధి ద్వార సంక్షిప్తమై హృదయమున గోచరించినది. అవతార శరీరము, నిర్యాణము చెందినపుడు ఈ పంచభూత శరీరము నుండి ఆ తేజోమయ శరీరము వెడలిపోవును. అట్టి కృష్ణుని శరీరమునకు అర్జునుడు దహన సంస్కారములు కావించినాడు. కాని ఆ తేజోమయ శరీరము ఈ పంచభూత శరీరమును ఆపాదమస్తకము వ్యాపించి యున్నప్పుడు లోహపు తీగెను విద్యుత్తు వలె సంపూర్ణముగా వ్యాపించి యుండును. కావున అద్వైతమే. ఇదే అంది వచ్చిన పరబ్రహ్మము. విశ్వరూపమును ప్రదర్శించినపుడు ఈ తేజోమయ శరీరము మహిమ అను సిద్ధి ద్వారా అనంతమై గోచరించిది. ఆ తేజ శరీరము విశ్వమంతయు వ్యాపించి విశ్వమును తనలో చూపినది. ఆ తేజ శ్శరీరములో కురుక్షేత్రము కూడా ఉన్నది. ఆ కురుక్షేత్రములో పంచభూతమయమైన కృష్ణ శరీరము కూడ ఉన్నది. శ్రుతి "వివృణుతే తనూంస్వామ్‌" అని చెప్పుచున్నది. అనగా మహా భక్తుడు ఆ తేజోరూపమును చూడగోరినపుడు ఈ అవతార పురషుడు తనలో ఇమిడి ఉన్న ఆ చిన్న తేజోరూపము అను తనువును విస్తరించి ప్రకటించును. ఒక చిన్న వాక్యమునకు వ్యాఖ్యానించునపుడు ఎట్లు విస్తారమైన దాని యందున్న అర్ధము ప్రకటించబడునో అట్లు ప్రకటించబడును అని "వివృణుతే" అను క్రియా పదమునకు అర్ధము. ఆ యోగీశ్వర రూపము సహస్ర సూర్య తేజస్సుతో చేయబడినది అని చెప్పబడినది. "దివి సూర్య సహస్రస్య" అది నాశనము లేనిది కావునే "దర్శమాత్మాన మవ్యయం" అని చెప్పబడినది. పంచభూతములు విడిపోవచ్చును. కాని ఒకే భూతమగు తేజస్సు విడిపోదు. కావున నాశనము లేదు. మరల ఆ విశ్వము రూపము ఉపసంహరించినపుడు ఆ తేజో రూపము సంక్షిప్తమై కృష్ణుని శరీరమందు లీనమైనది. ఈ తేజో రూపము అవతార పురుషుని పంచభూత శరీరము నందు దాగి ఉండి ఒక్కొక్కసారి కొంచెము ప్రకటితమగుచుండును. అప్పుడు పంచభూత శరీరము కాంతితో వెలుగును. ఇదే ముచుకుందునకు కృష్ణుడు చూపిన దర్శనము. ఆ తేజో రూపము యొక్క తేజస్సు పంచభూత శరీరములోని ఒకానొక అవయవము నందే వ్యక్తము కావచ్చును. అదియే దివ్య దర్శనములు. కాని సాధకుడు వీటి గురించి భ్రమపడరాదు. ఏలననగా ఆ తేజస్సు జడమైన ఒక భూతమే కదా! మనము సూర్య తేజస్సు లోకములో చూచుచునే ఉన్నాము గదా. దృతరాష్ట్రుడును విశ్వరూపమును దర్శించెను. కాని ప్రయోజనమేమి? రాధ ఎప్పుడును ఇట్టి దర్శనమును పొందలేదు. ఆయనలో ఆ తేజస్సు కన్నను చైతన్యమయమైన ఆయన ప్రేమ చాలా గొప్పది. దానిని ప్రకటింప చేసిన సాధకుడు ధన్యుడు.

At the lotus feet of Shri Datta swami
-Durgaprasad

Monday, May 17, 2010

జ్ఞానము, ప్రేమ, ఆనందము

జ్ఞానము బ్రహ్మ, ప్రేమ విష్ణువు, ఆనందము శివుడు. ఇదే త్రిమూర్తి తత్త్వమైన వైదిక కళ్యాణ గుణ సంపద. ఈ మూడు గుణముల చేత త్రిమూర్తి స్వరూపుడైన గురుదత్తుని సులభముగా గుర్తించవచ్చును. కాని పామరులు, అష్టనిద్ధులగు మహిమల ప్రదర్శనము ద్వారా గురువుగా, దైవముగా గుర్తించుచున్నారు. ఈ పామర జనులు శిశువుల వంటి వారు. ఎవడు కిరీటము ధరించి రాజు వేషములో వచ్చునో, వాడినే రాజుగా తలచు అజ్ఞానులు. ఈ సిద్ధులు కొన్ని యంత్ర, తంత్ర, మంత్రముల ద్వారా ఎవరైనను సాధించుకొన వచ్చును. అనగా ఎవడైనను రాజు వేషమును వేయవచ్చును. కావున ఇట్టి పామరులు అట్టి క్షుద్ర మాంత్రికులు, రాక్షసులు శిష్యులుగా మారి, గుడ్డి వానిని గుడ్డి వారు పట్టుకొని వానితో సహా నిత్య నరకమను కూపములో పడుచున్నారు. వాడు కొన్ని సిద్ధులను సంపాదించినవాడే కాని జ్ఞానాంధుడు. ఇట్టి గురువులే "బాధిత గురువులు" ఈ బాధిత గురువులు అంతరార్ధమును వివరించి జ్ఞాన మార్గములో నడిపించ లేనివారు. వీరు కేవలము బాహ్యదృష్టితో భౌతికార్ధముతో ద్రవ్య తత్త్వమైన అజ్ఞానాంధకార మార్గములో శిష్యులను నడిపింతురు. వీరు యజ్ఞములను చేయించుటకు, చందాలు వసూలు చేసి ఆ ధనములో 90 శాతము వారు సంగ్రహించి, మిగిలిన 10 శాతమును నేయిగా మార్చి అగ్నిలో దగ్ధము చేయుదురు. ఈ యజ్ఞము వలన నేటి విజ్ఞాన శాస్త్రము ప్రకారముగా వాతావరణ కాలుష్యము పెరిగి అతివృష్టికి, అనావృష్టికి దారి చేయుచున్నది. ఈ గురువులు యజ్ఞములోని అంతరార్ధమును వివరించలేరు. ఈ శిష్యులు కూడ వారి వారి లౌకిక కార్యములు నెరవేరుటకు చందాలనిచ్చుచున్నారే గాని విశ్వ కళ్యాణమునకు కాదు. ఆ చందాలను వాడు కాజేసి పారిపోవగా ఈ శిష్యులు వానిని పోలీసులకు పట్టించుచున్నారు. వాడు చేసినది అధర్మమే. కానీ వీరు చేసినది అధర్మము కాదా! నాకు కాంట్రాక్టు రావలయునని, పదివేల రూపాయలు చందాగా యిచ్చుచున్నాడు. ఆ వచ్చిన కాంట్రాక్టులో పది లక్షల ప్రజాధనమును అపహరించుచున్నాడు. వీడు కూడ ప్రజల నుండి చందాలు వసూలు చేసి ధనమును దొంగిలించిన వాడు కాదా! వీరి దొంగతనము నిర్విఘ్నముగా నెరవేరుటకు దైవమునకు పదివేల రూపాయలు లంచము నిచ్చినాడు. వానిని పోలీసుల కన్న కఠినులగు యమభటులు పట్టుకొందురు. నారాయణుని పాలనలో ఎవరును దేనిని తప్పించుకొనజాలరు. మనుష్యజన్మ కడు దుర్లభము. మనుష్య జన్మ వచ్చినను భగవంతుని చేరయలయునని శ్రద్ధ ఉండుట ఇంకనూ దుర్లభము. ఈ రెండు ఉన్ననూ, మూడవది మరీ మరీ దుర్లభము. అది ఏమనగా నారాయణుడే నర రూపములో వచ్చి గురువుగా లభించుట. ఆట్టి పురుషునే అవతార పురుషుడు, మహా పురుషుడు లేక పురుషోత్తముడు అందురు.

"మనుష్యత్వం ముముక్షత్వం, మహాపురుష సంశయః" అనగా మనుష్య జన్మ దుర్లభము. మోక్షాసక్తి మరీ దుర్లభము. మహా పురుషుడు లభించుట మరీ మరీ దుర్లభము అని అర్ధము. ఇట్టి బాధక గురువులు జ్ఞాన తత్వము లేని వారైనందున జ్ఞాన యజ్ఞమును చేయలేక కేవలము ద్రవ్య యజ్ఞములతో గురువులుగా కీర్తి పొందుటకు ప్రయత్నించెదరు. వీరికి అంతర్ముఖ దృష్టి లేక కేవలము బాహ్యదృష్టితో ఆడంబరముగా యజ్ఞములు చేయుట, గుడులు ఆశ్రమములు కట్టించుట విచక్షణారహితముగా అన్నదానము చేయుట మొదలగునవి చేయుచుందురు. ఏ విధమైన పనియు చేసి సంపాదించుకొనుటకు చేతగాని, పసి బాలుడు, వృద్ధుడు, వికలాంగుడు మరియు రోగగ్రస్తుడు ఈ నలుగురు మాత్రమే అన్నదానమునకు అర్హులు. కాని ఈనాడు జరుగు అన్నదానములను చూచినచో, కోటీశ్వరులు కూడా వచ్చి, ప్రసాదము తినిన గాని వారి పనులు నెరవేరవని తలచి నాలుగు మెతుకులు నంజుకొని మిగిలినది పారవేయగా ఆ విస్తళ్ళను మురికి కుండిలలో పడవేయగా ఆ ఆహారము వలన రోగకారకములైన అనేక క్రిములు వర్ధిల్లుచున్నవి. చివరకు అన్నదానము రోగములను కలుగ చేసి ప్రాణులను హింసించు సూక్ష్మ క్రిములగు రాక్షసులకు చేరును. ఈ విధముగా ఈ అంధ గురువులు చేయు స్వకీర్తి కామముతో కూడిన ఆడంబరములతో కూడిన బాహ్య భౌతిక దైవ కార్యములతో గురువులకు గాని, శిష్యులకు కాని విశ్లేషణ విచక్షణ లేవు. దీనికి కారణము బ్రహ్మతత్త్వ గుణమగు జ్ఞానము లేకపోవుటయే. ఈ అజ్ఞానము చేత చేయు పనులన్నియు మహా పాపమునకు దారి తీయుచున్నవి. కాన వీరందరును, శాశ్వత నరకమున పడుదురు. "సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజ్నం సంతరిష్యసి" అని గీత. అనగా ఈ మహా పాపమను సాగరమును దాట దలచినచో, జ్ఞానము అను పడవను ఆశ్రయించుము.

గోటిచుట్టుపై రోకటి పోటు అన్నట్లు కొందరు పరమ మూర్ఖులు ఒకసారి గురువును ఎన్నుకున్నచో మరల మార్చరాదని వాదించుచున్నారు. దుష్టుడైనచో, భర్తనైనను విడాకులిమ్మని చట్టము ఘోషించుచున్నది. అట్లే దుష్టురాలైన భార్యను త్యజించమని మను స్మృతి చెప్పుచున్నది. "సజ్జస్వ ప్రియ వాదిని" అని మనుస్మృతి. అనగా ప్రేమతో నుండక ద్వేషముతో హింసించుచున్నచో అగ్నిసాక్షిగా వివాహమాడిన భర్తనైనను భార్య, బార్యనైనను భర్త త్యజించమని ధర్మ శాస్త్రములు చెప్పుచుండగా నిత్య నరక శాశ్వత హింసకు దారితీయు గురువును ఏల త్యజించరాదు? స్కూలులో ఒక విద్యార్ధి చేరినపుడు ఆ స్కూలు టీచరును గురువుగా భావించినాడు. ఆ తరువాత ఆ విద్యార్ధి కాలేజిలో చేరినపుడు కాలేజి లెక్చరరును గురువుగా భావించుచున్నాడు. ఆ తర్వాత యూనివర్సిటిలో చేరినపుడు అచ్చటి ప్రొఫెసరును గురువుగా భావించుచున్నాడు. గురువును త్యజించరాదని నేను గురువుగా స్వీకరించిన స్కూలు టీచరును వదిలి పెట్టనని, కాలేజి లెక్చరరు అగు మరియొక గురువును స్వీకరించనని కాలేజీలో చేరని వాడు ఎంత మూర్ఖుడో తన సాధన యొక్క దశ వృద్ధి అగుచున్న కొలది గురువులకు గురువైన గురుదత్తుని గురువుగా స్వీకరించక మొదట ఓనమాలు దిద్ది పెట్టిన గురువునే పట్టుకొని వేళ్ళాడు మూర్ఖులను గురించి ఏమందుము? గురు శబ్ధము కేవలము పరబ్రహ్మము నందే వర్తించును. ఏలయనగా జ్ఞానము చేత అజ్ఞానాంధకారమును పోగొట్టు వాడే గురువు శబ్ధమునకు అర్ధము. జ్ఞానము స్వరూపముగా కలవాడు "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అని శ్రుతి చెప్పుచున్నది. కావున గురు శబ్ధము పరబ్రహ్మమునకే వర్తించును. సృష్టి, స్ధితి, లయ కారకుడగు దత్తాత్రేయుడే పరబ్రహ్మము కావున దత్తుడు ఒక్కడే గురుశబ్ధముతో పిలువబడవలసిన వాడు. గురువే బ్రహ్మము, బ్రహ్మమే గురువు. ఈ రెండు వాక్యములకు తేడా కలదు. కఠినముగ ఉన్నది వజ్రము. వజ్రము కఠినముగా ఉన్నది అని రెండు వాక్యములలో ఉన్న బేధము గ్రహించిన చాలును! మొదటి వాక్యము ప్రకారము కఠినముగా ఉన్న రాయి కూడా వజ్రము కావలసి వచ్చును. రెండవ వాక్యము ప్రకారము వజ్రము కూడ కఠినముగా ఉండును. అనగా ప్రతి గురువు దత్తుడు కాడు. కాని దత్తుడు మాత్రము గురువే. అనగా నర రూపములో ఉన్న కృష్ణుడు నారాయణుడే. కాని నర రూపములో ఉన్న ప్రతి గోపాలుడు మాధవుడు కాదు. కావున గురువును ఎన్నుకొనునప్పుడే ఎంతో వివేకముతో ఎన్నుకొనవలెను. అనగా నారాయణ లక్షణములను తెలిసి నరరూపములో నారాయణుని గురువుగా ఎన్నుకొనవలెను. అంతే కాని కంటికి కనిపించిన ప్రతి శుంఠను కూడా గురువు, స్వామీ అని పిలచుట పరిపాటి అయినది. ఈనాడు రిక్షావాడు కూడా గురువు గారు బండి ఎక్కుతారా? అని అడుగుచున్నాడు. అట్లే నల్ల వస్త్రములను ధరించి నలుబది రోజులు కూడా సిగిరెట్లు, సారాయి వదల లేని వానిని అయ్యప్పగా, స్వామిగా పిలుచుచున్నారు. కావున నరరూపమున ఉన్న గురుదత్తుని మాత్రమే గురువుగా ఎన్నుకొనవలెను. నీవు ఆయనను వెతుక నక్కరలేదు. ఆయన పై విశ్వాసముతో ఆరాధించు చుండుము. ఆయన ఒకే సమయమున ఎన్నో రూపముల నెత్తగలడు. ఆయనయే స్వయముగా మీ ఇంటికి వచ్చును. ఆయనను గుర్తించి గురువుగా స్వీకరించిన తరువాత వదలిపెట్టకుము అనియే ఆ మాటకు అర్ధము. ఏలననగా ఆయన బహుమాయా ప్రదర్శకుడు. ఆయన మాయలో పడి విడిచివేయుదువేమో అని ఆ వాక్యము నిన్ను హెచ్చరించుచున్నది. గురువును వదలకుము అన్న వాక్యమును విచారించుము. గురుసాక్షాత్‌ పరబ్రహ్మ. గురువు అనగా శ్రీ దత్తుడే. కావున ఈ వాక్యమునకు, చివరకు ఏమి అర్ధము సిద్ధించినది? "శ్రీ దత్తుని వదలకుము" అని అర్ధము సిద్ధించినది. ఈ మాట చెప్పుటకు కారణమేమనగా, ఆయన మాయను చూపి జారిపోవును. కావున ఈ విధముగా శబ్ధములను, వాక్యములను, క్షుణ్ణముగా చర్చించి సత్యమును తెలుసుకొనుటయే "సదసత్వివేకము" అనబడును.
At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Monday, May 10, 2010

శ్రీ దత్తాత్రేయుడే సద్గురువు

శ్లో|| గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః
ఈ శ్లోకము త్రిమూర్త్యాత్మకుడగు శ్రీ దత్తాత్రేయుడే గురువుని స్పష్టముగా చెప్పుచున్నది. "గు" కారము అనగా అంధకారము "రు" కారము అనగా ఆ అంధకారమును పారద్రోలు ప్రకాశము అనగా అజ్ఞానమను అంధకారమును జ్ఞానము అను ప్రకాశము చేత పోగొట్టు వాడని అర్ధము. శ్రుతి కూడ "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" అనగా అనంతమైన సత్యమైన జ్ఞానమే బ్రహ్మమనియు, "ప్రజ్ఞానం బ్రహ్మ" అనగా ప్రశస్తమైన ఉత్తమమైన జ్ఞానమే బ్రహ్మము అని చెప్పుచున్నది. జ్ఞానము అను శబ్ధము చైతన్యము అను అర్ధములో పండితులు తీసుకొనుచున్నారు కాని ఈ అర్ధము సరికాదని మా అభిప్రాయము. ఏలననగా లోకములో ఎవరును చైతన్యమును జ్ఞానము అని పిలుచుట లేదు. చైతన్యము కలిగిన ఒక ప్రాణిని "జ్ఞాని" అని పిలుచుట లేదు. జ్ఞానము అను శబ్ధము ఒక విషయము అను అర్ధములోనే ఉపయోగపడుచున్నది. చైతన్యము కలిగి జ్ఞానము లేనివానిని అజ్ఞాని అని పిలుచుచున్నాము. కావున చైతన్యము వేరు, జ్ఞానము వేరు. జ్ఞానము చైతన్యము కల ప్రాణి వద్దనే ఉండును. ఆచేతనము వద్ద ఉండదు. జ్ఞానము ఉన్న ప్రతిచోట చైతన్యము ఉండవలెను. కాని చైతన్యము ఉన్న ప్రతిచోట జ్ఞానము ఉండనక్కరలేదు. సూర్యుడు ఉన్నచోట కాంతి ఉండును. కాని కాంతియున్నచో సూర్యుడు ఉండవలయునని నియమములేదు. రాత్రిపూట దీపకాంతి యున్ననూ, సూర్యుడు లేడు కదా. కావున జ్ఞానము అనగా, తర్క జ్ఞానము, వేదాంత జ్ఞానము, వ్యాకరణ జ్ఞానము మొదలగు శాస్త్రములలో ఉన్న విషయమే. లోకమును గురించిన జ్ఞానమే లోక జ్ఞానము. బ్రహ్మమును గురించిన జ్ఞానము బ్రహ్మజ్ఞానము. అన్ని జ్ఞానములలోను బ్రహ్మజ్ఞానమే గొప్పది. ఏలననగా బ్రహ్మము తెలిసినచో, సర్వము తెలిసినట్లేయని "సర్వం విజ్ఞాతం భవతి" అని శ్రుతి చెప్పుచున్నది. కావున సర్వజ్ఞానములలో బ్రహ్మ జ్ఞానము అనగా వేదాంత జ్ఞానమే గొప్పది. కావుననే దానిని "ప్రజ్ఞానం" అని అన్నారు. ప్రజ్ఞానము అనగా ప్రశస్తమైన జ్ఞానము అదియే అనంతమైన సత్యమైన జ్ఞానము. ఇచ్చట ప్రజ్ఞానం అనగా ప్రజ్ఞాని అని తీసుకొనవలయును. వ్యాకరణ శాస్త్రము ప్రకారముగా, ఎక్కువగా ప్రజ్ఞానము కలవాడు అనగా ప్రజ్ఞాని, ప్రజ్ఞానము అను శబ్ధము చేతనే పిలవబడును. కావున జ్ఞాని అనగా జ్ఞానము కలవాడు జ్ఞానము అనియే పిలువబడవచ్చును. కావున ఈ శ్రుతుల అర్ధము బ్రహ్మము అనగా సత్యమైన, అనంతమైన, శ్రేష్టమైన జ్ఞానము కలవాడే అని వచ్చును. కావున అతి శ్రేష్టమైన వేదాంత తత్త్వము యొక్క జ్ఞానము కల గురుస్వరూపమే పరబ్రహ్మ అని వేదార్ధము. ఇట్టి పరమ పవిత్రమైన బ్రహ్మ జ్ఞానమైన వేదాంతమును గీత ద్వారా చెప్పియుండుట చేత కృష్ణుడు జగద్గురువైనాడు. "కృష్ణం వందే జగద్గురుం" అని చెప్పబడినది. గీతలలో వివరించిన ముగ్గురు ఆచార్యులును జగద్గురువులే. ఉపనిషత్తుల సారమే భగవద్గీత. కావున ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు రెండును భగవద్గీత యందే లీనమైయున్నవి. ఈ బ్రహ్మ సూత్రములను వ్రాసిన వ్యాసుడు కూడా జగద్గురువే. ఆయన యొక్క జన్మతిధి యగు ఆషాఢ పూర్ణిమనే "గురుపూర్ణిమ" అనుచున్నాము. ఐతే వ్యాసుడు ఉపనిషత్తుల యొక్క సమస్వయమును చూపినాడు. కాని కృష్ణుడు ఉపనిషత్తుల సారమును పిండినాడు. వ్యాసుడు విష్ణువు యొక్క అంశ. కృష్ణుడు బ్రహ్మవిష్ణుశివాత్మకమైన దత్తావతారము. కావున వ్యాసుడు గురువైనచో కృష్ణుడు జగద్గురువైనాడు. కృష్ణుడే దత్తుడు. దత్తుడే కృష్ణుడు. కావున కృష్ణుడు దశావతారములలో పేర్కొనబడలేదు. దశావతారములలో ఏకమూర్తియైన విష్ణువు యొక్క స్వరూపములు. కృష్ణుడు త్రిమూర్తి స్వరూపుడై మూల విరాట్పురుషుడగు దత్తుడే. దత్తుడు గురువులకే గురువు. అందుకే ఆయనను "గురోర్గురుత్తరాయ నమః" అని చెప్పుచున్నారు. దత్తుని యొక్క పరిపూర్ణ తమావతారమే కృష్ణుడని భాగవతము చెప్పుచున్నది. అట్టి కృష్ణుడు పార్ధునకు బంధువుగా, చెలికానిగా, రధసారధిగా చిక్కి చివరకకు గీతను బోధించి గురువుగా లభించినాడు. అర్జునుడు కృష్ణుని పాదములపై "శిష్యస్తేహం శాధిమాం త్వం ప్రసన్నమ్‌" అనగా ఓ కృష్ణా! నీకు నేను శిష్యుడను. నీకు ప్రపత్తిని చేసి శరణాగతుడనై పాదములపై బడి ప్రశ్నించు చున్నాను అని చెప్పినాడు. పార్ధుడు తనను శిష్యునిగా చెప్పుకొని పరిపూర్ణ శరణాగతుడై అడిగినపుడు స్వామి గురు స్వరూపముతో గీతను బోధించినాడు. దీని అర్ధమేమి? శ్రద్ధతో, ప్రపత్తితో జ్ఞానదాహము గలవారికి జ్ఞానామృతము నీయవలయును. కావుననే కృష్ణుడు మరి ఎవ్వరికిని గీత చెప్పలేదు. అంతే కాదు అదే అర్జునుడు యుద్ధము ముగిసిన తర్వాత చక్కని విందు ఆరగించి, తాను తాంబూలము వేసుకొని, కాలక్షేపము కొరకు, కృష్ణుని మరల గీతను చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అర్జునా! ఆనాటి స్ధితి వేరు. ఈనాటి స్ధితి వేరు. మరల ఇప్పుడు గీతను చెప్పలేను అన్నాడు. దీని అర్ధమేమి? ఆనాటి కృష్ణుడు, ఈనాటి కృష్ణుడు ఒక్కడే. కాని ఆనాడు జ్ఞాన దాహముతో తపనతో జ్ఞానమును అర్ధించిన అర్జునుడు వేరు. ఈనాడు కాలక్షేపము కొరకు జ్ఞానమును అర్ధించు అర్జునుడు వేరు. కావున శ్రద్ధ లేనిదే జ్ఞానమును బోధింరాదు. కాని ఈనాడు జ్ఞాన శ్రవణము చేయు జీవుల శ్రద్ధ పరమ హాస్యాస్పదముగ ఉన్నది.

గుడిలో పండితుడు చక్కగా భాష్యమును వివరించుచు బ్రహ్మజ్ఞానమును బోధించుచుండగా, పట్టుమని పది మంది కూడ అచ్చట ఉండరు. ఉన్న నలుగురిలో కూడ ఒకరు ఒత్తులను చేసుకొనుచుందురు. మరియొకరు కునికిపాట్లు పడుచుందురు. మిగిలిన ఇరువురు అమ్మాయి పురిటికి వచ్చినదా అని కబుర్లు చెప్పుకొందురు. ఈ బ్రహ్మజ్ఞాన శ్రవణము కూడ ఇంటి పనులన్నియు ముగిసి భోజనము చేసి నిద్రపోయి లేచి, తీరికగా యుండు సాయంకాల సమయము. ఆ సమయమునకు కూడ మరియొక నియమము ఉన్నది. ఆ రోజు సాయంకాలము, టి.విలో ఏ సినిమా వేసి ఉండకూడదు. ఆ రోజు ఆ సమయమున సినిమా ఉన్నచో శ్రోతలు రాకపోవుటయే కాదు ఆ శాస్త్రిగారు కూడ వచ్చుటలేదు. ఈ శ్రద్ధలకు బ్రహ్మ సాక్షాత్కారము కావలయును. ఈ లోకము వదిలిన మరుక్షణమే శాశ్వత బ్రహ్మలోక నివాసము కావలయును. చేతిలో ఉన్నది ఒక్క పైసా పదునాలుగు అంతస్తుల భవనము కొనుటకు బేరము చేయుచున్నాడు. యాజ్ఞవల్క్యుడు తత్త్వమును బోధించుచుండగా జనకుడు వినుచున్నాడు. ఆయన రాజ్యమగు మిధిలానగరము మంటలలో కాలిపోవుచున్నదని భటులు పరుగెత్తుకొని వచ్చి చెప్పినారు. దానికి జనకుడు మిధిల పోయినచో పోనిండు. ఈ శరీరమే ఒకనాటికి అగ్నిలో భస్మమగు. ఈ సృష్టిలో నిశ్చలముగా నిలుచు పర్వతములు కూడా, చివరకు ప్రళయాగ్నిలో భస్మముకావలసినది. ఇంత చక్కటి జ్ఞానామృతము ఎచ్చట లభించును అని అచ్చట నుండి లేవలేదు. కొంతసేపటికి సత్సంగము ముగిసిది. మరల భటులు పరుగెత్తుకొని వచ్చినారు. అయ్యా! బూడిద నుండి మిధిలా నగరము సర్వ జనులతో పాటు యధాప్రకారముగా లేచి సృష్టించబడుటయే కాదు. అగ్నిలో కాలిన బంగారము వలే ద్విగుణీకృతమైన శోభతో వెలుగుచున్నదని చెప్పినారు. ఈ పరమ మూఢాతి మూఢులైన జీవులకు తెలియదు. పరబ్రహ్మమే ఇహపరములకు ఆధారము అని. ఈ సమస్త లోకమును సృష్టించిన వాడు పరమాత్మయే. ఈ సమస్త లోకములలో యున్న ప్రతి పరమాణువు ఆయన యొక్క సంకల్పవశమై యున్నది. ఈ జీవుడు తన మేధాశక్తిని అహోరాత్రులు ఉపయోగించి, కొన్ని సంవత్సరములు ప్రయత్నించిననూ, అణుమాత్రము పరిష్కారమునకురాని సమస్యలు ఆ పరమాత్మ సంకల్పము చేసిన క్షణకాలములో పరిష్కరించబడును. పరమాత్మ యందు మనస్సును లగ్నము చేయక లోక విషయములందు నిరంతరము మనస్సును లగ్నము చేసి సాధించునది క్షణకాల విజయములే. కాని పరమాత్మ యందు మనస్సును లగ్నము చేసినచో, ఇహపరములందు శాశ్వత విజయము కల్గును. వేరుకు నీరు పోసినచో చెట్టు మొత్తము పచ్చగా యుండి కళకళలాడుచుండును. వేరుకు నీరు పోయక, కొమ్మలను ఆకులను నీటితో తడిపిన ప్రయోజనము లేదు. ఒక్క క్షణకాలము చల్లగ నుండును. కాని చెట్టు మొత్తము ఎండిపోవుచున్నది. లోక విషయములందు మనస్సు కేంద్రీకరించు, లౌకికుడు కొమ్మలను ఆకులను తడుపు తెలివి తక్కువవాడు. వేరుకు నీరు పోయువాని వలె చూచుటకు చాదస్తునిగా కనిపించు ఎండిపోవుచున్న కొమ్మలను తడపక, వీడు నేల మీద నీటిని పోయుచున్నాడు అని వానిని మూఢులు విమర్శింతురు. భూమిలో ఆ చెట్టు వేరు దాగియున్నది. అతడు భూమిలో పోసిన నీరు వేరుకు చేరి వేరు ద్వారా చెట్టులోనికి ఎక్కుచున్నది. అసలు వేరు కనపడుట లేదు. కావున వానిని తెలివి తక్కువవానిగా భావించుచున్నారు. అట్లే ఇహపరములు అను కొమ్మలు ఆకులు గల ఈ సృష్టి వృక్షమునకు ప్రాణమూలమైన ఆధారమైన వేరు అగు బహ్మము మన కంటికి కనబడదు. ఆ బ్రహ్మము నరావతారము నెత్తిన గురుస్వరూపములో దాగియుండును. గోపికలు వ్యవసాయము, ఆవుల పనులను వదలివేసి నిరంతరము కృష్ణుని సంగములో యుండెడివారు. దాని వలన లౌకిక కార్యములు చెడకపోగా ఎంతో వృద్ధితో ఉండెడివి. గోవులకు ఏ రోగములు వచ్చెడివి కావు. చక్కగా రెండింతలు పాలు ఇచ్చెడివి. పంట పదదిరెట్లు పండెడిది. "ఏషాం సతయుక్తాన్నాం యోగక్షేమం వహామ్యహం" అని స్వామి గీతలో ప్రతిజ్ఞ చేశాడు. సతత యుక్తులు అనగా స్వామిని ఒక్క క్షణము కూడ వదలక ఉండెడి వారని అర్ధము. అట్టి వారి యొక్క యోగక్షేమములను స్వామియే చూతునని అర్ధము. యోగము అనగా పరలోకమున రక్షణము. క్షేమము అనగా ఇచ్చట లౌకిక సమస్యలు తీరుట. అయితే ఇది నారాయణుడే నర రూపములో వచ్చిన శ్రీ కృష్ణును విషయము. ఇట్టి నరావతారములే 'బోధక గురువులు' ఇట్టి నారాయణ అవతారమును నారాయణ తత్త్వముతోనే గుర్తించవలయును. నారాయణ శబ్ధమునకు అర్ధమేమి? "నారాం జ్ఞానం ఆయనం యస్యసః నారాయణః" అనగా జ్ఞానమునకు, ఆశ్రయమైన వాడు నారాయణ అని అర్ధము. కావున జ్ఞాన తత్త్వము చేతనే నారాయణుని గుర్తించవలెను. ఈ నారాయణుడు సకల కల్యాణ గుణ సంపన్నుడు. వేదములో చెప్పిన మొదటి కల్యాణ గుణము జ్ఞానము. అదే "సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ" ఇక వేదములో చెప్పిన రెండవ కల్యాణ గుణము "ప్రేమ". అదే "రసోవైసః" అని శ్రుతిలో చెప్పబడినది. ఇక వేదములో చెప్పబడిన మూడవ కల్యాణ గుణము "ఆనందము". అదే "ఆనందో బ్రహ్మేతి వ్యయానాత్‌" అని శ్రుతి చెప్పుచున్నది.

At the lotus feet of Shri Dattaswami
-Durgaprasad

Tuesday, May 4, 2010

జ్ఞానమే వేదము

గురు దత్త నామములో గురు శబ్దము జ్ఞానమునకు దత్త శబ్దము దానమునకు నిలచియున్నది. జ్ఞానమే వేదము. వేదమే విద్య. విద్య యొక్క ఫలమే వినయము. మరియు జ్ఞానము సత్వగుణము వలన పుట్టును. "సత్వాత్‌ సంజాయతే జ్ఞానం" ప్రకారముగా జ్ఞాన కారణమే సత్వగుణము. సత్యగుణము యొక్క తత్వము అహంకారరాహిత్యమే. అనగా వినయమే. కావున గురుదత్త శబ్ధము వినయముతో కూడిన దానమును సూచించుచున్నది. రజోగుణముతో కూడిన దానము అహంకారముతో కీర్తి ప్రతిష్టల కొరకు స్వార్ధముతో కూడి యుండును. కాని గురుదత్తుని తత్త్వము గుప్తదానమైయున్నది. అనగా దానము చేసి తన పేరును బయిటకు రానీయకుండుట. ఇదే సాత్విక వినయము. ఈ సృష్టిలో ఏ మంచి కర్మ జరిగినను, ఏ మహిమ జరిగినను దాని యొక్క కర్త గురుదత్తుడే. కాని ఆయన తన పేరును రానీయక వాటి కీర్తి ప్రతిష్టలను దేవతలకును భక్తులకును ఇచ్చుచున్నాడే తప్ప తన పేరును ప్రకటితము కావించుటలేదు. లక్ష్మణుడు మూర్ఛపోవగా రాముడు ఏద్చుచున్నాడు. హనుమంతుడు సంజీవి పర్వతమును తెచ్చి లక్ష్మణుని బ్రతికించినాడు. ఇచ్చట రాముని శక్తియే హనుమంతుని ద్వారా సంజీవిని పర్వతమును తెచ్చినది. ఆ కీర్తి తనకు రాకుండా ఆడిన నాటకమే లక్ష్మణ మూర్ఛ సమయమున రాముడు అసమర్ధునిగా విలపించుట జరిగినది. తనకన్న హనుమంతుడు గొప్పవాడని రామాంజనేయ యుద్ధమున నిరూపించి ఆ కీర్తి ప్రతిష్టలను హనుమంతునికి బలవంతముగా అంటకట్టి తాను గుప్తముగా యున్నాడు. అనగా స్వామి తన శక్తిని హనుమంతునకు గుప్తదానము చేసినాడు. ఇదే దత్త తత్త్వము. దత్త సేవకులును దత్త సేవ చేయునపుడు తాము స్వామికి సహకరించినా మన్న భావమును కలిగియుండక తమ పేరు ప్రతిష్టలు ఆశించక సేవ చేయవలెను. అట్టి గోరంత సేవకే దత్తుడు కొండంత ఫలము నిచ్చును. అట్లుకాక తమ పేరు ప్రతిష్టలను సేవను చేసినచో కొండంత సేవకు గోరంత ఫలమునే దత్తుడు ఇచ్చును. నిజముగా నీవు చేసిన సేవ ఒక సత్కర్మ. సత్కర్మను ఎప్పుడును దత్తుడే చేయును. కావున నీ ద్వారా దత్తుడు చేసిన ఈ సత్కర్మ యొక్క పేరు ప్రతిష్టలు దత్తునకే చెందవలెను. కావున నీ సేవను జనులు ప్రశంసించునపుడు "నేను నిమిత్తమాత్రుడను స్వామియే నా ద్వారా ఈ మహత్తర కార్యమును చేసినాడు. నేను తీగెను మాత్రమే. నేను ఫ్యానును తిప్పలేదు. నా ద్వారా ప్రవహించు కరెంటు మాత్రమే ఫ్యానును తిప్పినది అని చెప్పవలెను. ఇట్లు నీవు చెప్పుటలో అసత్యమేమియు లేదు. ఆ పనిని నీవే చేసి నీ యొక్క వినయము వలన దాని కీర్తిని స్వామికి ఇచ్చుచున్నానని భావించకుము. ఏలననగా అట్లు నీవు భావించినచో అది అసత్యమే కదా.

కావున నీవు వినయముతో పలుకుచున్నను అది సత్యమేనని గ్రహించుము. ఏలననగా కొందరు ఇట్లు పలుకుచు తమ వినయమునకు తామే మురిసిపోవుదురు. ఇది వినయము అన్న ముసుగులో దాగిన అహంకారము. కావున త్రికరణ శుద్ధిగా దత్తుడే చేసినాడని పలుకుము. ఇచ్చటనే వినయముతో మాట్లాడు వారు కూడ అహంకార సర్పము యొక్క నోట పడుచున్నారు. దీనినే సాత్విక అహంకారమందురు. అనగా నేను అహంకారము లేనివాడను అని అనుకొను అహంకారము. నిజముగా దత్తుడే చేసినపుడు దత్తుడే చేసినాడని చెప్పుటలో నీవు ఎందుకు పొంగి పోవుచున్నావు. నీ పొంగుకు కారణము నిజముగా నేను చేసిన పనిని నా వినయగుణము వలన దత్తునకే కీర్తిని అంటకట్టుచున్నాను అని భావించుట తెల్లని పాలగ్లాసులో యున్న చిన్న నల్లని నలుసు కణము వలె అహంకారము సంచరించుచున్నది. దీనినే ఆత్మాహంకారము లేక ఆత్మాభిమానము అందురు. ఇక రెండవది రాజసాహంకారము. ఇందులో దేహమే నేను అను అధ్యాస భావముతో ఈ దేహము యొక్క బలము శక్తి నేను అని భావించి నేను ఈ సత్కర్మను చేసినానని తన కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడుటయే రాజసాహంకారము. ఇక మూడవది తామసాహంకారము. ఇందు దేహము యొక్క శక్తియే కాక తన ధనము తన బంధువులు మొదలగు వారి శక్తి మొదలగు వాటి శక్తిని కలుపుకొని భావించుట. ఈ మూడు అహంకారములు లేని జీవుడే అత్రి. కావున రాజస తామస అహంకారములు లేకపోయినను శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ తానని భావించి ఆ ఆత్మ శక్తితో తాను చేసినానని తలచు సాత్వికాహంకారము కూడ దాటి తన ఆత్మ యొక్క ఈశ్వరుడగు పరమాత్మ యొక్క శక్తిచేతనే తాను చేసినానని తలచిన గాని అత్రి తత్త్వము సిద్ధించదు. కాని ఈనాడు అనేకులు తాము దత్తావతారములమని చెప్పుకొనుచు తమ తమ ఆశ్రమములగు రాజ్యములను నిర్మించుకొనుచు దత్తుడు తమ ద్వారా చేసిన సత్కర్మలను, మహిమలను తామే చేసినామని చెప్పుకొనుచు అనేక విధములుగా చిట్ట చివరి కీర్తికాంక్ష యను మహాకాల సర్పము యొక్క నోటిలోపడి పరమపదసోపాన పటమున జారి క్రిందకు పడుచున్నారు. వీరు 99 మార్కులు తెచ్చుకొని చిట్టచివరి ఒక్క మార్కులో పరీక్ష తప్పినవారు. భక్తులు వీరి చుట్టును చేరి నీవే పరబ్రహ్మవు అని గాలి పంపును కొట్టుచున్నారు. దానికి కారణము వారి స్వార్ధమే. ఒక మాహాత్ముడు తన శక్తిచేత ఒకరి రోగమును పోగొట్టినాడు. ఆ శక్తిని ఉపయోగించి తన రోగమును కూడ పోగొట్టుకొనవలెనని దాని కొరకు ఆ భక్తుడు ఆ మహాత్ముని ఆశ్రయించి నీవు పరమాత్మవు అని ప్రశంశించుచున్నాడు. మొదట మౌనముగా యుండి ఆ మహాత్ముడు అర్ధాంగీకారము తెలుపుచున్నాడు. ఆ తరువాత భక్తుల సంఖ్య పెరిగిన కొలది ఆ మహాత్ముడు నేనే దత్తావతారమని పదిమందిలో ప్రకటించుచున్నాడు. ఆ తరువాత మాయపొరలు దట్టము కాగా ఈ తరములో నేనొక్కడినే దత్తావతారమని ప్రకటించుచున్నాడు. కృష్ణుడు కూడా తాను పరమాత్మను చెప్పుకున్నాడు. కాని తాను పరమాత్మనని ఎప్పుడును అందరి ఎదుట మైకులో ప్రకటించలేదు. కేవలము అర్జునునకు మాత్రమే ఏకాంతముగా గీతాబోధ సమయమున అర్హుడైనందున ప్రకటించియున్నాడు. కావున అర్హత లేనివారికి, దత్తుడు ఎప్పుడును తాను దత్తుడనని ప్రకటించడు. అట్లు తనను తాను ప్రకటించినపుడు దానిని అర్ధము చేసుకొని అంగీకరించుటకు ఎన్నో జన్మల తపస్సు వలన కలిగిన చిత్తశుద్ధి కావలయును. అట్టివాడు కోటాను కోట్లలో ఒకడుండును.

"కచ్చిన్‌మాం వేత్తి తత్త్వతః" అని గీతలో చెప్పినాడు. ఎన్నో జన్మల తపస్సు వలన చిత్త శుద్ధుడై జ్ఞానియైన ఏ ఒక్కడో ఈ వాసుదేవుని కుమారుడే పరబ్రహ్మమని గ్రహించు వాడు మహాత్ముడనియు అట్టివాడు ఈ లోకములో దుర్లభుడనియు స్వామి గీతలో "బహునాం జన్మనామంతే జ్ఞానవాన్‌ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః" అని గీతలో చెప్పినారు స్వామి. కావున కోటాను కోట్ల జీవులలో ఏ ఒక్కనికో ఏకాంతమున ప్రకటించవలసిన ఆత్మ రహస్యమును ఈనాడు నకిలీ అవతార పురుషులు మైకులలో వేలాది భక్తుల ముందు ప్రకటించుచున్నారు. దీనిని బట్టియే వీరు దత్తావతారులు కాదనియు చాలా ఎత్తుకు పోయిన ఉన్నత సాధకులనియు చిట్ట చివరిలో కీర్తి కాంక్షయను ఒక్క మారులో దత్త పరీక్షలో తప్పిన జీవులనియు పరమాత్మ జ్ఞాన సంపన్నులగు జ్ఞానులు తెలియుదురు. పామరులు నూటికి ఒక్క మార్కు తెచ్చుకున్న వారినే దత్తుడనుచున్నారు. ఇక 99 మార్కులు తెచ్చుకొని ఒక్క మార్కులో తప్పిన వారిని దత్తునిగా ఏలభావించరు? కాని పరమాత్మ జ్ఞానమును నిశితముగా క్షుణ్ణముగా కలిగిన పండితులు ఈ స్వల్ప లోపమును కనిపెట్టగలరు. పరమాత్మను గురించిన పరిపూర్ణ జ్ఞానమే పండా అని చెప్పబడుచున్నది. పండాను కల్గిన వాడే పండితుడు. వజ్రము యొక్క లక్షణములను సంపూర్ణముగా తెలిసిన నిపుణుడు మాత్రమే నకిలి వజ్రముల నుండి అసలు వజ్రమును వేరు చేయగలడు. ఇది సామాన్య మానవులకు సాధ్యము కాదు. దత్తుడెప్పుడును గుప్తముగనే యుండును. తనను తాను ఎప్పుడును ప్రకటించుకొనడు. కారణము తన సత్యమైన తత్త్వమును ప్రకటించినచో గ్రహించ గలవాడు ఈ సృష్టిలోలేడు. ఏలననగా దేవతలు బ్రహ్మర్షులు సహితము సాత్వికాహాంకారమును దాటలేక ఉన్నారు. సాత్వికులగు దేవతలు అసురులను జయించినప్పుడు తమశక్తి చేతనే జయించినామని ఉత్సవములు చేసుకొనుచున్నారు. అందులో సురపతి యగు ఇంద్రుడు తమ యొక్క ప్రాధాన్యతను భావించుకొనుచున్నాడు. అప్పుడు వారి ఎదుట ఒక పెద్ద యక్షరూపము గోచరించినది. యక్ష రూపమనగా మహా తేజస్సు. అప్పుడు దేవతలు దాని వద్దకు పోయినారు. ఆ తేజస్సే కరెంటు. ఈ దేవతలే తీగెలు. దీనిని తెలియచెప్పుటకే దత్త పరబ్రహ్మము ఒక మహా తేజస్సు రూపములో సాక్ష్కాత్కరించినది. అగ్నిని "నీ శక్తి ఏమి" అని ఆ తేజస్సు ప్రశ్నించినది. "నేను అన్నింటిని కాలుస్తాను" అన్నాడు అగ్ని. అప్పుడు ఎండిపోయిన ఒక గడ్డిపోచను అగ్ని ముందు పడవేసి దీనిని కాల్చమన్న అగ్ని ఎంత ప్రయత్నించినను, దానిలోకి కనీసము వేడికూడ ఎక్కలేదు. ఇట్లు దేవతలందరును దత్త పరీక్షలో ఓడిపోయినారు. చివరిలో అహంకారము ఎక్కువ మోతాదులో ఉన్న ఇంద్రుడు వచ్చినాడు. ఆ ఇంద్రునితో మాటలాడుటకు కూడా తిరస్కరించి ఆ తేజస్సు అదృశ్యమైనది. అప్పుడు ఇంద్రుడు బాధపడుచుండగా ఆ దత్తుని సహధర్మచారిణి అగు ఉమ గోచరించి ఆ తేజస్సు పరబ్రహ్మ మని చెప్పినది. అప్పుడు ఇంద్రుడు కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేయగా గుర్రమును నడుపు శక్తి ఆ పరబ్రహ్మమేనను జ్ఞానము తలకెక్కినది. సర్వకర్మలను చేయు శక్తి పరమాత్మయే. కాని దుష్కర్మలను జీవుల యొక్క సంకల్పముల వలన చేయుచుందురు. సత్కర్మలు మాత్రము స్వసంకల్పము చేత చేసి తన భక్తులకు ఆ కీర్తి నిచ్చుచుండును. కావున అహంకారములను మూడింటిని దాటి అత్రియైన ఒకానొక జీవునకు మాత్రమే దత్తుడు తనను తాను ప్రకటించుకొనును. ఏలననగా ఆ ఒకానొక జీవుడు ఒకానొక సమయమున మాత్రమే ఆ అత్రి తత్త్వమును నిలుపుకొనగలుగు చున్నాడు. అర్జునుడు గీతాబోధ సమయమున మాత్రమే ఆ పరమాత్మ తత్త్వమును గ్రహించినాడు. పద్దెనిమిదో రోజు సాయంకాలమునకే మరల అహంకారమునకు వశుడై జారిపోయినాడు. కావున దత్తుడెప్పుడును అధమాధమ రూపములలో కనపడుచూ తన ఆత్మ తత్త్వమును మాయతో కప్పుకొనియే క్రీడించు చుండును. ఆత్మ తత్త్వమును ప్రకటించుటకు ఇష్టము లేకకాదు. దానిని గ్రహించు యోగ్యత గలవాడు లేడు కావున.

At the lotus feet of Shri Datta Swami
-Durgaprasad